కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సబ్డివిజన్లు, పోలీస్ స్టేషన్ల పరిధిలలో రాత్రివేళల్లో పోలీసులు విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్, తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రాత్రిగస్తీ, తనిఖీలు, అనుమానిత వ్యక్తుల ఫింగర్ ప్రింట్ చెకింగ్లు, స్టాప్, వాచ్ అండ్ గో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అన్నమయ్య: జిల్లాలో డీజిల్, పెట్రోల్ సరఫరాకు ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ అవి నియంత్రణలోనే ఉన్నాయని చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
KDP: చెన్నూరులోని వీరబ్రహ్మేంద్రస్వామి వారి గ్రామోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో భాగంగా కోలాటం నిర్వహించారు. చెన్నూరులో నిర్వహించిన కోలాట ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు సమూహాలుగా పాల్గొని కోలాటం ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కోలాట బృందానికి చెన్నూరులో మంచి గుర్తింపు లభించింది.
W.G: నరసాపురం శ్రీ వైఎన్ కళాశాల పాలకవర్గ (గవర్నింగ్ బాడీ) ఎన్నికల్లో ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికలకు ఆయన కళాశాల పూర్వ విద్యార్థిగా హాజరైన తాను చదువుకున్న విద్యాసంస్థ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
KKD: అన్నవరం దేవస్థానంలో నిర్వహించే పూజలు, ఆర్జిత సేవలు, అలంకారాలను ఆన్లైన్ చేయాలని దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. భక్తులకు సమాచారం వేగంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. దీనివల్ల భక్తులకు సేవల బుకింగ్ సులభతరం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
VZM: రాజాంలోని బొబ్బిలి సెంటర్లో యాదవుల వీధి దగ్గర ఆదివారం సాయంత్రం యువకుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ జానాలను చెదరగొట్టి పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఘర్షణకు గల కారణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ASR: డుంబ్రిగూడ మండలంలోని సంతావలస–గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న చేతి పంపు బోరు పాడైపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మండల కేంద్రానికి వచ్చే గిరిజనులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బోరును తక్షణమే మరమ్మతు చేయాలని కోరుతున్నారు.
NTR: విజయవాడ నిడమానూరు వద్ద నిలిచిపోయిన ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. గతంలో రద్దైన ఈ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ చర్యలు ముమ్మరం చేశాయి. సుమారు రూ. 640 కోట్ల అంచనా వ్యయంతో కూడిన DPRకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింనట్లు తెలుస్తోంది. CM స్థాయిలో జరిగిన చర్చల అనంతరం, ఈ ప్రాజెక్టును కేంద్రానికి సిఫార్సు చేసేంది.
NDL: శ్రీశైలం ఆలయ వెబ్సైట్ ఆర్జిత సేవలు, పూజలు, అలంకరణల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఓ ప్రకటనలో ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ విశేషాలు, సౌకర్యాల సమాచారం ఆన్లైన్ అందుబాటులో ఉంచాలని ఈవోను ఆదేశించారు. దీనివల్ల సమాచార సేకరణ భక్తులకు మరింత సులభతరం కానుంది.
KDP: పెడ్లిమర్రి(M)లోని చిన్నదాసరపల్లెలో ప్రసిద్ధిచెందిన వేయినూతులకోన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త పి. నరసింహ హరిప్రసాద్ తెలిపారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
BPT: జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సూచించారు. సోషల్ మీడియా ద్వారా పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. కృత్రిమ సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
KRNL: కోసిగి ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 28న ఎంపీపీ ఈరన్న అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎస్. మహబూబ్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 16 రకాల అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మండలంలోని అన్నీ శాఖల అధికారుల ప్రగతి నివేదికలను ఇవాళ సాయంత్రంలోగా ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.
అన్నమయ్య: రాయచోటికి చెందిన బౌలర్ మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఆంధ్రా ప్రీమియర్ లీగ్లో కాకినాడ కింగ్స్ జట్టుకు రూ.4 లక్షలకు ఎంపికయ్యారు. టీ20ల్లో 23 మ్యాచ్లలో 28 వికెట్లు తీసిన ఆయన, గతంలో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా ఎంపికయ్యారు. అలాగే లిస్ట్-Aలో 15 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు సాధించారు. ఈ అవకాశంతో ఆయన కెరీర్కు మరో మెట్టు ఎక్కినట్లైంది.
ప్రకాశం: ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఘరానా చోరీ చోటుచేసుకుంది. పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి చెందిన ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 16 తులాల బంగారాన్ని అపహరించారు. వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతానికి వెళ్ళిన పూర్ణచంద్రరావు అతని భార్య ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగిందని గమనించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NDL: జుపాడుబంగ్లా మండలంలోని పోతులపాడు గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి చెందిన మేక ఒకే ఈతలో 4 పిల్లలకు జన్మ నిచ్చింది. గతేడాది కూడా ఇదే మేక మూడుపిల్లలకు జన్మనిచ్చింది. గత ఐదురోజుల కిందట నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన తెలి పారు. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన మేకను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురైతున్నారు.