KRNL: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. జిల్లాలోని 27 మండలాల్లో మంగళవారం 16 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా చిప్పగిరి మండలంలో 42.2 డిగ్రీలు, దేవనకొండ మండలంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ATP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ఎస్పీ జగదీష్తో కలిసి నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పీఎం రాహత్’ పథకం ద్వారా ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరుతూ గోడపత్రికలను ఆవిష్కరించారు.
VSP: జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్-2026 పోటికి సన్నద్ధమవుతోంది. ఈసారి దేశవ్యాప్తంగా సుమారు 4,600 నగరాలు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. పారిశుధ్య నిర్వహణతో పాటు ప్రజాభిప్రాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో త్వరలో కేంద్ర బృందం నగరాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఇంటింటి చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పిస్తున్నారు.
SKLM: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఖరారుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ మే 1 న జిల్లాలో పర్యటించ నుందని కలెక్టర్ స్పప్నిల్ దినకర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఉ.10.30 గంటల నుంచి మ. 1 గంట వరకు కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని తెలిపారు.
VZM: పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పరిశుభ్రత కోసం అందిస్తున్న సేవలు ఎనలేనివని చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు కొనియాడారు. మంగళవారం మెరకముడిదాం మండల కేంద్రంలో స్వచ్చ రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమైనదని అన్నారు.
PPM: చెక్లిస్ట్లో ఎఫ్.పి.ఓ ల విధులు నమోదు చేయాలని, నిధులు మంజూరు, ఖర్చులపై నివేదిక సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని, వచ్చినప్పుడు సమగ్ర సమాచారంతో రావాలని జె. సి.సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎఫ్.డి.ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు.
NDL: టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేష్, జాతీయ ప్రధాన కార్యదర్శిగా డా. బైరెడ్డి శబరి బాధ్యతలు చేపట్టనున్నారు. 252 మందితో కొత్త కార్యవర్గాన్ని టీడీపీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉ. 9 గంటలకు మంగళగిరి పార్టీ హెడ్ ఆఫీసులో కార్యక్రమం జరగనుంది.
WG: జిల్లాలో డీజిల్ కొరత అపోహలు వీడి, సరఫరా సాధారణ స్థితికి చేరుకుందని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి భీమవరం, ఉండి తదితర ప్రాంతాల్లోని బంకులను ఆయన తనిఖీ చేశారు. రైతులు, మత్స్యకారులకు కూపన్ల ద్వారా ఇంధనం అందిస్తున్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా అవసరమైన మేరకే డీజిల్ కొనుగోలు చేసి సహకరించాలని ఆయన కోరారు.
KDP: రాజుపాలెం మండలంలోని వెల్లాలలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి శేషవాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఉదయం నుంచి స్వామి, అమ్మవార్లను ప్రత్యే కంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ నారాయణ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
NLR: జిల్లాలో SC, STలకు సోలార్ పథకంపై దృష్టిపెట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ మంగళవారం సాయంత్రం అధికారులకు సూచించారు. నెల్లూరులో అధికారులతో ఆయన సమీక్షించారు. ‘SC, STలకు ఉచితంగా సోలార్ కరెంట్ కల్పించాలి, ఇళ్లపై సౌర ప్యానెల్స్ పెట్టుకుంటే కరెంట్ బిల్లు తగ్గే అవకాశం ఉంటాయనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు.
E.G: ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆధ్వర్యంలో రెరా చట్టం-2016పై రాజమండ్రి హోటల్ మంజీరాలో ఏప్రిల్ 29న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఛైర్మన్ ఆరె శివారెడ్డి మంగళవారం తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత పెంచడం, వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ELR: కామవరపుకోట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ నండూరి శేషావతారం మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. సీనియర్ ఆడిటర్గా జిల్లాలో మంచి గుర్తింపు పొందిన శేషావతారం మరణం పట్ల పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో ఇవాళ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ కార్యాలయ అధికారి శ్రీనివాసులు ప్రకటించారు. 6 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. దాదాపు 880 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
CTR: కార్వేటినగరం (M) అమ్మపల్లిలో మహాభారతం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అర్జున తపస్సు ఇవాళ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామంలో ఇప్పటికే సాంప్రదాయ పద్దతిలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. కార్వేటినగరంతో పాటు పక్క మండలాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.
PPM: స్వీయగణన పూర్తి చేసుకునేందుకు మరో 2 రోజులు మాత్రమే అవకాశం ఉందని గుమ్మలక్ష్మీపురం MRO శేఖరం మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ నంబర్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని, మొబైల్ ఫోన్లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే నంబర్ను భద్రపరుచుకోవాలని, మే 1 నుంచి ప్రారంభమయ్యే జనగణనకు వచ్చే ఎన్యుమరేటర్లకు తెలపాలన్నారు.