గర్భిణీలు ఆహారంలో ఉప్పు మోతాదుపై శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 3.8 నుంచి 5.8 గ్రాముల ఉప్పు తీసుకోవడం ఉత్తమం. అంతకు మించి ఉప్పు తీసుకుంటే శరీరంలో నీరు చేరి కాళ్లు, చేతుల వాపులు, బీపీ వంటి సమస్యలు తలెత్తుతాయి. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సమతుల్యంగా ఉప్పు తీసుకోవడం ఎంతో అవసరమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
బ్లడ్ షుగర్ కంట్రోల్కు ఆపిల్ పండు బాగా ఉపయోగపడుతుంది. ఒక మీడియం ఆపిల్లో సుమారు 25 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నా.. ఇందులో ఫైబర్ దాదాపు 4 గ్రాములు ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల షుగర్ రక్తంలోకి నెమ్మదిగా వెళ్తుంది. అందుకే ఆపిల్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ స్పైక్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు రోజుకు 1 మీడియం ఆపిల్ తీసుకోవచ్చు. తొక్కతో పాటు నమిలి తింటే ఇంకా మంచిది.
ఎండ తీవ్రతకు శరీరం డీహైడ్రేట్ కాకుండా క్యారెట్, దోస, టొమాటో, క్యాప్సికం వంటి కూరగాయల సలాడ్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. నిమ్మరసం, మిరియాల పొడి కలిపి తీసుకుంటే రుచితో పాటు రక్తహీనత తగ్గి శరీరం రిఫ్రెష్ అవుతుంది.
కీరదోసకాయ శరీరానికి హైడ్రేషన్, చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్, విటమిన్ K, C అధికంగా ఉంటాయి. ఇది బరువును నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలోని విషతుల్యాలను తొలగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. కళ్ల వాపును తగ్గించడమే కాకుండా, ఎముకలను దృఢపరుస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
భరద్వాజాసనం వెన్నెముకను బలోపేతం చేసి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే యోగాసనం. పొత్తికడుపు అవయవాలను ప్రేరేపించడం, ఛాతీని విస్తరించడం ద్వారా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. నడుము నొప్పి, సయాటికా నరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. తీవ్రమైన వెన్నునొప్పి లేదా వెన్నెముక సమస్యలు ఉన్నవారు యోగా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఆసనం వేయాలి.
గుండె ఆరోగ్యాన్ని ముందుగానే అంచనా వేసేందుకు రెగ్యులర్ స్క్రీనింగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పరీక్షల ద్వారా ప్రమాద సూచకాలను తొందరగా గుర్తింవచ్చు. బీపీ, లిపిడ్ ప్రొఫైల్, హెచ్ బీఏ1సీ, ఎల్డీఎల్, హెచ్డీఎల్ టెస్టులు చేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బయట విక్రయించే ప్యాక్ చేసిన జ్యూస్ల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యలకు దారితీయవచ్చు. పండ్లను రసంగా తాగడం కంటే, పండ్లను అలాగే తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ఊబకాయం, డయాబెటిస్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
పాలకూరలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, శరీరానికి స్టామినా పెరగడంలో పాలకూరలోని పోషకాలు సహాయపడతాయి. తరచుగా పాలకూర తీసుకునే వారికి అలసట తగ్గి శరీరానికి బలం పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడటానికి, జుట్టు బలంగా ఉండేందుకు కూడా పాలకూరలోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.
శరీరానికి అవసరమైన పోషకాలు లభించకున్నా లేదా పోషక లోపం తలెత్తినా.. ఆ ప్రభావం జుట్టుపై పడి వెంట్రుకలు రాలిపోతాయి. కురులు ఒత్తుగా, దృఢంగా, మెరుస్తూ ఉండాలంటే రోజువారీ ఆహారంలో విటమిన్ ఇ, డి, సి, బి-కాంప్లెక్స్తో పాటు ప్రోటీన్లు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. ఇందుకోసం నిత్యం తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో శరీరాన్ని చల్లబరిచి, తక్షణ శక్తిని ఇచ్చేందుకు గంజి ఒక అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. గంజి శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ను పునరుద్ధరిస్తే, రాగి గంజి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచి వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి సామల గంజి, శరీర వేడిని తగ్గించుకోవడానికి సజ్జ అంబలి సరైన ఎంపికలు. ఇవి నీరసాన్ని దూరం చేసి, మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి.
నల్ల టమోటాల్లో ‘ఆంతోసైనిక్స్’ అనే యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సాయపడుతాయి. శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. వీటిలోని విటమిన్ ఎ, బీటా కెరోటిన్.. కంటి చూపును మెరుగుపరుస్తాయి. రేచీకటి వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. డిజిటల్ స్క్రీన్ల ముందు ఎక్కువగా గడిపే వారికి ఈ టమోటాలు వరం.
వేసవిలో ఉ.5 నుంచి 7 గంటల మధ్య లేదా సా.6 నుంచి 8 గంటల మధ్య వాకింగ్ చేయాలి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, హీట్స్ట్రోక్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయం గాలి తాజాగా ఉండి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉ.10 నుంచి మ.4 గంటల వరకు నడవడం ప్రమాదకరం. నడక ప్రారంభించే వారు మొదటి రోజు 20 నుంచి 30 నిమిషాలకు పెంచుకోవాలి. క్రమంగా 30 నుంచి 60 నిమిషాలకు పెంచుకోవాలి.
‘నేనెంతో కష్టపడుతున్నాను.. అయినా నా శ్రమను ఎవరూ గుర్తించడం లేదు’ అని బాధితుడి తరహాలో ఆలోచించే దోరణిని ఆపేయండి. మీరెంత కష్టపడుతున్నారనేది ఎవరికీ అవసరం లేదు. మీ గెలుపు దారిని కనుక్కోవాల్సింది మీరే. విజయ శిఖరాన్ని అధిరోహించే వరకూ మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.
కౌండిన్యాసనం అనేది చేతులు, వెన్నుముకను బలోపేతం చేసే ఒక సవాలుతో కూడిన యోగాసనం. ఇది ఏకాగ్రతను, సూక్ష్మదృష్టిని పెంచడంలో సహాయపడుతుంది. చేతులపై శరీర బరువును మోపే కష్టమైన ఆసనాలలో ఒకటి. శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇది నటరాజాసనం, మయూరాసనం వంటి కష్టమైన యోగాసనాల జాబితాలో ఉంటుంది. కౌండిన్యాసనం వేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ముందుగా యోగా నిపుణుల పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేయడం మంచిది.
వయసుతో పాటు వచ్చే మలబద్ధకం సమస్యకు ప్రతిసారి మందులు వాడాల్సిన పనిలేదు. రోజూ సరిపడా నీరు తాగడం, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు తీసుకోవడం, పెరుగు వంటి ప్రోబయోటిక్స్ తినడం వల్ల పేగుల ఆరోగ్యం సహజంగా మెరుగుపడుతుంది. ఈ చిన్న మార్పులు జీర్ణక్రియను సాఫీగా మార్చి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, ప్రకృతి సిద్ధమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.