నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి శనివారం పరిశీలించారు. పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ పడకూడదని, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు.
BHNG: చౌటుప్పల్ మండలం జెకేసారం గోకారం చెరువు, బోర్లు అడుగంటడంతో 150 ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. ‘ఇంటింటికి సీపీఎం’లో భాగంగా ఇవ్వాళ పొలాలను పరిశీలించిన CPM నేతలు కృష్ణారెడ్డి, కిష్టయ్య.. ధర్మారెడ్డి పల్లి కాలువ పనుల జాప్యం వల్లే ఈ దుస్థితి అని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
NLG: టెన్త్ పరీక్షల్లో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో బిక్షపతి తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 71 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, రెగ్యులర్ విభాగంలో 19,718 మందికి గాను 19,664 మంది (99.73%) హాజరయ్యారు. అయితే ప్రైవేట్ విభాగంలో మాత్రం 24 మందికి గాను కేవలం 7 మంది (29.17%) మాత్రమే పరీక్షకు హాజరైనట్లు ఆయన వివరించారు.
KMM: సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ సత్తుపల్లిలో కార్మికులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుడు జె.వి.ఆర్ విప్లవ గీతాలతో కార్మికులను ఉత్తేజపరిచారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.
NZB: జిల్లాలో అనధికారికంగా నిర్వహిస్తున్న CSC సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ట్ మీసేవ అసోసియేషన్ సభ్యులు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. CSC సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా ‘మీసేవ’ బోర్డులు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు. తక్షణమే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
KMR: డోంగ్లి మండల ప్రత్యేక అధికారి మరియు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య శనివారం మోగా గ్రామ శివారులో సాగుతున్న ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి పనులు నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఎండలు తీవ్రమవుతున్నందున కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలని ఆమె సూచించారు.
WGL: వేసవికాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చెయ్యనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి నెల 16.50 లక్షల క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరుగుతోంది. కానీ ఏప్రిల్ నెలలో ఒకేసారి 49.50 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేయడానికి పౌర సరఫరాల అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
BHPL: జిల్లా కేంద్రంలోని ZP హైస్కూల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్ సూపరింటెండెంట్ లక్ష్మి ప్రసన్నను పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కూడా పరిశీలించారు.
JGL: పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా మెడికల్ కళాశాల నిర్మాణ పనులను శనివారం పరిశీలించారు. అలాగే క్రిటికల్ కేర్ యూనిట్ ఆస్పత్రిని ఎమ్మెల్యే పరిశీలించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వీరితో పాటు జిల్లా వైద్యాధికారి సుజాత, ఉప వైద్యాధికారి శ్రీనివాస్, డా.విజయ్ రెడ్డి, డీఈ పాల్గొన్నారు.
GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్లో ప్రయాణికుల కోసం చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ మంజుల ధర్మ, 7వ వార్డు కౌన్సిలర్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో శనివారం శాంతినగర్-ఐజ బస్ స్టాప్ వద్ద ఈ ఏర్పాట్లు చేశారు. ఎండాకాలంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు తాత్కాలిక పందిరి వేశామని తెలిపారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
MLG: వెంకటాపూర్(M)లోని పొర్కలపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల నర్సయ్య శనివారం అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కలెక్టరేట్లో హాస్టల్ వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలన్నారు. భోజనం, స్టడీ అవర్స్ సమయంలో వార్డెన్లు తప్పనిసరిగా హాజరై ఉండాలని, హాస్టళ్లలోనే నివసించాలని స్పష్టం చేశారు. కేటాయించిన బడ్జెట్ను నెలాఖరు లోపు పూర్తిగా వినియోగించుకోవాలన్నారు.
SRD: పటాన్ చెరు మండల నందిగామలో 29 నుంచి జరిగే మహాచండి యాగానికి జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ కుటుంబాన్ని ఆహ్వానించినట్లు పటాన్ చెరు నియోజకవర్గ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా కాట మాట్లాడుతూ నందిగామ వెంకటేశ్వర స్వామి కళ్యాణమహోత్సవానికి సతీ సమేతంగా హాజరు కావాలని జిల్లా మంత్రిని ఆహ్వానించినట్లు తెలిపారు.
MDK: నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో శనివారం రూ.7 లక్షల వ్యయంతో ప్రధాన రోడ్డుకు సీసీ రోడ్డు పనులను సర్పంచ్ బత్తుల స్వప్న ప్రారంభించారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, ఉపసర్పంచ్ రామచంద్రం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ASF: సిర్పూర్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసెంబ్లీలో సిర్పూర్ MLA హరీష్ బాబు శనివారం ప్రస్తావించారు. వేసవి కాలం నేపథ్యంలో ప్రతి గ్రామానికి కనీసం రెండు బోర్వెల్స్ ఈ ఏడాదిలోనే మంజూరు చేయాలని కోరారు. అయితే కనీసం బోరు వేయాలన్నా MLAలు, కలెక్టర్ల వద్ద నిధులు లేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.