KKD: కాకినాడ ఎలైట్ గ్రీన్ సిటీ వారి సేవా కార్యక్రమాలు అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఆయన కాకినాడలో ఎలైట్ గ్రీన్ సిటీ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువ చేసే కుట్టుమిషన్లను లబ్ధిదారులకు శనివారం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ గ్రీన్ సిటీ నిర్వాహకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
TPT: కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. వైకుంఠ ద్వార దర్శనాలు దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు.
ప్రకాశం: దర్శి పట్టణంలో ఉన్నటువంటి కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో ముండ్లమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 28 కేసులు పరిష్కారం అయ్యాయని ఎస్సై నాగరాజు శనివారం తెలిపారు. లోక్ అదాలత్లో కేసులకు శాశ్వత పరిష్కారం వస్తుందని ఎస్ఐ అన్నారు.
VZM: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ 2024-25 సంబంధించిన టోర్నమెంట్లో శనివారం విజయనగరం వాసులు మెరిశారు. జిల్లా విద్యుత్ శాఖలో సర్కిల్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ పి. అనిల్ కుమార్ 200మీ. పరుగుపందెంలో బంగారు పతకం, పోలుపల్లి పైడిరాజు లాంగ్ జంప్లో కాంస్య పతకం సాధించారు. దీంతో వారిని అధికారులు, సహా ఉద్యోగులు అభినందించారు.
కృష్ణా: నందిగామ మండలం పల్లగిరి గ్రామంలో ఇంటిపై విమానం దర్శనమిచ్చింది. చూడడానికి అచ్చం విమానం బొమ్మలా ఉన్నప్పటికీ ఇది విమానం కాదు. ఆ గృహ యజమాని తన ఇంటి నీటి అవసరాల నిమిత్తం వాటర్ ట్యాంక్ను విమానం ఆకారంలో తయారు చేయించారు. దీంతో ఆ మార్గం గుండా వెళుతున్న ప్రతి ఒక్కరు ఈ విమానం ఆకారంలో ఉన్న వాటర్ ట్యాంక్ను ఆసక్తిగా గమనించడం పరిపాటిగా మారింది.
VSP: భార్యను చంపేస్తానని బెదిరిస్తున్న భర్తపై విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసును శనివారం నమోదు చేశారు. నగరంలో చిన్న వాల్తేరుకు చెందిన దుర్గాప్రసాద్ శ్రావణి అనే యువతిని 2022లోవివాహం చేసుకున్నాడు. సంవత్సరం తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో భర్తపై వేధింపులు కేసు పెట్టారు. ఇటీవల చంపేస్తానని బెదిరిస్తూ ఉండడంతో శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రకాశం: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. వెలిగండ్ల మండలం ఇమ్మడిచెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టుదలతో చదివి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.
NDL: మహానంది మండలం ఎంసీ ఫారం గ్రామ సమీపంలోని పాలేరు వాగు దగ్గర పంట పొలాల్లోకి చిరుత పులి శనివారం రాత్రి రోడ్డు దాటుకుని వెళ్లినట్లు ప్రయాణికులు తెలిపారు. కొందరు భక్తులు దర్శనం అనంతరం మహానంది నుంచి టూరిస్ట్ బస్సులో వెళ్తుండగా పాలేరు వాగు వద్ద రోడ్డు దాటి వెళ్లిందన్నారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
NLR: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని నాయుడుపేట పట్టణంలోని ఆమె నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించి నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘం అధ్యక్షులు శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘంలో తమకు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే విజయశ్రీకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
ELR: ఏలూరులో దారుణ ఘటన జరిగింది. తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని గొడవ పడుతూ వెంకట రాజు (44) అనే వ్యక్తిని నాని అనే యువకుడు శనివారం కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుడి కుమార్తెను నాని తరుచూ వేధించేవాడని.. దీంతో వెంకటరాజు పిల్లల్ని తీసుకుని ఉంగుటూరుకి వెళ్లి ఉంటున్నారు. పని మీద ఏలూరు వచ్చిన వెంకటరాజుతో నాని గొడవపడి హత్య చేశాడని సీఐ కోటేశ్వరరావు తెలిపారు.
ప్రకాశం: గుంటూరు- గుంతకల్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా గిద్దలూరు మీదుగా వెళ్లే గుంటూరు-డోన్ రైలు (17228)ను పది రోజులపాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి 26వ తేదీ వరకు రద్దు చేశారు. అలాగే డోన్- గుంటూరు రైలును ఈనెల 17 నుంచి 27 వరకు రద్దు చేశారు.
W.G: మాజీ సీఎం జగన్ రైతుల ద్రోహి అని మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. శనివారం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం శాఖకు సంబంధించిన డోర్స్, రిప్స్కు గ్రీజ్ పెట్టలేని దుస్థితిని గత ప్రభుత్వంలో చూశామన్నారు. ఇరిగేషన్ శాఖకు రూ.18 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెడుతుందన్నారు.
KRNL: ఓర్వకల్లు మండలం శకునాలలో తహసీల్దార్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సాగునీటి సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. నామినేషన్లు టీడీపీ మద్దతుదారులు ఒకరే వేయడంతో నీటి సంఘం ఎన్నిక ఏకగీవ్రమైంది. సాగునీటి సంఘం అధ్యక్షుడిగా గణశ్యాంసుందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడుగా ఆకుల లక్ష్మయ్యతో పాటు సభ్యులు పుల్లయ్య, బీ. రాముడు, ఎం. రాముడు, వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
VZM: విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యం నాయుడు అన్నారు. బాబా మెట్టలోని కేంద్రీయ విద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
W.G: పాలకొల్లులోని ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మద్దాల శ్రీనివాస్ డ్రగ్స్పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గంజాయి, నాటు సారా, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలని ప్రభుత్వం, శాఖ పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. ఇందుకు యువత సహకారం కావాలన్నారు. మత్తు పదార్థాల విక్రయాలు జరిగితే సమాచారం ఇవ్వాలని కోరారు.