RaghuramRajan
భారత్ మళ్లీ హిందూ వృద్ధి రేటుకు చేరువ అవుతోందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (reserve bank of india) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ (Raghuram Rajan) వ్యాఖ్యలను ఎస్బీఐ రీసెర్చ్ (SBI Research) ఖండించింది. జీడీపీ, పొదుపు, పెట్టుబడుల గణాంకాలు ఆధారంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అని, పక్షపాతంతో చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నది. ఆయన ఆందోళన వ్యక్తం చేసినంత తీవ్రంగా జీడీపీ వృద్ధి రేటు గణాంకాలు లేవని ఎస్బీఐ రీసెర్చ్ తన ఎస్బీఐ ఎకోరాప్ నివేదికలో పేర్కొన్నది.
ప్రయివేటు పెట్టుబడులు మందకోడిగా ఉన్నాయని, వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయని దీనికి తోడు అంతర్జాతీయ వృద్ధి నెమ్మదించడం వల్ల భారత వృద్ధి రేటు తగ్గుతోందని రాజన్ ఇటీవల అన్నారు. అక్టోబర్ – డిసెంబర్ కాలంలో జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతానికి తగ్గడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హిందు వృద్ధి రేటు స్థాయికి వెళ్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 1950 నుండి 1980ల కాలంలో భారత వృద్ధి రేటును హిందు వృద్ధి రేటుగా అభివర్ణిస్తారు. అప్పుడు సగటు వృద్ధి రేటు 3.5 శాతం. ప్రస్తుత వృద్ధి రేటు ఆ స్థాయి దిశగా వెళ్తుందని రాజన్ అన్నారు. అయితే వృద్ధి రేటుపై రాజన్ వ్యాఖ్యలు సరికాదని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొన్నది.
ప్రభుత్వ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ 2020-21లో 10.7 శాతం నుండి 2021-22లో 11.8 శాతానికి వృద్ధి సాధించిందని, ప్రయివేటు రంగ పెట్టుబడులు 10 శాతం నుండి 10.8 శాతానికి పెరిగాయని ఈ నివేదిక వెల్లడించింది. 2022-23లో త్రైమాసికం వారీగా వృద్ధి రేటు తగ్గుతూ వస్తోందని, అయినప్పటికీ అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసిక గణాంకాలను అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. భారత జీడీపీ వరుసగా మూడో ఏడాది సగటున రూ.2 లక్షల కోట్ల మేర వృద్ధి నమోదు చేసినట్లు తెలిపింది.
ఇది చదవండి: Costly Pen: పెన్ను ధర రూ.22.47 లక్షలు..ఎక్కడంటే

