BPT: చీరాల సముద్రతీరంలో అక్రమంగా సాగుతున్న నిర్మాణాల వల్ల మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటోందని, బీచ్ అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని డీసీసీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చీరాల తీరంలో లాడ్జీలు, బాపట్ల బీచ్ పరిసరాల్లో రిసార్టులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
WG: మొగల్తూరు మండలం శేరేపాలెంలో మంగళవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. MLA బొమ్మిడి నాయకర్, TDP ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువైద్యులు గ్రామంలోని పశువులకు వైద్య పరీక్షలు చేసి, చికిత్స అందించారు. అనంతరం అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు కోరారు.
NDL: రుద్రవరం ఆదర్శ పాఠశాలలో ఈనెల 12న 6వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మంగళవారం ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు ఈనెల 5 నుంచి ఏపీ వెబ్సైట్లో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.
ATP: కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి పూర్వవైభవం తెస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురంలో జరిగిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ.. చేనేత భరోసా కింద రూ.25 వేలు అందిస్తామని ప్రకటించారు. మగ్గాలకు ఉచిత విద్యుత్ ఇస్తూ ప్రభుత్వం నేతన్నలకు భరోసా కల్పిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల కార్మికులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.
కృష్ణా: చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామంలో గుండేరు మేజర్ డ్రైనేజీపై నూతన వంతెన మంజూరు చేయాలని గ్రామస్థులు రాష్ట్ర మంత్రి బీ.సీ.జనార్దన రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గుండేరుపై వంతెన దాదాపు పదేళ్ల నుంచి శిథిలావస్థకు చేరి ఉందని తెలిపారు. ఇటీవల గుర్రపు డెక్క పట్టేసి వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుందని, నూతన వంతెనకు నిధులు కేటాయించాలని కోరారు.
E.G: సీతానగరం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం భారతి ఆధ్వర్యంలో ‘నీటి భద్రత’పై సమీక్ష జరిగింది. ఏప్రిల్ 6 నుంచి 100 రోజుల పాటు చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంతో కాలువల పూడికతీత, కట్టల బలోపేతం చేయాలన్నారు. నీటిమట్టం 3-6 మీటర్లకు పెంచడమే లక్ష్యమని, సాగునీటి సంఘాలు భాగస్వాములు కావాలని కోరారు.
W.G: ధాన్యం తరలింపు సమయంలో రైతులు కల్లాలు, RSK వద్దే ట్రక్ షీట్ నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. మిల్లుల వద్ద నమోదు చేయవద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే రవాణా ఛార్జీలు రావని కేంద్రం హెచ్చరిస్తోందని తెలిపారు. దళారీలను ఆశ్రయించి మోసపోవద్దని రైతులకు హితవు పలికారు.
NLR: అల్లూరు మండలం పల్లెపాడుకు చెందిన బొమ్మల మైధిలి దివ్యాంగురాలు. అయినప్పటికీ విశేష ప్రతిభతో క్రికెట్లో రాణిస్తోంది. హర్యానాలో మార్చి 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన టీ10 నేషనల్ క్రికెట్ ఛాంపియన్ షిప్లో ఏపీ జట్టు తరఫున ఆమె ఆడింది. అక్కడ కూడా ప్రతిభ చూపడంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆమెను సన్మానించి అభినందించారు.
GNTR: కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 400 ఏళ్ల క్రితం స్వయంభూదేవిగా వెలసిన అమ్మవారిని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు స్థాపించారు.
KRNL: కర్మాగారాల్లో భద్రతా చర్యలు ఖచ్చితంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఫ్యాక్టరీస్ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా నిర్దేశిత ప్రమాణాల మేరకు భద్రత ఉండాలని ఆమె పేర్కొన్నారు. కార్మికుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
KDP: లింగాల మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులపై రేపు సమావేశం జరగనుంది. 20వ విడత సామాజిక తనిఖీ, బహిరంగ సభ, మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో బుధవారం జరుగుతుందని ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమావేశానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామీణ శ్రామికులు తప్పక హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.
SKLM: గ్రామ స్థాయిలో టీడీపీ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే శిరీష అన్నారు. మంగళవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల క్యాడర్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణ, విధి విధానాలు, నాయకుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
PPM: మే 1 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ సెన్సస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ఈ నెల 16 నుంచి 30 వరకు ‘స్వీయ గణన’ (Self Enumeration) అవకాశం కల్పించారు. ప్రజలు తమ ఇంటి వివరాలను స్వయంగా se.census.gov.in వెబ్సైట్లో నమోదు చేయవచ్చన్నారు.
BPT: మీడియా స్వేచ్ఛ ముసుగులో వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా ఆడవాళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, ఒక పార్టీకి తొత్తుగా మారి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దురదృష్టకరమని అన్నారు.
AKP: రాంబిల్లి మండలం మూలజంప ఎస్సీ కాలనీ, గొల్ల వీధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మండల టీడీపీ యూనిట్ ఇంఛార్జ్ అందుకూరి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అనకాపల్లి క్యాంపు కార్యాలయంలో ఎంపీ సీఎం రమేష్ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఒక బోరు, వాటర్ ట్యాంకు మంజూరు చేయాలని కోరారు.