ATP: జిల్లాలో శనగల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది క్వింటాల్ శనగలకు ప్రభుత్వం 5,875 రూపాయల మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు.
కోనసీమ: మస్కట్లో తీవ్ర ఇబ్బందులు పడ్డ తాటిపాకకు చెందిన కర్రీ సౌజన్య, కందికుప్పకు చెందిన బొజ్జ లక్ష్మీదుర్గ మంగళవారం క్షేమంగా స్వగ్రామం చేరారు. ఉపాధి కోసం వెళ్లి అక్కడ పని దొరకక అవస్థలు పడుతున్న వారిని కలెక్టర్ మహేశ్ కుమార్ చొరవతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా రప్పించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ELR: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలందరికీ పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ.. చిన్న చిన్న కారణాలతో రోగులను విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు రిఫర్ చేయడం సరికాదన్నారు.
KDP: ఎర్రగుంట్లలోని నాలుగు రోడ్ల కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రోడ్డు దాటుతున్న సుమారు 80 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడిని కడప రోడ్డునుంచి వేంపల్లె వైపు వెళ్తున్న ట్రిప్పర్ ఢీకొట్టింది.ఘటనను గమనించిన స్థానికులు డ్రైవర్ను అప్రమత్తం చేయగా,వాహనాన్ని ఆపి వృద్ధుడిని బయటకు తీశారు.తలకు తీవ్ర గాయాలైన వృద్ధుడిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
NDL: మహానంది దేవస్థానంలో ఈనెల 27న హుండీ కానుకల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారితో పాటు ఆంజనేయస్వామి, కోదండ రామాలయం, అన్నప్రసాద విభాగం గో సంరక్షణ విభాగాల్లోని హుండీ కానుకల లెక్కింపు ఉంటుందన్నారు. సిబ్బంది అందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
WG: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
NTR: నందిగామలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రెండు నెలల చిన్నారి మృతి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ దర్శనానికి వెళ్లిన కుటుంబంపై దాడి చేసి చిన్నారిని తొక్కడం అమానుషమని ఖండించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బాధ్యులపై చర్య తీసుకోవాలన్నారు.
అన్నమయ్య: కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని పెద్దమండ్యం మండల అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంగళవారం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ హెల్పర్స్, వర్కర్స్ యూనియన్ CITU, IFTU ఆధ్వర్యంలో తంబళ్లపల్లె ICDS ఆఫీస్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలన్నారు.
విశాఖలోని Andhra Medical Collegeకు యూకేలో స్థిరపడిన డాక్టర్ ఐ.కే. రాజు యూరాలజీ విభాగానికి ఆధునిక వైద్య పరికరాలు విరాళంగా అందజేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి సమక్షంలో డీజే స్టెంట్లు, గైడ్ వైర్లు, కాథెటర్లు అందజేశారు. ఈ పరికరాలు నిరుపేద రోగులకు ఎంతో ఉపయోగపడతాయని విభాగాధిపతి డాక్టర్ ఐ. చంద్రశేఖర్ తెలిపారు.
CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో రేపు తిరుమల లడ్డులు విక్రయించడం జరుగుతుందని టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి మంగళవారం తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల నుంచి లడ్డూలను తెప్పించి విక్రయిస్తామన్నారు. ఒక్కో లడ్డు రూ.50 చొప్పున విక్రయించడం జరుగుతుందని తెలిపారు.
KRNL: సి.బెళగల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను కోడుమూరు సీఐ తబ్రేజ్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను తనిఖీ చేసి,మండలంలో శాంతిభద్రతలపై ఆరా తీశారు. పోలీస్ సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, క్రైమ్ రేటును మరింత తగ్గించేందుకు కృషి చేయాలని,కేసులను త్వరిత గతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు.
VZM: సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ సేధు మాధవన్ మంగళవారం పరిశీలించారు. కార్యక్రమ స్థలం, వేదిక, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, తాగునీరు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
PPM: అమరావతిలో జరుగుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా పోటీలలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సత్తా చాటుతున్నారు. ఉత్సాహంగా సాగుతున్న పోటీలలో రన్నింగ్లో విన్నర్గా నిలిచారు. అలాగే తగ్గఫ్ వార్ పోటీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు టీంలో పాల్గొని విజయం సాధించారు. అలాగే, వాలీబాల్, కబడ్డీ పోటీలలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర సత్తా చాటారు.
PLD: గురజాల మండలంలోని పలు ప్రాంతాలలో మంగళవారం వర్షం కురిసింది. దీంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే మబ్బులు పట్టి చిరుజల్లులు మొదలవడంతో గ్రామ సమీప ప్రాంతాలలో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు ఇళ్లల్లోని పట్టాలు తీసుకుని పరుగులు తీశారు. కల్లాల్లో ఉన్న మిర్చి రాశులపై పరదాలు కప్పారు.
PPM: ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు బ్లూ కోల్ట్ సిబ్బంది ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు .ఈ క్రమంలో కాంప్లెక్స్ నుండి బస్సు వెనక్కి వస్తుండగా అదే మార్గంలో వస్తున్న మోటార్ సైకిల్ను ఢీ కొట్టింది. మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి కిందపడడంతో కాలుకు గాయం తగిలింది. విధులలో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బంది ఆసుపత్రికి ఆటోలో తరలించారు.