• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా కాలువలకు నీటి విడుదల

GNTR: ప్రకాశం బ్యారేజీ నుంచి శుక్రవారం కృష్ణా డెల్టా పంట కాలువలకు మొత్తం 2,858 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో కృష్ణా పశ్చిమ కాలువకు 2,212, తూర్పు కాలువకు 502, మరియు గుంటూరు ఛానల్‌కు 144 క్యూసెక్కుల నీటిని కేటాయించారు. అలాగే తూర్పు కాలువ ద్వారా కేఈబీకి 302, బందరు కాలువకు 200 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు.

February 21, 2026 / 08:15 AM IST

సోమశిల జలాశయం తాజా నీటి మట్టం వివరాలు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. శనివారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 67.226 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 908 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో 262 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.

February 21, 2026 / 08:13 AM IST

‘జిల్లాలో పంట కొనుగోలు చేస్తాం’

KDP: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా సూచించారు. జిల్లాలో 80,103 హెక్టార్లలో శనగ పంట సాగు చేశారన్నారు. 15 కొనుగోలు కేంద్రాల ద్వారా 18,532 మెట్రిక్ టన్నులు పంట కొనుగోలు చేస్తామన్నారు. రైతులు రైతు సేవా కేంద్రంలో పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.

February 21, 2026 / 08:08 AM IST

ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

CTR: జిల్లా ఎస్పీ, నగరి DSP ఆదేశాల మేరకు నిండ్రలోని బాలికల జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరి రూరల్ సీఐ భాస్కర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుపై ప్రభావం చూపే ర్యాగింగు కళాశాలల్లో స్థానం లేదన్నారు. ర్యాగింగ్ జరగకుండా పూర్తిగా నిషేధించినట్టు తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 21, 2026 / 08:07 AM IST

విశాఖలో రేషన్ డిపోలు పెంచండి: ఎమ్మెల్యే

VSP: విశాఖలో రేషన్ డిపోలను పెంచాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తుతం 442 డిపోలు ఉన్నాయని మరో 43 డిపోలు కేసుల్లో ఉండడం వల్ల పనిచేయడం లేదన్నారు. 25 లక్షల జనాభా ఉన్న విశాఖలో ప్రతి 1000 మందికి ఒక రేషన్ డిపో ఉండాలని నిబంధన ఉందని దీనిని అమలు చేయాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 08:05 AM IST

వైభవంగా ఊంజల్ సేవ

అనకాపల్లి పట్టణం గవరపాలెం గౌరీ పంచాయతన ఆలయంలో శుక్రవారం రాత్రి గౌరీ పరమేశ్వరుల ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు గోపాలకృష్ణశర్మ, సూర్యనారాయణ శాస్త్రి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలపించిన భక్తి కీర్తనలు ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు కే సన్యాసిరావు కార్యదర్శి రామ సత్యనారాయణ పాల్గొన్నారు.

February 21, 2026 / 08:05 AM IST

స్వచ్ఛ రథానికి జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి వారి ఆరోగ్యాలను మెరుగుపరిచేందుకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథం కేటాయించిందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. అందులో భాగంగా కొత్తవలస మండలానికి కేటాయించిన స్వచ్ఛ రథాన్ని ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మతో కలిసి ఆమె శనివారం జెండా ఊపి ప్రారంభించారు. జెడ్పీ సీఈవో, డీపీవో, పీఏసీఎస్ అధ్యక్షులు ఉన్నారు.

February 21, 2026 / 08:05 AM IST

‘చేనేత గర్జన సభను విజయవంతం చేయండి’

కోనసీమ: ఆదివారం మంగళగిరిలో జరిగే చేనేత గర్జనను విజయవంతం చేయాలని రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఊటుకూరు సుబ్రహ్మణ్యం కోరారు. అమలాపురం మండలం బండారులంకలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా నుంచి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 07:49 AM IST

ఆత్రేయపురం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం రాత్రి ఆత్రేయపురం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతలు, కేసుల దర్యాప్తు తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారిని  దర్శించుకునేందుకు ప్రతి శనివారం వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్సై రామును ఆదేశించారు.

February 21, 2026 / 07:49 AM IST

నేడు మండల సర్వసభ్య సమావేశం

SKLM: జి.సిగడాం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 10.30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.రామకృష్ణా రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ మీసాల సత్యవతి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి గౌరవ సభ్యులు, సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కోరారు.

February 21, 2026 / 07:47 AM IST

మాజీ మంత్రి కాకాణికి మరోసారి నోటీసులు

NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 24న రూరల్ డీఎస్పీ ఆఫీస్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ వాయిదా పడింది. కాగా గుమ్మలదిన్నెలో బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేసిన కేసులో ఆయనను విచారించనున్నారు.

February 21, 2026 / 07:47 AM IST

బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించిన విద్యార్థులు

కడప: నగరంలోని SKR, SKR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు శుక్రవారం సీ.పీ బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించారు. అక్కడి పుస్తకాలను, తామ్రపత్రాన్ని, తాళపత్ర గ్రంధాలను, రాత పత్రాలను చూసి తెలుసుకున్నారు. సహాయ పరిశోధకులు బూతిపూరి గోపాలకృష్ణ వాటి గురించి వివరించారు. కళాశాల అధ్యాపకులు డా. ఎం గురు మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 07:46 AM IST

శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న విదేశీయులు

TPT: శ్రీకాళహస్తీశ్వరున్ని శుక్రవారం జర్మనీ, రష్యా దేశానికి చెందిన సుమారు 200 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు కల్పించారు. విదేశీయులు సాంప్రదాయ దుస్తులలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలోని శిలా నైపుణ్యాలను పరిశీలించి నిర్మాణ శైలికి మంత్రముగ్ధులయ్యారు. ఆలయాన్ని సందర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు.

February 21, 2026 / 07:44 AM IST

కన్నులపండువగా పైడితల్లి అమ్మవారి నేత్రోత్సవం

VZM: పొలిపల్లి పైడితల్లి అమ్మవారికి నేత్రోత్సవం శుక్రవారం కన్నులపండువగా నిర్వహించారు. ఈ ప్రక్రియ దశాబ్దాలుగా ఆనవాయితిగా జరుగుతుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వంశ పారంపర్య ధర్మకర్తలు, వాకచర్ల కుటుంబీకులు మంగళవాయిద్యాలతో ఆలయానికి చేరుకొని పసుపు, కుంకుమలు, పట్టువస్త్రాలు సమర్పించారు.

February 21, 2026 / 07:38 AM IST

జాతీయ రహదారి నిర్మాణంలో ఫ్లైఓవర్ కావాలని వినతిపత్రం

KKD: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ సానా సతీష్ ఢిల్లీలో ఎన్‌హెచ్ఐఐ ఛైర్మన్ సంతోశ్ కుమార్ యాదవన్‌ను కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. రామవరం-తాళ్లూరు మధ్య బైపాస్ నిర్మాణం వల్ల రైతుల భూములు పోతున్నాయని, దానికి బదులు ఎలివేటెడ్ ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరారు.రైతుల ప్రయోజనాలను దృష్ట్యా జాతీయ రహదారి అలైన్మెంటు పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

February 21, 2026 / 07:38 AM IST