నల్గొండ ఐదవ జోన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించారు. నల్గొండ, జనగాం, సూర్యాపేట జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 14 మందికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం రాత్రి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి పొందిన సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు.
NLG: అంతర్జాతీయ సదస్సుకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డాక్టర్ అలీ బేగ్ ఎంపికయ్యారు. టర్కీలో జూన్ 24 నుంచి నిర్వహించే ఈ సదస్సులో పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్టర్ ఆల్వాల్ రవి, అధ్యాపకులు అలీ బేగ్ను అభినందించారు.
NZB: జిల్లా విద్యాశాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బందిపై వేటు పడనుంది. ప్రైవేట్ పాఠశాలల విభాగాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని తక్షణమే మార్చాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. జిల్లాలో 9 మంది సిబ్బంది ప్రైవేట్ స్కూల్ పనులు చూస్తుండగా, ఐదుగురు మూడేళ్లుగా అక్కడే ఉండటంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.
NLG: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలం చుట్టూ రాజకీయ, న్యాయ వివాదం ముదిరింది. 2005లో అప్పటి CM YSR జీవో నెంబర్ 324 ప్రకారం ఈ స్థలాన్ని స్వర్ణకారుల సంక్షేమానికి కేటాయించారు. గతంలో స్వర్ణకారుల కోసం కేటాయించిన ఈ స్థలాన్ని ఇప్పుడు చిరువ్యాపారుల మార్కెట్ కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడం ‘హాట్ టాపిక్’గా మారింది.
SRPT: నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. మునగాల ఎంపీడీవో కార్యాలయంలో నిన్న జరిగిన 16వ సామాజిక తనిఖీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలపై రూ.85,951 రికవరీ, పెనాల్టీ మొత్తాన్ని ఉపాధి హామీ ఖాతాలో జమ చేయాలని అధికారులను ఆదేశించారు.
కోనసీమ: ఆదివారం మంగళగిరిలో జరిగే చేనేత గర్జనను విజయవంతం చేయాలని రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఊటుకూరు సుబ్రహ్మణ్యం కోరారు. అమలాపురం మండలం బండారులంకలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా నుంచి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
SRD: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు జరిగిన 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్-2026లో, సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం ఐటీ కోర్ టీంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న గంగేరి సంతోశ్ కుమార్ తైక్వాండో 74-80 విభాగంలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి సిల్వర్ మెడల్ సాధించారు.
కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం రాత్రి ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతలు, కేసుల దర్యాప్తు తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్సై రామును ఆదేశించారు.
SKLM: జి.సిగడాం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 10.30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.రామకృష్ణా రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ మీసాల సత్యవతి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి గౌరవ సభ్యులు, సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కోరారు.
NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 24న రూరల్ డీఎస్పీ ఆఫీస్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ వాయిదా పడింది. కాగా గుమ్మలదిన్నెలో బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేసిన కేసులో ఆయనను విచారించనున్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో నూతన మహిళా స్వయం సహాయక సంఘం భవనానికి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, మహిళా సాధికారత సమాజాభివృద్ధికి ఈ సంఘాలు చాలా ముఖ్యమైనవని తెలిపారు.
కడప: నగరంలోని SKR, SKR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు శుక్రవారం సీ.పీ బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించారు. అక్కడి పుస్తకాలను, తామ్రపత్రాన్ని, తాళపత్ర గ్రంధాలను, రాత పత్రాలను చూసి తెలుసుకున్నారు. సహాయ పరిశోధకులు బూతిపూరి గోపాలకృష్ణ వాటి గురించి వివరించారు. కళాశాల అధ్యాపకులు డా. ఎం గురు మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
TG: ధరణి పోర్టల్లో ఆడిటింగ్ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ధరణి కోడ్ ఆడిటింగ్ బాధ్యతలను సి-డాక్ (C-DAC)కు అప్పగించింది. TGSS నేతృత్వంలో ఈ ఆడిటింగ్ ప్రక్రియ జరగనుంది. పోర్టల్ పనితీరును మెరుగుపరచడం, భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో నెల రోజుల్లోనే 5 భారీ చోరీలు జరగడంతో ప్రజలు వణుకుతున్నారు. తాళం వేసిన ఇళ్లు, షట్టర్లే లక్ష్యంగా నలుగురు సభ్యుల ముఠా మారణాయుధాలతో తిరుగుతూ నగదు, బంగారం దోచుకెళ్తాంది. జనవరి 10న ఏకకాలంలో 5 దుకాణాల్లో చోరీకి పాల్పడటం సంచలనం రేపింది.
TPT: శ్రీకాళహస్తీశ్వరున్ని శుక్రవారం జర్మనీ, రష్యా దేశానికి చెందిన సుమారు 200 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు కల్పించారు. విదేశీయులు సాంప్రదాయ దుస్తులలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలోని శిలా నైపుణ్యాలను పరిశీలించి నిర్మాణ శైలికి మంత్రముగ్ధులయ్యారు. ఆలయాన్ని సందర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు.