MHBD: గార్ల మండలం పూమ్యతండాలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన గూగులోత్ రవి (32) భార్యతో గొడవపడి, మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురికి దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో 30 వేల జనసేన సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేయాలని MLA దేవ వరప్రసాద్ సూచించారు. విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో ఆదివారం పార్టీ సభ్యత్వ నమోదుపై సమావేశం నిర్వహించారు. సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
PDPL: జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, శివాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం, శివాలయంలో కలశ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ సంపత్, పార్టీ నాయకులు ఎమ్మెల్యేను సత్కరించారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 20వ డివిజన్లోని రాజారెడ్డి కాలనీలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏన్నికైంది. కాలనీ అభివృద్ధి, శుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల, సామాజిక ఐక్యతను లక్ష్యంగా చేసుకొని కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా భాస్కర్, కార్యదర్శిగా విద్యాకర్, కోశాధికారిగా సంతోశ్ ఎన్నికయ్యారు.
SRPT: కోదాడ పట్టణానికి చెందిన చిత్రపు అన్నపూర్ణమ్మ (105) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు ‘శతాధికా సంబరాలు’ నిర్వహించారు. నేటికీ ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అన్నపూర్ణమ్మ తన జీవితకాలంలో ఐదు తరాలను మనుమలు, మునిమనుమలు చూసి ఆశీర్వదించారు. ఆదివారం కోదాడ పట్టణంలో కుటుంబ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు.
VZM: దేశంలో బీజేపీ మత విద్వేషాలను సృష్టిస్తోందని సీపీఐ రాష్ట్ర నాయకుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆరోపించారు. విజయనగరం అమర్ భవన్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకులు చేస్తున్న అకృత్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు.
ASR: కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం వారపు సంతను ఆదివారం కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ, మంప ఎస్సై శ్రీనివాస్ సందర్శించారు. వారపు సంతకు వచ్చిన మారుమూల గ్రామాల గిరిజనులతో సమావేశం నిర్వహించారు. రహదారి భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. వాహన రికార్డులను సక్రమంగా కలిగి ఉండాలన్నారు.
BHNG: ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామంలో ఆదివారం శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఉచితంగా జనరల్బి ఫిజీషియన్ డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ రాజ్ కుమార్ చే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, న్యూరోపతి, బిఎండి పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు.
AP: ఎల్లుండి ఛలో విజయవాడకు మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. 12వ PRC కమిషన్ ఏర్పాటు, జీతాలు పెంచాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్తో కార్మికులు ధర్నా చేయనున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.
MLG: గోదావరి నది జలాల వినియోగం, వివాదాలపై ప్రతిపక్షాలతో అసెంబ్లీలోనే చర్చించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నిర్వహించిన సమీక్ష సమావేశంలో CM మాట్లాడారు. చర్చలు జరగకుండా ఏ సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదని CM పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి పౌరుడికి త్రాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
JGL: పెన్షనర్ల పెండింగ్ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో ఆదివారం జరిగిన టీపీసీఏ జిల్లా స్థాయి సమావేశంలో పెన్షనర్ల సర్వీస్ రూల్స్ పుస్తకాలను సభ్యులకు అందజేశారు. ఈ సమావేశంలో టీపీసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.
KMR: నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు పిచ్చయ్యగారి దీపక్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల పరమపదించారు. ఆదివారం మృతుడు కృష్ణారెడ్డి దశదిశ కర్మ వేడుకలు నిర్వహించడంతో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మ ఎక్కడున్న శాంతించాలని భగవంతుని వేడుకున్నారు.
ASF: కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూమి విక్రయం పేరుతో రూ. 17 లక్షలు తీసుకుని మోసం చేసిన రామటెంకి ప్రకాశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాలిని గ్రామంలో 5 ఎకరాల భూమి ఉందని లేని భూమిని ఉన్నట్లు నమ్మించాడు. భూమి చూపించాలని అడిగితే బాధితుడిని బెదిరించడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని బాపురంలో వెలసిన శ్రీ గంగాదేవి రథోత్సవం ఆదివారం అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగింది. ఉదయం అమ్మవారికి బాపురం క్షేత్ర పీఠాధిపతులు శ్రీ బసలింగమ్మ అవ్వ ఆధ్వర్యంలో ఆకుపూజ, కుంకుమార్చన, బిల్వార్చన, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుంచి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తెచ్చి రథంపై ప్రతిష్టించి రథోత్సవం నిర్వహించారు.
AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. వైద్య శిబిరంలో 240 మంది రోగులు చికిత్సలు చేయించుకోగా వారిలో 26 మందికి ఆపరేషన్ నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులతో పాటు కళ్లద్దాలు అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు.