• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అధిక లోడుతో ప్రయాణిస్తున్న టిప్పర్ సీజ్

SRCL: తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల నుంచి కంకర తరలిస్తున్న టిప్పర్ వాహనాన్ని సిరిసిల్ల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పృథ్వీరాజ్ వర్మ పట్టుకున్నారు. మంగళవారం ఉదయం వాహనాల తనిఖీ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ప్రయాణిస్తున్న టిప్పర్‌ను గుర్తించి సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు తరలించి సీజ్ చేశారు.

February 24, 2026 / 01:32 PM IST

జాతీయ సమైఖ్యత శిబిరానికి కొడంగల్ విద్యార్థిని ఎంపిక

VKB: కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు సోమ్లా NSS కంటింజెంట్ అధికారిగా, మరియు విద్యార్థి ప్రవీణ్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌కు ఎంపికయ్యారు. ఈరోజు నుంచి మార్చి 2 వరకు కర్ణాటకలో జరగనున్న ఈ శిబిరానికి వీరు వెళ్లనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాలమూరు విశ్వవిద్యాలయం తరపున మొత్తం 10 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారు.

February 24, 2026 / 01:32 PM IST

‘పారదర్శకంగా, సమగ్రంగా డేటా సేకరణ చేయాలి’

NDL: దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన గణాంకాలు బలమైన పునాది వంటివని కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని అయ్యలూరు మెట్టలో ఉన్న ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన జనగణన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఏ ఒక్క వ్యక్తి గణనకు దూరం కాకుండా సమగ్రతతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

February 24, 2026 / 01:31 PM IST

పొగిరి కుష్ఠు ఆసుపత్రిలో సేవా కార్యక్రమం

VZM: సమాజంలో అణగారిన వర్గాలైన కుష్ఠు రోగులకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బెతనీ మిషన్ ఓక్ ల్యాండ్ స్కూల్స్ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస రావు అన్నారు. రాజాం మండలం పొగిరి కుష్ఠు ఆసుపత్రిలో ఉన్న రోగులకు మంగళవారం దుప్పట్లు, ఆహారం, అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారిని ఆత్మీయంగా పలకరించి ధైర్యం చెప్పారు.

February 24, 2026 / 01:31 PM IST

కాలనీలలో పర్యటించిన జోనల్ కమీషనర్

RR: మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ కాలనీల అధ్యక్షులు తమ కాలనీలలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల పై గతంలో వినతి పత్రాన్ని రాష్ట్ర TUFIDC ఛైర్మన్ చల్ల నరసింహ రెడ్డికి అందచేశారు. ఈరోజు జోనల్ కమీషనర్ చంద్రకళతో కలిసి కాలనీలో పర్యటించి, సమస్యలు తెలుసుకున్నారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:31 PM IST

విద్యుత్ షాక్‌తో మేక మృతి

GDWL: గద్వాల పాత కూరగాయల మార్కెట్ సమీపంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో మేకపోతు అక్కడికక్కడే మృతి చెందగా, దాన్ని పట్టుకున్న వ్యక్తికి కూడా విద్యుత్ ఘాతంతో గాయాలయ్యాయి. రోడ్డుపై వేలాడుతున్న విద్యుత్ తీగలు లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఇలా జరగడంతో ప్రజలు భయపడ్డారు.

February 24, 2026 / 01:31 PM IST

ప్రజలకు వైద్య పరీక్షల నిర్వహణ

MNCL: వ్యాధులతో బాధపడేవారు మందులను క్రమం తప్పకుండా వాడాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సూచించారు. ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ ఆదేశాల మేరకు మంగళవారం రాంపూర్ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు.

February 24, 2026 / 01:30 PM IST

ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు

NRML: రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా,పారదర్శకంగా జరిగేలా అన్ని 23 పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

February 24, 2026 / 01:30 PM IST

మాదకద్రవ్యాల దుర్వినియోగంపై వ్యాసరచన పోటీలు

CTR: పాలసముద్రం ZPHS పాఠశాలలో SI శ్రీ రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలు ఆరోగ్యం, విద్య, భవిష్యత్తును నాశనం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు మంచి అలవాట్లు, సానుకూల కార్యకలాపాలను అనుసరించాలని సూచించారు.

February 24, 2026 / 01:30 PM IST

శతరుద్ర మాయాగానికి ఎంపీకు ఆహ్వానం

KMM: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ శ్రీశ్రీశ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆశ్రమ పీఠాధిపతి బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను నేడు కలిసి శాలువాతో సత్కరించారు. పాండవుల గుట్ట వద్ద ఉన్న ఆశ్రమంలో మార్చి 13 నుంచి 15వ తేదీ వరకు జరిగే అష్టోత్తర శతకుండ సహిత శతరుద్ర మాయాగానికి రావాలని ఎంపీకు ఆహ్వాన పత్రిక అందజేశారు.

February 24, 2026 / 01:29 PM IST

ముదిరెడ్డిపల్లిలో అభివృద్ధి వేగం

NRPT: గుండుమాల్ మండలం ముదిరెడ్డిపల్లిలో 4, 5వ వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ కాలువలు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సర్పంచ్ దేవమ్మ కృష్ణయ్య పనులను పరిశీలించి నాణ్యత పాటించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో, తిరుపతి రెడ్డి చొరవతో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.

February 24, 2026 / 01:28 PM IST

బస్టాండ్ వద్ద ఒక వ్యక్తి మృతి

NDL: బనగానపల్లె టౌన్ బస్టాండ్‌లో మంగళవారం ఒక వ్యక్తి మృతి చెందాడు. అతను మహానంది గ్రామానికి చెందినవాడని సమాచారం లభించింది. స్థానికులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరింత సమాచారం కోసం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 01:28 PM IST

మాజీ ఎంపీటీసీని పరామర్శించిన ఎమ్మెల్యే

WGL: నెక్కొండ మాజీ ఎంపీటీసీ ఈదునూరి కరిష్మాను మంగళవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరామర్శించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబానికి కాంగ్రెస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:28 PM IST

‘వారిపై చర్యలు తీసుకోవాలి’

అల్లూరి: గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 300 దేవాలయాలపై దాడులు చేసి కూల్చివేశారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం శాసనసభలో మాట్లాడారు.

February 24, 2026 / 01:28 PM IST

రెండో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

ATP: గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు సీఐటీయు నాయకులతో కలిసి మంగళవారం 2వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అంగన్వాడీ టీచర్లు కళ్యాణి మాట్లాడుతూ.. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, అంగన్వాడీ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, ప్రీస్కూల్‌ పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలన్నారు. కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలన్నారు.

February 24, 2026 / 01:28 PM IST