GDWL: జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావులను మున్సిపల్ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ ఛైర్మన్ శంకర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని శాలువాతో సన్మానించి, గద్వాల పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందిస్తూ ప్రజల సంక్షేమానికి తమవంతు మద్దతు ఉంటుందని తెలిపారు.
SRPT: అనుమతి లేకుండా ఇసుక రవాణాతో పాటు కూడలిలో అక్రమంగా నిలువచేసిన ఇసుక డంపులపై, మంగళవారం కూడలిలో ఉన్నటువంటి ఇసుక డంపుల మీద రెవిన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు.ఈ దాడుల్లో అక్రమంగా నిలువ చేసినటువంటి ఆ డంపులను గుర్తించి 17 డంపులను అధికారులు సీజ్ చేశారు. ఈ డంప్లలో ఇసుక సుమారు 202 ట్రక్కులు అవుతాయని అధికారులు తెలిపారు.
VSP: ఆరిలోవలోని జరిగిన హత్య కలకలం రేపింది. భార్య దుర్గ (33) పై అనుమానంతో ఆమె భర్త చున్నీతో మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. లైఫ్ స్టైల్లో ఉద్యోగం చేసే నిందితుడు, హత్య అనంతరం తప్పించుకోలేక ఇంట్లోనే ఉన్న ఫ్రిడ్జ్ వెనుక దాక్కున్నాడు. అయితే, ఇంటి బయట నిలిపి ఉన్న బైక్ ఆధారంగా అనుమానం వచ్చిన పోలీసులు లోపల వెతకగా అసలు విషయం బయటపడింది.
BHPL: భూపాలపల్లి జిల్లాలోని మత్స్యకారులు, మత్స్య కృషీవలులకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2025-26 కింద మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ మంజూరు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వై. విజయ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల అర్హులైన మత్స్యకారులు జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో మార్చి 5వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
KMR: వనపర్తి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా పోటీల్లో కామారెడ్డి జిల్లా జట్టు ప్రతిభ కనబరిచి సీఎం కప్ సెకండ్ ఎడిషన్లో ద్వితీయ స్థానంలో సాధించింది. ఈ విషయాన్ని జిల్లా క్రీడాధికారి రంగా వెంకటేశ్వర్ తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, కార్యదర్శి కుమ్మరి నరేశ్, కోశాధికారి సతీశ్ జట్టు సభ్యులను అభినందించారు.
VZM: ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మెరకముడిదాం మండల కమిటీ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల అధికారిగా స్దానిక MRO సులోచన రాణి వ్యవహరించారు. మండల అధ్యక్షుడిగా తిరుపతిరావు, ఉపాధ్యక్షుడిగా ఆదినారాయణ, కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీలత, సంయుక్త కార్యదర్శి సావిత్రీని ఎన్నుకున్నారు. VRO హక్కుల కోసం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
NZB: మార్చి 14 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బంది ఎవరూ సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
MDK: కొల్చారం మండలం తుక్కపూర్లో మంగలి వసంతకు రూ.2 లక్షల బీమా క్లెయిమ్ చెక్కును ఎస్బీఐ రంగంపేట అధికారులు అందజేశారు. PMJJBY పథకం ద్వారా మంజూరైన ఈ ఆర్థిక సాయాన్ని సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు పంపిణీ చేశారు. ఆపద కాలంలో ప్రభుత్వ బీమా పథకాలు పేద కుటుంబాలకు కొండంత భరోసా ఇస్తాయని అధికారులు తెలిపారు.
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన చెంది బాలా గౌడ్ కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ రాజానర్సింహా, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు మంగళవారం ఆయనను పరామర్శించారు. బాధితుడికి వైద్య ఖర్చుల నిమిత్తం నగదు రూపంలో ఆర్థిక సాయం అందజేశారు.
అన్నమయ్య: కొత్తకోట మండలం రంగనాథపురంలో వృద్ధ దంపతులపై హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీధిలో గొర్రెలను తోలుకురావడంపై తలెత్తిన వివాదంలో కృష్ణప్ప, కృష్ణమ్మలపై అదే గ్రామానికి చెందిన ఆరుగురు కర్రలతో దాడి చేశారు. బాధితుల కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కాండ్లమడుగు క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.
KMM: ముదిగొండ మండలంలో రహదారుల అభివృద్ధికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భారీ నిధులు మంజూరు చేశారు. తల్లంపాడు – ముదిగొండ రోడ్డు విస్తరణకు రూ.33 కోట్లు కేటాయించడంతో ఏళ్లనాటి ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థుల విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.
SKLM: జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల సమస్యలు, పరిష్కారాల పై మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం రాత్రి తన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్ ఈ కేవీవీ సుబ్రహ్మణ్యంతో సమీక్ష నిర్వహించారు. కొండ పేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను రూ.4 కోట్ల అంచనాతో పూర్తి చేసి, 2,500 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
HYD: 300 డివిజన్లతో కూడిన GHMC మూడుముక్కలు కాగా.. GHMC, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లకు సంబంధించిన వెబ్ సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. GHMC వెబ్ సైట్ www.ghmc.gov.in, సైబరాబాద్ కార్పొరేషన్ cmc.telangana.gov.in, మల్కాజ్గిరి కార్పొరేషన్ mmc.telangana.gov.in వెబ్ సైట్లలో ప్రజలు సేవలు పొందే అవకాశం ఉందని తెలియజేశారు.
MDK: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో హవేలిఘనపూర్ మండల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందజేశారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
VKB: కొడంగల్లో బుగ్గప్ప హోటల్ వద్ద రోడ్డు అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. అదే విధంగా తాండూర్ రోడ్డులో బాలాజీ సూపర్ మార్కెట్ పక్కన మురుగు కాలువ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు రహదారుల వద్ద మురుగు కాలువలు ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.