BHNG: తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులకు యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్ అన్నారు. ఆలేరులో శుక్రవారం ఆ సంఘం సభ్యుల సమావేశం కిష్టమ్మ అధ్యక్షతన నిర్వహించారు. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా కళాకారులకు అవకాశం కల్పించాలని కోరారు.
NRPT: జిల్లాలో 10వ తరగతి పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల హెచ్ఎంలతో సమావేశమై చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించాలని ఆమె సూచించారు.
PDPL: గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ కుటుంబంలో జరిగిన గొడవలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రామూత్ కొబ్బరికాయలు కొట్టే కత్తితో శుక్రవారం బంధువులు సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తరలించారు.
HYD: స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణమే లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సమగ్ర శానిటేషన్ & ఎంటమాలజీ సమీక్ష నిర్వహించారు. అన్ని వార్డుల జోనల్ కమిషనర్లు, డీసీలు, ఎస్ఈడబ్ల్యూఎం ఇంజినీర్లు, ఎస్ఎఫ్ఎలతో సమావేశమై ఉదయం 6 గంటలకు హాజరు నమోదు, 100% డోర్ టూ డోర్ చెత్త సేకరణ, డ్రై డే పాటింపు, యాంటీ లార్వల్ ఆపరేషన్లపై కఠిన ఆదేశాలు జారీ చేశారు.
WGL: ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ చెల్లింపులపై సమీక్షించి, సంబంధిత శాఖలు వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్పర్సన్ చాహత్ బాజ్ పాయ్ కలసి జిల్లాలో పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
HNK: కాజీపేట పట్టణం మడికొండలోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళా ప్రాంగణంలో శుక్రవారం చెట్లకు అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో ప్రాంగణంలో ఉన్న సుమారు 100 మంది విద్యార్థినులు సురక్షితంగా బయటపడ్డారు.
PDPL: రామగుండం MLA MS రాజ్ ఠాకూర్, మనాలి దంపతులు, కుటుంబ సభ్యులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి సన్నిధిలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు MLA తెలిపారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. MLA వెంట ఆయన సన్నిహితులు ఉన్నారు.
ASF: రెబ్బెన మండలంలో శుక్రవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. కాగజ్ నగర్ X రోడ్ వద్ద బైక్ను అతివేగంగా నడిపిన ఏ.అంజిరెడ్డిపై కేసు నమోదు చేశారు. అలాగే రెబ్బెన PHC సమీపంలో బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా వెళ్తున్న పోగుల శ్రీకాంత్పై కూడా చర్యలు తీసుకున్నామని SI వెంకటకృష్ణ తెలిపారు. ట్రిపుల్ రైడింగ్ చట్ట విరుద్ధమన్నారు.
WGL: నెక్కొండ మండల పరిధిలో పని చేస్తున్న ఇద్దరు ఎస్జీటీ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డీఈవో రంగయ్య శుక్రవారం ఉత్తర్వులు జరీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవుతున్న అంకం ప్రవీణ్ కుమార్, రామారపు రవి సస్పెండ్ అయ్యారు. ప్రవీణ్ కుమార్ అజ్మీర మంగ్యా తండా MPPS, రవి గొట్లకొండ MPPSలలో ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్నారు.
JGL: మైనార్టీ ఈ స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జగిత్యాల జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆర్ఎస్ చిత్రు తెలిపారు. తుర్క కాశి ముస్లిం వర్గానికి టూల్ కిట్లు, జనరేటర్ల పంపిణీ, మైనార్టీ యువతకు ఈ-స్కూటర్ల పంపిణీ పథకానికి ఈనెల 20 నుంచి మార్చి 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
MBNR: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సమాన అవకాశాలు, సహకారం లభించినప్పుడే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్వో)గా డాక్టర్ దుర్గా రామ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ రవీందర్ నాయక్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కూకట్పల్లి డీఎంహెచ్వోగా విధులు నిర్వహిస్తున్న దుర్గా రామ్ కుమార్ కామారెడ్డి జిల్లాకు బదిలీపై రానున్నారు.
GDWL: జిల్లాలో పెండింగ్ ఉన్న భూభారతి దరఖాస్తులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం IDOC కార్యాలయంలో తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం RDO స్థాయిలో 1370 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, త్వరగా క్లియర్ చేయాలని సూచించారు.
SRCL: కొనరావుపేట మండలం కొండాపూర్ మూల వాగులో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం మూల వాగులో తాళ్లపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాక్టర్లో ఇసుక నింపుకొని వాగులో నుంచి బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ADB: ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించిన అనంతరం మహిళా సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గదిని ప్రారంభించారు. గ్రామాల్లో వీపీఓ విధానం అమలు చేస్తూ గంజాయి, గుడుంబా జరగకుండా రాయితీ బియ్యం, పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలలో సీసీటీవీ ఏర్పాటు చేయాలన్నారు.