ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ జగ్గారావు పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ ఆర్.ప్రభాకర రావు జగ్గారావును శాలువాతో సన్మానించి, ఆయన సేవలను ప్రశంసించారు. 35 సంవత్సరాల సేవలో నిష్కలంకంగా విధులు నిర్వహించినట్లు తెలిపారు. కాగా, జగ్గారావు 2016లో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందాడు.
HNK: వరంగల్ జిల్లా కేంద్రానికి విమానాశ్రయాన్ని మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కృతజ్ఞతలు తెలిపారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో నేడు ఆమె మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా ప్రజలకు కానుక అందించిన పిఎం నరేంద్ర మోదీతోపాటు కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డిలకు రుణపడి ఉంటామని తెలిపారు.
NRML: లోకేశ్వరం మండల కేంద్రంలో మండల మేరు సంఘం, యూనియన్ ఆధ్వర్యంలో శుక్లవారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు. మొదట కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రోజురోజుకు పెరిగి పోతున్న రేడిమేడ్ రంగం ప్రభావంతో మేర కులస్తులు, దీనిపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు.
NGKL: కల్వకుర్తి మండలం జెపి నగర్కు చెందిన గురుకుల విద్యార్థి ఓమేష్.. మహాశివరాత్రి పర్వదినాన వెల్దండ మండలం గుండాల గ్రామానికి వెళ్లి కోనేరులో స్నానం చేస్తుండగా.. కాలుజారి గల్లంతయ్యాడు. 48 గంటలు.. శ్రమించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శుక్రవారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
NGKL: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో శుక్రవారం భేటీ అయ్యారు. ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. నూతన జూనియర్ కళాశాల భవనం నిర్మాణం, జేఎన్టీయూ క్యాంపస్ ఏర్పాటు, కొత్త ఆర్ అండ్ బి రోడ్లు మంజూరు, తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
MNCL: ఇంధనపెల్లి అటవీశాఖ రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మాట్లాడుతూ ఇంతకుముందు అక్రమ రవాణా చేసిన ట్రాక్టర్లను పట్టుకున్నామని, అయినా కొంతమంది రాత్రి వేళలో ఇసుక తలిస్తున్నారననే సమాచారం మేరకు కేవలం ఇంటి నిర్మాణాలు, ప్రభుత్వ అవసరాల మేరకు మాత్రమే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక రవాణాకు అనుమతి ఉన్నదని తెలిపారు.
NRML: విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని నర్సాపూర్ జీ కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రత్యేక అధికారి వీణ అన్నారు. శుక్రవారం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలంటే పాఠశాల స్థాయి నుండి సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవాలని అన్నారు.
WNP: మార్చి 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత శంకుస్థాపన చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు, 500 పడకల ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యే జయరాములు యాదవ్, బాలకృష్ణయ్య పేరు పెట్టాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచల యుగేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యేను కలిసి తెలిపారు.
MBNR: అమ్రాబాద్ మండలంలోని మొల్కమామిడి గ్రామ శివారులో ఇవాళ ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా ద్వంసం అయ్యింది.
NZB:న్యాక్ నిజామాబాద్ శిక్షణ కేంద్రంలో టైలరింగ్లో ST మహిళలకు 15 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ ఉమ్మడి జిల్లా నిజామాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి శుక్రవారం ఒక తెలిపారు. అభ్యర్థుల వయస్సు18 నుండి 55 వరకు ఉండాలని, శిక్షణ సమయంలో 3వేల రూపాయలస్టైపండ్తో పాటు ఉచిత టూల్ కిట్ అందజేస్తామన్నారు. వివరాలకు 7396261987 నంబర్ను సంప్రదించాలన్నారు.
NLG: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేసి ఈ విధంగా మాట్లాడారు.
ADB: బేల మండలంలోని అవల్పూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు భారతీయ జనతా పార్టీ మండల నాయకులు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. నాయకులు తిరుపతి, రాకేష్, వెంకటరెడ్డి, వికాస్, శంకర్, సంతోష్, గిరిధర్, గ్రామ పెద్దలు, తదితరులున్నారు.
WGL: బ్లడ్ డోనర్, బ్లడ్ మోటివేటర్ WGL పోలీస్ కానిస్టేబుల్ కన్నెరాజుకి కాకతీయ పురస్కారం లభించింది. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 17,834 మందికి రక్తాన్ని అందించడం, ఐదు రాష్ట్రాల్లో ప్రజలకు రక్తదానాల మీద అవగాహన కల్పించడం, వృద్ధాశ్రమాలకు ఆర్థిక సహాయం అందించి, అవయవ దానాల మీద అవగాహన కల్పించడం ద్వారా పురస్కారం అందించడం జరిగిందన్నారు.
NZB: జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో గత కొన్ని రోజులు నుంచి ఎండల తీవ్రత రోజుకు పెరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రస్తుతం ఫ్యాన్ల వినియోగం కాస్త పెరిగింది. రానున్న రోజుల్లో కూలర్ల వినియోగం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు.
KMM: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 62వ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.