సత్యసాయి: నాందేడ్ – ధర్మవరం ప్రత్యేక రైలును రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మార్పునకు ఆమోదం తెలిపారు. ఇక నుంచి ఈ రైలు 17635/17636 నంబర్లతో హజూర్ సాహిబ్ నాందేడ్ – ధర్మవరం ఎక్స్ప్రెస్గా సేవలు అందించనుంది.
CTR: కుప్పం (M) దాసే గానూరు పంచాయతీలో అక్రమంగా వెలిసిన లేఔట్లలో పంచాయతీ అధికారులు నోటీసు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వేసిన లేఔట్లలో ఎవరైనా స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడితే వారికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం జరగదని పంచాయతీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
ఎన్టీఆర్: విజయవాడ గుణదల పడవలరేవు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. పోలీసులను చూసి కారును వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించిన బల్వంత్ అమర్సింగ్ సోలంకీ, అల్పేష్ కుమార్లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సత్యరమేష్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.
GNTR: జనాభా గణన-2027 విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ తెలిపారు. జనాభా గణనను ఈసారి రెండు దశల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టనున్న ఈ ప్రక్రియలో మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరణ జరుగుతుందని వెల్లడించారు.
ATP: పుట్లూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 12న ప్రవేశ పరీక్ష నిర్వహించ నున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఓబుళరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు పాఠశాలలోని పరీక్షా కేంద్రం వద్దకు హాల్ టికెట్తో చేరుకోవాలని ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
KRNL: ఆస్పరి మండలం పుటకలమర్రి ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల 12న ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు బుధవారం ప్రిన్సిపల్ ఎస్.షమీల తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, పరీక్ష రోజు ఉదయం 9:30 గంటలకు స్కూల్కు హాజరుకావాలని సూచించారు.
NLR: నెల్లూరు జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన ARPC రమేశ్ బాబు కుటుంబానికి రూ.1.12 కోట్లు, పీసీ శివకుమార్ కుటుంబానికి రూ.1.10 కోట్ల బీమా చెక్కులను జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల బుధవారం సాయంత్రం అందజేశారు. SBI సహకారంతో ఈ మొత్తాన్ని అందజేస్తూ బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
ATP: అనంతపురం JNTU VC సుదర్శన్ రావును ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ కలిశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఐటీ, సాంకేతిక రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అవసరమైన శిక్షణపై చర్చించారు. బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ నిపుణుల బృందాన్ని వీసీకి పరిచయం చేశారు. ఏఐపై పట్టు సాధిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఎంపీ తెలిపారు.
E.G: రాజమండ్రి మల్లయ్యపేట సబ్ స్టేషన్ పరిధిలో కండక్టర్ రీప్లేస్మెంట్ పనుల వల్ల గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. కాతేరు, తిరుమల కాలేజీ ఏరియా, దాసరి నగర్, సి.టి.ఆర్.ఐ రోడ్, గణపతి నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలన్నారు.
కోనసీమ: అమలాపురం మండలం సాకుర్రు గ్రామ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తహశీల్దార్ వి.ఎస్.దివాకర్ను పంచాయతీ కార్యదర్శి రమా శైలజ, గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో కార్య దర్శి ఆయనకు పుష్పగుచ్చం అందించి దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పొలమూరి బాలకృష్ణ, గుత్తుల చిరంజీవి పాల్గొన్నారు.
ASR: పాడేరు మండలం నీకాయిపాడులో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇనుప విద్యుత్ స్తంబాలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గ్రామంలో ఐదు స్తంభాలు ప్రమాదకర స్థితిలో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశముందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు స్పందించి నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
KKD: ఏలేరు రిజర్వాయర్ పవర్ ప్లాంట్ బిట్-2 సమీపంలో బుధవారం వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మత్స్యకారుల సమాచారంతో మత్స్య శాఖ అధికారి రాజేంద్రరావు బోట్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడు జడ్డంగి అన్నవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా ఎస్సై రామలింగేశ్వరరావు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్: విజయవాడకు చెందిన న్యాయవాదిని కిడ్నాప్ చేసి ఆస్తులు రాయించుకున్న కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు కర్నాటి వీరభద్రరావును పటమట పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 12న అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆయనను న్యాయస్థానం అనుమతితో విచారిస్తున్నారు. తొలిరోజు విచారణలో కీలక అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం.
శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీసు మంజూరైనట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రకటనల్లో తెలిపారు. హమ్సఫర్ ఎక్స్ప్రెస్ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుందని రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం రోడ్ నుంచొ ప్రయాణిస్తుందన్నారు.
SKLM: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. మంత్రి సుభాష్ గురువారం ఉ.10.30కు ఎచ్చెర్లలోని NACL కంపెనీలో సేఫ్టీ సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రెడ్డీస్ లాబరేటరీలో జరిగే మాక్ డ్రిల్ను సందర్శిస్తారు. అనంతరం సా. 3 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారని తెలిపారు.