MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) నుంచి స్వయం ప్రతిపత్తి (ఆటోనమస్) హోదా మంజూరు కావడం పట్ల జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. హుస్సేన్, అధ్యాపక బృందాన్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
SKLM: రైతు కన్నీరు ఆగాలంటే వంశధార నీరు రావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి హెచ్ ఈశ్వరరావు అన్నారు. కోటబొమ్మాలి మండలం జగన్నాథపురం గ్రామ యువజన సంఘం కార్యాలయంలో సోమవారం కొండపేట లిఫ్టు ఇరిగేషన్ జల సాధన కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మార్చి 4న జల దీక్షలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
TG: మాజీ మంత్రి హరీష్ రావును మన ఊరు-మనబడి కాంట్రక్టర్లు కలిశారు. పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు ఇవ్వాలని అడిగితే కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల ఉసురు తీస్తోందని హరీష్ రావు విమర్శించారు. వెంటనే కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కోనసీమ: అమలాపురం పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా బ్యాగ్ లిప్టింగ్ దొంగను అరెస్టు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. సోమవారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత నెలలో పట్టణంలో మహిళ నుంచి బంగారు ఆభరణాలు కాజేసిన కేసులో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంకి చెందిన బండి శివ పార్వతిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
AP: బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కమిషన్ వేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘స్థానిక ఎన్నికలు వచ్చే సమయానికి రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటాము. కొన్ని బీసీ వర్గాల నుంచి ఎస్సీ, ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్లు పరిశీలనలో ఉన్నాయి. గిరిజనుల కోసం తెచ్చిన జీవో 3ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై గిరిజనుల అభిప్రాయాలు సేకరించి ముందుకెళ్తాం’ అని తెలిపారు.
KMR: పిట్లం మండల కేంద్రం లో కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వమే అండగా ఉంటుందన్న భరోసాను కల్పించడమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
RR: న్యాయవాదులపై దాడులను అరికట్టాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని న్యాయవాదులందరూ సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా షాద్నగర్ న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో న్యాయవాద బార్ అసోసియేషన్ సభ్యులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. న్యాయవాద రక్షణ చట్టం అమలు చేయాలని తెలిపారు.
NLG: కొండమల్లేపల్లిలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ ఇంఛార్జ్ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. నల్గొండ పార్లమెంట్ అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే మన లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలన్నారు.
ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్ సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 8 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులు ఆన్లైన్లో నమోదు చేయాలని, వాటిపై తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.
TG: తన పేరుతో కొందరు సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ పేరిట కార్యకలాపాలపై కేటీఆర్ స్పందించారు. తన పేరులో ఎలాంటి సంస్థలు నిర్వహణకు అనుమతి లేదన్నారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలన్నారు. ఇలాంటి సంస్థలకు ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదన్నారు.
MBNR: హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ గేటు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగయ్య పల్లికి చెందిన హనుమంతు నాయక్ (70) తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేయి విరిగింది. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
MDCL: అల్వాల్ సర్కిల్ ప్రజావాణిలో బీజేపీ నాయకులు పలు సమస్యలపై అర్జీలు సమర్పించారు. రోడ్లపై చిన్నచితకా వ్యాపారాల వల్ల బాటసారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని డీసీ భోగేశ్వర్కు ఫిర్యాదు చేశారు. వెంకటాపురం కొత్తబస్తీ అంబేద్కర్ భవన్ను నామమాత్రపు రుసుముతో అందుబాటులో ఉంచాలని, భవనంలో విద్యుత్, నీటి సమస్యలు, బోర్వెల్ను మరమ్మతు చేయాలని బస్తీవాసులు కోరారు.
అన్నమయ్య: పరీక్ష రాయాల్సిన విద్యార్థి ఆసుపత్రి పాలైన ఘటన ఇది. రాజంపేట పిచ్చిగుంట్లపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థికి వీరబల్లిలో పరీక్షా కేంద్రం కేటాయించారు. ఇవాళ ఉదయం తన ఇంటి నుంచి బైకుపై పరీక్షా కేంద్రానికి బయల్దేరాడు. నీలవాండ్లపల్లి సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డుపై తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థిని స్థానికులు గుర్తించి రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
SRPT: రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ చాటారు. పరుగులో ఆర్ఎస్సై మహేష్, జావెలిన్ త్రోలో స్వామి బంగారు పతకాలు సాధించగా, పలువురు మహిళా కానిస్టేబుళ్లు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. సోమవారం విజేతలను ఎస్పీ కె.నరసింహ అభినందించారు. క్రీడల్లో రాణిస్తే పదోన్నతుల్లో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.
ASR: విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రమశిక్షణతో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని బ్రహ్మ కుమారీస్ ప్రతినిధులు అన్నారు. సోమవారం అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన నషాముక్తా అభియాన్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఉన్నత స్థాయికి ఎదగడానికి విలువలతో కూడిన విద్య, మంచి ఆలోచన పనులు, ప్రవర్తనకు ధ్యానం ఉపయోగకరమని ప్రిన్సిపాల్ డా. నాయక్ అన్నారు.