RR: బాన్సువాడ హింసలో గాయపడిన బాదిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావును అడ్డుకుని నిర్బంధించడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట అని SDNR BJP నేత శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అసలు దుండగులను వదిలిపెట్టి బాధితుల పక్షాన నిలిచిన నాయకుడిని అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి ఉదాహరణ అన్నారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ డివిజన్లలో కనీస సౌకర్యాలు కల్పించి, అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టాలని CPI నాయకులు కనకరాజు, కార్పొరేటర్ మార్కాపురి సూర్య మేయర్ మహంకాళి స్వామిని ఆదివారం కలిసారు. మార్కండేయ కాలనీలో సమస్యలపై చర్చించి, పనులను తక్షణమే అమలు చేయమని కోరారు. గోశిక మోహన్, గౌతం గోవర్ధన్, తాళ్లపల్లి మల్లయ్య, శంకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
WNP: పట్టణంలోని 14వ వార్డు అధ్వాన్నంగా తయారైంది. స్థానిక బ్రహ్మంగారి ఆలయం వెనుక భాగం ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండి, ఒక మినీ డంపింగ్ యార్డ్ను తలపిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో హడావుడి చేసిన అధికారులు, ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వార్డు ప్రజలు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
VKB: బండల ఇళ్ల కారణంగా గృహలక్ష్మీ లబ్ధిదారులు అయినప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ పథకానికి అర్హత పొందలేకపోతున్నారని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ అన్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి కాంక్రీట్ రూఫ్ నిర్మాణం కోసం రూ. 2 లక్షలు మంజూరు చేసేలా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ చొరవ తీసుకోవాలని కోరారు. విద్యుత్ సమస్యలకు కూడా ఉపశమనం సాధించవచ్చని అన్నారు.
NGKL: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
SRPT: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే మా ప్రజా ప్రభుత్వ ద్వేయమని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట మండలం కాసరబాధ గ్రామంలో దూడిగ రాములు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నెరవేర్చి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలియజేశారు.
RR: చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు అరవింద్ రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అరవింద్ రెడ్డికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
HYD: శామీర్పేటలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే హౌస్ అరెస్ట్లో ఉన్న ఈటల నివాసానికి పోలీసులు మరోసారి చేరుకుని బయటికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిపై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వేడి గాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు.
MNCL: జన్నారం మండలంలోని సర్పంచ్లకు, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంపీవో జలంధర్ తెలిపారు. మంచిర్యాల మండలంలోని ముల్కాల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుంచి సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. మండలంలోని 10 గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు పోన్కల్ రైతు వేదికలో శిక్షణ ఉంటుందన్నారు.
SRD: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని MLA గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఫాల్గొన్నారు.
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా దరణి మధుకర్, డిప్యూటీ మేయర్గా సల్ల రమ్య మహేష్ ఆదివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. MLA సహకారంతో కార్పొరేషన్ను అభివృద్ధి పథంలో పయనించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
MBNR: కోయిలకొండ అంకిళ్ల గ్రామానికి చెందిన కావలి రామచందర్ ముదిరాజ్ తన అభిమాన నేత కేటీఆర్ను కలిసేందుకు హైదరాబాద్కు పాదయాత్ర చేపట్టాడు. కేటీఆర్ నాయకత్వానికి గౌరవం చూపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపారు. బంజారాహిల్స్ తెలంగాణ భవన్లో ఆయన కేటీఆర్ను కలిసిన తర్వాత మద్దతు తెలపడం లక్ష్యమని చెప్పాడు.
SRCL: జిల్లాలో ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్లు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
JGL: ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 5 లక్షలు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.