గుంటూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. గృహ నిర్మాణాల పురోగతిపై నిన్న సమీక్ష నిర్వహించిన ఆయన, ఇంజనీర్లు, గుత్తేదారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
KDP: కొండాపురంలో ఓ కంటి ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్యశిబిరం ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు చేస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
BPT: కర్లపాలెం మండలం పేరలిపాడు గ్రామంలో శనివారం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. నాటక ప్రదర్శన ఏర్పాట్ల సమయంలో స్టేజి కిందుగా వెళ్తున్న జోగి లిబ్నిరాజుకు విద్యుత్ తీగలు తగిలాయి. తీవ్రంగా అస్వస్థతకు గురైన అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనకాపల్లి: వేసవిలో పాయకరావుపేట నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి శనివారం సమ్మర్ యాక్షన్ ప్లాన్పై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్య ఎక్కడైనా ఏర్పడితే వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
W.G: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని నాదెండ్ల నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, అక్కడ భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
TPT: ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలో సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం PGRS కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు MRO చంద్రబాబు తెలిపారు. పిచ్చాటూరు ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు PGRS జరుగుతుందన్నారు. మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై, ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారన్నారు.
సత్యసాయి: పరిగి ఎస్సై రవికుమార్ తిరుమల దేవరపల్లి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన చట్టాలు, డ్రగ్స్ నివారణ, మహిళా భద్రత, సైబర్ నేరాల పట్ల ప్రజలకు వివరించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
PPM: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సీతానగరం మండలం చినబోగిలి రైల్వే గేటు సమస్య పరిష్కరించాలని రైల్వే DRMను కోరారు. శనివారం ఆయనతో కలిసి రైల్వే గేటు పరిశీలించారు. రైల్వే అండర్ బ్రిడ్జి దూరంగా ఉండటం వలన రైతులు, విద్యార్ధులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చిరు వ్యాపారులు కూడా జీవనోపాధి కోల్పోయారని MLA DRM కు వివరించారు.
SKLM: హెల్మెట్ ధరించడం భారం కాదు, ప్రతి వాహనదారుడి బాధ్యత అని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం “అభయం” పేరిట హెల్మెట్ ధారణపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడాలంటే హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని అన్నారు. జిల్లా కలెక్టర్, అధికారులు ఉన్నారు.
విశాఖ: గూగుల్ డేటా సెంటర్ కోసం భూములిచ్చిన రైతులకు మెరుగైన పరిహారం అందించామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టర్ అభిషిక్త్ కిషోర్తో కలిసి శనివారం ఆయన తర్లువాడ రైతులతో సమావేశమయ్యారు. ఎకరాకు 20 సెంట్ల భూమితో పాటు ఇతర హామీలను నెరవేరుస్తామన్నారు. అనంతరం రెండు రోజుల్లో జరగనున్న శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
VZM: ఎల్.కోటలో శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న MLC ఇందుకూరి రఘురాజు అదికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎస్.కోటలో టెండర్లు పిలిచి ఎల్.కోటలో ఎందుకు పిలవలేదని వారిని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పనులపై ఇంజినీరింగ్ శాఖాధికారులను నిలదీశారు. మండలంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల విషయంలో పారదర్శకత లోపించిందని మండిపడ్డారు.
NDL: సింగపూర్లో రాష్ట్ర మంత్రుల పర్యటన కొనసాగుతోంది. ఐదో రోజు శనివారం సంక్షోభ నిర్వహణ వ్యవస్థ గురించి మంత్రుల బృందం అధ్యయనం చేస్తోంది. విపత్తు వేళల్లో ప్రభుత్వం ఏ విధంగా పని చేస్తుందో SUSS అసిస్టెంట్ ప్రొఫెసర్ రజ్వానా వివరించారు. సంక్షోభంలో నైతిక నిర్ణయాల ప్రాధాన్యత వంటి అంశాలపై చర్చించారు. మంత్రుల బృందంలో బీసీ, అచ్చెన్న, అనిత, సత్యకుమార్ ఉన్నారు.
CTR: శ్రీ మృత్యుంజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శివపార్వతుల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై ఊరేగింపు చేపట్టారు. అత్యంత సుందరంగా వాహనాన్ని అలంకరణ చేసి పూజలు చేసి ఆలయం వద్ద నుంచి మేళతాళాల నడుమ పురవీధులలో రాత్రంతా విహరించేలా ఏర్పాటు చేశారు. ఉభయదారులుగా సజ్జన కులస్తులు వ్యవహరించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
విశాఖ: కేజీహెచ్లో రూ. 3 కోట్లతో ఏర్పాటు చేసిన సికిల్ సెల్ ఎనిమియా, హీమోగ్లోబినోపతీస్ ప్రయోగశాలను ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం. నాయక్ సందర్శించారు. ల్యాబ్ పనితీరును పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అధికంగా కనిపించే సికిల్ సెల్, తలసీమియా వంటి వ్యాధులను గుర్తించే అవకాశం ఉందన్నారు.