తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్ట్ టీచర్లను క్రమబద్ధీకరిస్తూ సీఎం కేసీఆర్ సర్కార్ జీవో జారీ చేసింది. కాంట్రాక్ట్ టీచర్లకు 12 నెలల జీతంతో పాటు 6 నెలల ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా టీచర్లందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానాన్ని పెంపొందించి లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహనను కలిగించే ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదన్నారు.
గురుపూజోత్సవం వేళ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసిన ప్రభుత్వం తాజాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్దీకరించినట్లు ప్రకటించింది. గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు పీఆర్సీని అమలు చేస్తూ 12 నెలల పూర్తి వేతనాన్ని చెల్లించనుందని ప్రభుత్వం తెలిపింది.
గతంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకన్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్ సర్కార్ జారీ చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 567 మంది ఉపాధ్యాయుల్లో 504 మంది మహిళలే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై కాంట్రాక్టు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.