ELR: డీజిల్ నిల్వల కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. జిల్లా ప్రజల అవసరాల మేర డీజిల్ నిల్వలు ఉన్నాయన్నారు. బంకులలో డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోకుండా ఒకరోజు ముందుగానే ట్యాంకర్లను బుక్ చేయాలనీ సోమవారం బంకు యాజమాన్యాలకు సూచించారు. రబీ ధాన్యం తరలించే వాహనాలు, ఆక్వా కి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
GNTR: మంగళగిరిలో జరిగిన జిల్లా పవర్లిఫ్టింగ్ పోటీల్లో తెనాలికి చెందిన 9వ తరగతి విద్యార్థి వడ్డేపల్లి కార్తీక్ గౌరీనాధ్ సత్తాచాటాడు. 105 కేజీల సబ్జూనియర్ విభాగంలో 275 కిలోలు ఎత్తి బంగారు పతకం సాధించాడు. ఆల్రౌండ్ విభాగంలో కాంస్యాన్ని అందుకొని ద్విపతక విజయం నమోదు చేశాడు. ఈ మేరకు పలువురు అతన్ని అభినందించారు
KDP: బద్వేల్ డివిజన్లో పెట్రోల్,డీజిల్ కొరతపై ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్డీవో చంద్రమోహన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒక్కరికీ గరిష్టంగా 2 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కార్లకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, భారీ వాహనాలకు 100 లీటర్ల పరిమితి విధించారు. డ్రమ్ముల్లో నిల్వ చేసుకోవడం, ఫుల్ ట్యాంక్ నింపడం కొద్ది రోజులపాటు నిషేధించారు.
W.G: హైదరాబాద్ నుంచి పెనుగొండ వాసవి ధామం దర్శనానికి వచ్చిన యాత్రికులు డీజిల్ కొరతతో సోమవారం పాలకొల్లులో నిలిచిపోయారు. తిరుగు ప్రయాణం కోసం బస్సులకు ఇంధనం దొరక్కపోవడంతో బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నామని యాత్రికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు డీజిల్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
NTR: కంచికచర్ల మండలంలో పరిపాలన మార్పులు చోటుచేసుకున్నాయి. మండల తహశీల్దార్ సిహెచ్ నరసింహారావు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఏలూరు జిల్లాకు బదిలీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ తహశీల్దారుగా మానస బాధ్యతలు స్వీకరించారు.
KRNL: ఆదోనిలో మైనారిటీల అంశాలపై మాట్లాడేటప్పుడు ప్రజాప్రతినిధులు బాధ్యతతో వ్యవహరించాలని ఇవాళ మగ్ధుం భాష అన్నారు. ప్రెస్మీట్లు స్పష్టంగా, అసలు సమస్యలపై కేంద్రీకృతంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా సమాజానికి ఉపయోగపడే చర్చలు జరగాలని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి, పారదర్శక ఎన్నికలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
NDL: మహానంది మండలం బొల్లవరం మైనార్టీ కాలనీలో సోమవారం తాగునీటి పైపులైన్ లీకేజీతో నీరు వృథాగా పోతోంది. కొత్త మసీదు సమీపంలో పైపు పగలడంతో ఇళ్లకు సరఫరా తగ్గి, రోడ్డుపై నీరు నిలిచి మురుగును తలపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు వృథా కాకుండా, రహదారిపై నీటి నిల్వలను తొలగించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర మార్నింగ్ విజిట్లో భాగంగా నగరంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. 12వ డివిజన్లో చెత్త కుప్పగా ఉన్న ప్రాంతం హెచ్చరిక బోర్డుల వల్ల శుభ్రంగా మారినట్లు గుర్తించారు. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం వద్దని అధికారులను ఆదేశించారు. అకస్మిక తనిఖీలను మరింత పెంచాలని సూచించారు.నగర శుభ్రతకు ప్రజల సహకారం తప్పనిసరి అని తెలిపారు.
PLD: నరసరావుపేటలో శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో చంద్రా & ప్రమీల నల్లపాటి కళాపరిషత్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి నాటిక పోటీలలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము తదితరులు హాజరయ్యారు.
డీజిల్, పెట్రోలుపై వస్తున్న వదంతులపై విజయనగరం జిల్లాలో పలు పెట్రోల్ బంకులను కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నేరుగా వచ్చే వాహనాలకు పెట్రోలు వేయాలని ఆదేశించారు. డబ్బాలు, క్యాన్లో పెట్రోల్ వేయకూడదని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
VSP: ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ సూక్తితో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లీగల్ సర్వీస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విల్సన్పేటలో భారీ ఉచిత నేత్ర వైద్య శిబిరం తగరపువలసలో ఇవాళ నిర్వహించారు. జాతీయ ఛైర్మన్ డా. బి.గోపి నాయక్ పిలుపుతో నిర్వహించిన శిబిరానికి మంచి స్పందన లభించిందన్నారు. ఈ మేరకు డా. బాలకృష్ణ నేతృత్వంలో పరీక్షలు చేసి, దృష్టి లోపం ఉన్నవారికి ఉచిత కంటి అద్దాలు ఇచ్చారు.
AKP: పెట్రోల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గొలుగొండ మండలంలోని పెట్రోల్ బంకుల్లో పరిస్థితులను ఇవాళ తహసీల్దార్ నూకరాజు పరిశీలించారు. బంకుల్లో నిల్వలు, సరఫరా వివరాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. అవసరమైన చోట్ల వెంటనే పెట్రోలు రప్పించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని బంకు యాజమానులకు సూచించారు.
SKLM: లావేరు శాఖా గ్రంథాలయంలో రేపటి నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నామని గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు ఇవాళ తెలిపారు. కథలు, కథనాలు సృజనాత్మక కృత్యాలు, కథలు చెప్పడం, చదవడం మాకిష్టం, స్పోకెన్ ఇంగ్లీష్, యోగపై శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు వేసవి శిక్షణ తరగతులను వినియోగించుకోవాలన్నారు.
ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వెంకటాపురం సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. నిత్యం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడిపే ఆమె, తన పొలంలో సాగుతున్న పంటలను స్వయంగా పరిశీలించారు. పంటల ఎదుగుదల, సాగు విధానాల గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొంతసేపు పొలంలో కలియతిరిగి మొక్కల పరిస్థితిని గమనించారు.
PLD: సత్తెనపల్లి మండలంలోని భృగూబండ గ్రామంలో ప్రేమ విఫలమైందని జమాళ్లమూడి చందు (24) అనే యువకుడు ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గమనించిన ఇంటి పక్కన వారు అతన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల కథనం ప్రకారం.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.