Lakshadweep: మిన్కాయ్ దీవుల్లో కొత్త ఎయిర్పోర్ట్!
ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ప్రపంచమంతా ఈ పేరు మారుమోగుతుంది. అయితే మినికాయ్ దీవుల్లో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
Lakshadweep: ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ఈ దీవుల పేరు హాట్ టాపిక్గా మారింది. ఈ దీవులు గురించి భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అందరూ నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అయితే ఇక్కడ కేంద్రం మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు సిద్ధమవుతోంది. లక్షద్వీప్లోని మిన్కాయ్ దీవుల్లో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ, వాణిజ్య అవసరాల కోసం మినికాయ్లో నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫైటర్ జెట్లు, సైనిక రవాణా ఎయిర్క్రాఫ్ట్లతో పాటు వాణిజ్య విమానాల నిర్వహణ సామర్థ్యం ఉండేలా ద్వంద్వ ప్రయోజనాలతో కొత్తగా ఎయిర్పోర్టును నిర్మించేుందుకు కేంద్రం ప్రణాళికలు చేస్తోంది.
మినికాయ్ దీవుల్లో ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. గతంలోనే మినికాయ్ దీవుల్లో రక్షణరంగ అవసరాల కోసం ఎయిర్ఫీల్డ్ను నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయి. అరేబియా, హిందూ మహాసముద్రాల్లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, సముద్రపు దొంగల దాడులు పెరుగుతున్న వేళ.. వాటిపై నిఘాను పెంచేందుకు ఈ ప్రాంతం బాగా ఉపయోగపడుతుందని కోస్ట్గార్డ్ గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా పౌర విమానాలు కూడా రాకపోకలు సాగించేలా ఇక్కడ కొత్త ఎయిర్పోర్టును నిర్మించాలని కేంద్రం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.