TG: మంచిర్యాల జిల్లా కోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకుల అరెస్టుకు సంబంధించి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. పిటిషన్పై ఇప్పటికే బాల్కసుమన్ అడ్వకేట్ల బృందం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే రిమాండ్లో ఉన్న నేపథ్యంలో కస్టడీకి ఇవ్వకుండా బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరినట్లు న్యాయవాదులు తెలిపారు.
AKP: అక్రమంగా తరలిస్తున్న 20 మద్యం సీసాలను కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులను చూసి కె.కాశీ విశ్వనాథం అనే వ్యక్తి పారిపోతుండగా ఎస్సై మనోజ్ కుమార్ పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద ఉన్న 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసామన్నారు.
ATP: గుంతకల్లులోని మోదినాబాద్ ఏరియాలో గల రైల్వే క్వార్టర్స్లో ఆదివారం అర్ధరాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న నగదుతో పాటు నగలు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరిసర ప్రాంతాలతో పాటు సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
HYD: నగరంలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ సోమవారం AWHO కాలనీలో 225గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
KMM: నగర సుందరీకరణకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సకాలంలో సిద్ధం చేయాలని ఉద్యానవన అధికారి ఆదేశించారు. ఖమ్మం నగరం గొల్లగూడెం నర్సరీలో జరుగుతున్న మొక్కల పెంపకం, నిర్వహణ పనులను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ హరితీకరణ లక్ష్యంగా చేపడుతున్న పనులను సమీక్షించి, సిబ్బందికి సాగు పద్ధతులపై పలు సూచనలు చేశారు.
BDK: సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం నందనవనం కాలనీలో భారీ దొంగతనం నిన్న జరిగింది. ఎస్బీఐ విశ్రాంత మేనేజర్ రఘునాథ్ కుటుంబంతో కలిసి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లగా, గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 5.9 తులాల బంగారం, 40.8 తులాల వెండితో పాటు రూ. 50 వేల నగదును దోచుకెళ్ళినట్లు ఎస్సై రమాదేవి తెలిపారు.
VSP: విశాఖ నుంచి ఆగ్రాకు వెళ్తున్న మహిళ బ్యాగ్ రైల్వే స్టేషన్లో మిస్ అయింది. బ్యాగ్లో 200 గ్రాముల బంగారం, రూ.12,500 ఉన్నట్టు ఆమె సీపీకి ఫోన్ చేశారు. సీపీ RPF పోలీసులకు సమాచారం అందించగా సీసీ కెమెరాలను పరిశీలించి హర్యానాకు చెందిన వ్యక్తి బ్యాగును దొంగలించి ట్రైన్లో వెళ్లిపోయినట్టు గమనించిన RPF పోలీసులు అతడిని అరెస్టు చేసి బ్యాగు స్వాధీన పరుచుకున్నారు .
KRNL: రైతుకు గిట్టుబాటు ధర కల్పించే చర్యల్లో భాగంగా నేటి నుంచి మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయాధికారి రవి, మార్క్ ఫెడ్ నిర్వాహకులు రామకృష్ణ తెలిపారు. క్వింటాలు రూ. 5,875కు కొంటామని చెప్పారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
JGL: రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో ఆదివారం నక్కలగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగలా నిర్వహించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల సౌజన్యంతో మహా అన్నదానం, రథోత్సవం తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు అర్చకులు వెంకట కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.
AP: అసెంబ్లీ ఆమోందించిన 7 బిల్లులను ఇవాళ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పురపాలక శాఖకు సంబంధించి 2 చట్టసవరణ బిల్లులు, దేవదాయ శాఖకు సంబంధించి 2, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల చట్టసవరణ బిల్లులు, వైద్యారోగ్య శాఖకు సంబంధించిన బిల్లులను మండలి ముందుకు తీసుకురానుంది. ఈ క్రమంలో శాంతిభద్రతలపై మండలిలో లఘు చర్చ జరగనుంది.
కోనసీమ: APSSDC ఆధ్వర్యంలో అమలాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు DSDO హరి శేషు సోమవారం తెలిపారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థాన ఆవరణలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయానికి వచ్చిన మహిళా భక్తురాలు వద్ద మద్యం సేవించిన వ్యక్తి రూ. 5000 అపహరించారు. దీనిని పసిగట్టిన మహిళ అక్కడే ఉన్న సిబ్బందికి తెలియజేశారు. దీంతో అతడిని సిబ్బంది పట్టుకుని అతని వద్ద ఉన్న రూ. 2,000లను తిరిగి ఇప్పించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే గేట్ సమీపంలో సూచిక బోర్డులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మూలమలుపు నుంచి జీవంగి, ఇందర్చేడు, నవాంగి గ్రామాలకు వెళ్లే మార్గాలు ఉండటంతో కొత్త వాహనదారులు ఏ దారి ఎటువైపు వెళ్తుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
RR: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో రజక కుటుంబంపై దాడి చేసి పసికందును హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కేశంపేటలో BC, SC, ST-JAC, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాధితులకు న్యాయం చేసి మర్డర్ కేసు నమోదు చేయాలని నాయకులు కోరారు. మహిపాల్ మహారాజ్, రాములు, రమేశ్ తదితరులు ఉన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్లో DDU -GKY& స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ రవి తెలిపారు. టెన్త్ పాసైన వారు అర్హులని, ఎంపికైన వారికి ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం, మెటీరియల్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ నెల 23 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.