NCERT: కొత్త విద్యా సంవత్సరంలో సిలబస్లో మార్పు, పాఠ్యపుస్తకాల విడుదలపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కీలక ప్రకటన చేసింది. 3,6వ తరగతులకు మాత్రమే కొత్త సిలబస్తో పాఠ్య పుస్తకాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మూడో తరగతి పుస్తకాలు ఏప్రిల్ చివరివారంలో ఆరో తరగతి పుస్తకాలను మే మధ్యకాలం నాటికి విడుదలవుతాయని వెల్లడించింది. అలాగే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించి 2023-2024 ఎడిషన్స్ పాఠ్య పుస్తకాలు 1.21 కోట్లు కాపీలు దేశవ్యాప్తంగా విడుదల చేసినట్లు తెలిపింది.
మారిన కరికులమ్కు అనుగుణంగా ఆరో తరగతి విద్యార్థులను ప్రిపేర్ చేసేందుకు వీలుగా ఉపాధ్యాయుల కోసం ఎన్సీఈఆర్టీ పోర్టల్లో బ్రిడ్జ్ కోర్సు అందుబాటులో ఉందని తెలిపింది. పాఠశాల విద్య కోసం నేషనల్ కరికులమ్ ఫ్రేమ్వర్క్ 2023ని అనుసరించి 2024-2025 విద్యాసంవత్సరంలో 3, 6 తరగతులకు మాత్రమే ఎన్సీఈఆర్టీ కొత్త పాఠ్య పుస్తకాలను తీసుకొస్తోంది. మూడో తరగతి పాఠ్య పుస్తకాలు ఏప్రిల్ చివరి వారంలో, ఆరో తరగతి పాఠ్య పుస్తకాలు మే మధ్యలో విడుదల చేస్తాం. 4, 5, 9, 11వ తరగతులకు బఫర్ స్టాక్ సిద్ధంగానే ఉంది.
అన్ని పాఠ్య పుస్తకాల డిజిటల్ కాపీలు మా వెబ్సైట్తో పాటు DIKSHA, ePathshala పోర్టల్, యాప్లలో ఉచితంగా లభిస్తాయని ఎన్సీఈఆర్టీ తెలిపింది. మరోవైపు 4, 5, 9, 11వ తరగతులకు సంబంధించి 27.58 లక్షల పుస్తకాలు విడుదలయ్యాయని.. ఈ తరగతులకు కొత్తగా మరో 1.03 కోట్ల కాపీలను ప్రింటింగ్ కోసం ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది. ఈ పుస్తకాలు మే 31 నాటికి అందుబాటులోకి రావచ్చని తెలిపింది.