GNTR: వడ్లమూడి బాల కోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా సమగ్ర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను దేవస్థాన అధికారులు ఘనంగా సన్మానించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శాలువా కప్పి ప్రసాదం అందజేశారు. తిరునాళ్లకు భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో పోలీసుల పాత్ర కీలకమన్నారు.
సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం ఎలకుంట్ల గ్రామంలో చింతచెట్టు పైనుంచి పడి దాసరి రాము అనే వ్యక్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సంధా రాఘవ శనివారం మృతుడి నివాసానికి వెళ్లి భార్య ఓబులమ్మను పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.
NTR: గన్నవరం నుంచి బయలుదేరే షార్జా ఫ్లైట్ని శనివారం ఎయిర్పోర్ట్ అధికారులు నిలిపివేశారు. దీంతో సుమారు 163 మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే విషయంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. షార్జాలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సిబ్బంది వెల్లడించారు.
ATP: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధమని అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించే స్కానింగ్ కేంద్రాల అనుమతులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆడపిల్లల సంఖ్య తగ్గకుండా చూడాలని అన్నారు.
కోనసీమ: అమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలకు శనివారం రాట ముహూర్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని నియోజకవర్గ ప్రజలందరిపై ఆ స్వామి వారి కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.
CTR: చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావును ఇవాళ ఆయన కార్యాలయంలో జనసేన నాయకులు ఎం. మహేష్ స్వేరో, తవణంపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తవణంపల్లి మండలం, పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రసాదాలను ఎంపీకి అందజేశారు.
TG: మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదన్నారు. ఉద్యమంలో ఉన్నవాళ్లంతా వృద్ధులైపోయారని, మావోయిస్టు పార్టీలోకి కొత్త రక్తం రావడంలేదని చెప్పారు. తనను ద్రోహి అంటున్నారని.. వారికి కాలమే సమాధానం చెబుతుందన్నారు.
AP: వేద పండుతుల పోస్టుకు డబ్బులు వసూలు దుర్మార్గమని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని.. తమ హయాంలో 700 పోస్టులు మంజూరు చేశామన్నారు. 4 నెలల ముందు ఇంటర్వ్యూలు జరిగినా ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించలేదని తెలిపారు. తప్పులు చేస్తున్నారు కాబట్టే భయపడుతున్నారని.. BR నాయుడు ఆధ్వర్యంలో అరాచకం జరుగుతోందని ఆరోపించారు.
ఖమ్మం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్టేట్/సెంట్రల్ బోర్డు గుర్తింపు, గత ఐదేళ్లలో 7వ, 10వ తరగతుల్లో 90% పైగా ఉత్తీర్ణత, మెరుగైన సదుపాయాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
AKP: పరవాడ మండలం జాజులవానిపాలెం, పీ.బోనంగి, కలపాక మీదుగా దళాయిపాలెం వరకు రూ 4.40 కోట్లతో 12.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణంతో గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
NRPT: పదవ తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో పిల్లలు చదువుకునేలా ఇంటి దగ్గర తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని మీర్జాపూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం జనార్దన్ రెడ్డి సూచించారు. శనివారం మిర్జాపూర్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. 100% ఉత్తీర్ణతకోసం ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తున్నారని అందుకు తగ్గట్లు విద్యార్థుల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలన్నారు.
BDK: చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామంలో శనివారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి భోగ్ బండారో నిర్వహించారు. ముందుగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని ఎడ్ల బండిపై ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు బాబు నాయక్ పాల్గొని భోగ్ బండరో నిర్వహించారు. మహారాజ్ చూపించిన అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
HNK: మాతృభాష తీపిని ఆస్వాదించాలని, తెలుగు ఇతిహాసాలను చదవాలని, అమ్మ భాషను మరువవద్దని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలలో నిర్వహించిన వ్యాస రచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా కన్నతల్లి లాంటి మాతృభాషను విస్మరించకూడదని అన్నారు.
ADB: ఇచ్చోడా మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ సరస్వతి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో మాతృభాషను నిత్యం వినియోగిస్తూ, దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, మాతృభాష పరిరక్షణ ద్వారానే మన సంస్కృతి, మన ఉనికి నిలబడుతుందన్నారు.