MDK: రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
GDWL: గద్వాల ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి అయిజ పట్టణంలోని గాంధీ చౌక్ ఏరియాలో 50 మంది సిబ్బందితో డీఎస్పీ వై. మొగిలయ్య భారీ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 76 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించిన డీఎస్పీ, కాలనీల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
MDCL: అందాన్ని డబులు చేస్తామని ఉప్పల్ పరిధి గణేష్ నగర్ కాలనీకి చెందిన రమ్యకు మెసేజ్ వచ్చింది. నమ్మిన రమ్య కాల్ చేసి అడగగా డైరెక్ట్ ఆన్ లైన్ ద్వారా రూ.4,500 పేమెంట్ చేస్తే, వెంటనే ఇంటికి వస్తామని పేర్కొన్నారు. పేమెంట్ చేసి దాదాపు 15 రోజులు గడుస్తున్నప్పటికీ స్పందన లేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని రమ్య వాపోయారు.
BHPL: జిల్లా ఐడిఓసీ కార్యాలయంలో 10వ తరగతి ఉత్తమ ఫలితాల సాధన పై విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, DEO రాజేందర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను ఉత్తమ ఫలితాల్లో ముందంజలో నిలిపేందుకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
SDPT: ఆయిల్ ఫామ్ సాగుపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యానశాఖ, ఆయిల్ ఫామ్ అధికారులతో కలెక్టర్ హైమావతి సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫ్రైడ్ అధికారుల పనితీరు మందకోడిగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
HYD: మార్చి నెలలో ఎండలు ప్రారంభమై, 38 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా HYD అధికారులు తెలిపారు. దీని ద్వారా నీటి అవసరాలు సైతం పెరుగుతాయని వివరించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వీలుంటే గొడుగు తీసుకుని వెళ్లటం మంచిదని సూచించారు. నగరంలో వడగాలులు సైతం వీచే అవకాశం ఉందన్నారు.
HNK: వేలేరు మండల కేంద్రంలో నాబార్డ్, డీఆర్డీఏ సహకారంతో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ దుకాణాన్ని నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయంగా తయారు చేసిన హస్తకళలు, చేనేత బ్యాగులు, దుస్తులు వంటి గ్రామీణ ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ దుకాణం దోహదపడుతుందని తెలిపారు. ఇది ఆర్థికంగా ప్రోత్సాహం అన్నారు.
నిర్మల్లోని వెంకటాపూర్ కాలనీలో ఓ ఇంటి ఆవరణలోని వలలో చిక్కుకున్న కోతి సుమారు ఆరు గంటల పాటు విలవిలలాడింది. ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని శాంతినగర్కు చెందిన వన్యప్రాణి ప్రేమికుడు గరిగంటి అనిల్కు సమాచారం అందించారు. ఆయన తన మిత్రబృందంతో కలిసి 45 నిమిషాల పాటు శ్రమించి వలను కత్తిరించి కోతిని సురక్షితంగా విడిపించారు.
JGL: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 28వ వార్డులో ఇంటి పన్ను వసూళ్లలో 100 శాతం లక్ష్యాన్ని సాధించిన వార్డు ఆఫీసర్ కోడం రాజును మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ అభినందించారు. పూర్తి స్థాయిలో పన్ను వసూళ్లు జరిపి మున్సిపాలిటీకి ఆదర్శంగా నిలిచినందుకు రాజును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మేనేజర్ రాజిరెడ్డి, ఆర్ఎ భాస్కర్, పాల్గొన్నారు.
RR: మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని గచ్చిబౌలి ఏఈ భాస్కర్ తెలిపారు. నానక్ రాంగూడ, అలేఖ్య హోమ్స్, విజయకృష్ణ బిల్డింగ్, డోమినోస్ ఏరియా, గోల్ఫ్ వ్యూ, ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
BHPL: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరణ తప్పనిసరిగా పెట్టుకోవాలని MLA గండ్ర స్పష్టం చేశారు. గణపురం పోలీస్ స్టేషన్లో చక్రవర్తి హాస్పిటల్, శ్రీకాంత్ మిత్ర బృందం, జర్నలిస్టుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో MLA హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే సీజ్ చేయాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో SP పాల్గొన్నారు.
NLG: రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూల్లో ఆరవ తరగతిలో మొత్తం సీట్లు, 7-10వ తరగతుల్లో మిగిలిన సీట్ల ప్రవేశాల దరఖాస్తుకు నేడు చివరి తేదీ. ఇంగ్లీష్ మీడియంలో విద్య బోధన ఉంటుంది. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్ కావున ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కోరారు.
వనపర్తి జిల్లాలో కేంద్రం ప్రభుత్వం నిర్ణయంతో 15 ఏళ్లలోపు బాలికలకు HPV టీకా అందుబాటులో ఉంటుంది. ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణనిస్తుంది. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధా మాట్లాడుతూ.. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NZB: రుద్రూర్ మండల పరిధిలోని ఆహార సాంకేతిక కళాశాల వద్ద శుక్రవారం రాత్రి అక్బర్ నగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మొరం కుప్పను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్బర్ నగర్ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
KMM: ప్రజలకు లబ్ది చేకూరేలా కేంద్ర ప్రాయోజిత పథకాలను జిల్లాలో పూర్తి స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలనీ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా వచ్చిన వికసిత్ భారత్ జి రామ్ జి పథకం మార్గదర్శకాలు పాటించాలన్నారు.