Bandi Sanjay : పదో తరగతి ప్రశ్నా ప్రతాలు లీకైన వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... బండి సంజయ్ పై తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్ చేశారు. ఈ కేసులో సంజయ్ ను విడిచిపెట్టవద్దన్నారు. మునుపటి నేరాలకు సంబంధించి ఆయనపై పీడీ యాక్ట్ కూడా పెట్టాలన్నారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు.
పదో తరగతి పరీక్షా పత్రం లీకు వ్యవహారంలో… బండి సంజయ్ ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఆయన జైలు నుంచి తన కార్యకర్తలకు ఓ లేఖ పంపించడం గమనార్హం. తనకు కేసులు, అరెస్టులు, కొత్త కాదని.. ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ తెలిపారు. తన బాధంతా నిరుద్యోగుల భవిష్యత్ పైనేనని చెప్పారు. 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో, వాళ్ల కుటుంబాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు.
నాడు ఇంటర్ విద్యార్థులను 27 మందిని బలితీసుకున్న ఈ సర్కారు.. ప్రస్తుతం టెన్త్ విద్యార్థుల జీవితాలతోనూ చెలగాటమాడుతోందని విమర్శించారు. కేసీఆర్ కొడుకును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే వరకు.. నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవరకు పోరాడాలని కోరారు. ఇప్పటికే కేసీఆర్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సహా సబ్బండ వర్గాలు అనేక కష్టాలను అనుభవిస్తున్నాయని… వాళ్లందరికీ బీజేపీ ఆశా దీపమైందని తెలిపారు. వాళ్ల ఆశలను నెరవేర్చాలంటే పోరాటమే శరణ్యం అని ఆయన లేఖలో పేర్కొన్నారు.