KRNL: సోలార్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు ఇక నుంచి 1912 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. నమోదైన ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా సోలార్ విక్రేతలు పరిష్కరిస్తారని అన్నారు.
NZB: డిచ్పల్లి మండలం ధర్మారంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల (బాలుర) పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి గోవింద్ సింగ్ జాతీయ స్థాయిలో జరుగనున్న సబ్ జూనియర్ వాలీబాల్ (అండర్-16) పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్స్ దివ్యరాణి, లక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్వాతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
AP: ఏపీ పీజీ లాసెట్-26కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్ ఆచార్యులు సీతాకుమారి వెల్లడించారు. 3, 5 సంవత్సరాల LLB, రెండేళ్ల LLM కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు మార్చి 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 4న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్సైట్ను పరిశీలించాలని సూచించారు.
కృష్ణా: పెనమలూరు పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసుకు ముగింపు పలికింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నీళ్లు అడిగినట్లు నటిస్తూ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బాలికను అసభ్యంగా తాకిన స్వామియేలు దోషిగా తేలాడు. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం కోర్టు నిందితుడికి ఐదేళ్లు శిక్ష 2000 జరిమానా విధించింది.
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక ఎస్సీ హాస్టల్ వెనుకవైపు ఉన్న కంపచెట్లలో శుక్రవారం జూద స్థావరాలపై దాడులు చేసినట్లు డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. సిబ్బందితో దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి రూ.40,150ల నగదుతోపాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో గోపీచంద్ (29) అనే యువకుడు అదృశ్యమయ్యాడు. చాపవారి వీధికి చెందిన ఇతడు గొట్టుముక్కల రోడ్డులోని ఒక షాపులో పనిచేస్తున్నాడు. ఈ నెల 17న పనికి వెళ్లిన గోపీచంద్ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ విశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
NZB: జిల్లా నుంచి రాష్ట్ర ఛైర్మన్లుగా ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశమిస్తారా? అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. కాగా, జిల్లా నుంచి ఈరవత్రి అనిల్ కుమార్-మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మానాల మోహన్ రెడ్డి-సహకార యూనియన్, అన్వేష్ రెడ్డి-విత్తనాభివృద్ధి సంస్థ, తాహేర్ బిన్ హమ్దన్-ఉర్దూ అకాడమీకి రాష్ట్ర ఛైర్మన్లుగా కొనసాగుతున్నరు.
WNP: త్వరలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవిందస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వనపర్తి అదనపు కలెక్టర్ కీమ్యా నాయకు వినతిపత్రం అందజేశారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే స్థానిక సంస్థల్లో సముచిత రిజర్వేషన్లు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
TG: ఇవాళ్టి నుంచి వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో 10 రోజుల పాటు కాంగ్రెస్ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. AP, TG డీసీసీ అధ్యక్షులు పాల్గొనే ఈ శిబిరంలో భాగంగా నేతలు 11 గ్రామాల్లో బస చేస్తారు. మదన్పల్లిలో ఉపాధి పనుల్లో రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్, షర్మిల పాల్గొంటారు. ముగింపు కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.
BPT: కారంచేడు మండల పరిధిలోని దగ్గుబాడుకు చెందిన నాయుడు శ్రీరామమూర్తికి, ఆస్తి వివాదంలో తన వదినపై హత్యాయత్నం చేసిన కేసులో శుక్రవారం ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించింది. ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఎస్సై ఖాదర్ భాషా, పీపీ శ్రీనివాసరెడ్డి, పీసీ బాల శంకర్లను ఉన్నతాధికారులు అభినందించారు.
GDWL: మహిళా విద్య, రాజ్యాంగ అవగాహనతోనే ఉన్నతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాలలో జన విజ్ఞాన వేదిక (JUU) ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆడపిల్లల చదువు ఆవశ్యకత’ పోస్టర్, ‘బాలల కోసం భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
NZB: నవీపేట్ మండలం బాసర గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ వివరాలను నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని కాక్టైలి గ్రామానికి చెందిన అనసూయా దిలీప్ మోతెవాడ (23)గా నిర్ధారించారు. ఆమె దిలీప్ మోతెవాడ భార్యగా గుర్తించారు. వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
AKP: లీజు పేరుతో ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వవద్దని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం ధర్నా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎస్.డబ్ల్యూ.ఎస్. జిల్లా కార్యదర్శి పరమేశ్వర రావు మాట్లాడుతూ డిపోల మూసివేత చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
HNK: జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ఏయే దశల్లో ఉన్నాయో కలెక్టర్ స్నేహ శబరీష్ అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించగా.. మార్క్ అవుట్ అయినవి ఎన్ని, ఇండ్లు మంజూరై ఇంకా పనులు మొదలు కాని వాటి వివరాలు ఆయా శాఖల అధికారులు, ఎంపీడీవోలు కలెక్టర్కు వివరించారు. పనుల ఆలస్యానికి కారణాలను తెలుసుకున్నారు.
AKP: మునగపాక మండలం పాటిపల్లి ఏపీ మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓసీ, బీసీ, EWS వారు రూ.200, ఎస్సీ ఎస్టీ, PHC చెందినవారు రూ.125 దరఖాస్తు ఫీజుతో చెల్లించాలన్నారు.