• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు!

PDPL: మంథని మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పక్కా సమాచారంతో గుట్టు చప్పుడు కాకుండా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 04:47 PM IST

సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ ఓయూలో జరిగిన సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిర్వహించిన ఈ సమావేశం “Creating AI & Quantum Enabled Higher Educational Institutions” అంశంపై జరిగింది. తెలంగాణ గవర్నర్‌తో పాటు సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు.

February 20, 2026 / 04:45 PM IST

ఘనంగా సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు

SRD: భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో సంత్ శ్రీ గురు రవిదాస్ 649వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించుకుని సంత్ రవిదాస్ విగ్రహానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 04:42 PM IST

‘పెద్దపల్లిలో ఈనెల 24న జాబ్ మేళ’

PDPL: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు సాక్సెస్ ప్రాజెక్ట్ LLP కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 24న PDPL జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి రాజశేఖర్ తెలిపారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 50, మార్కెటింగ్ మేనేజర్ 1 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. 18-36 సం.ల మధ్య గల అభ్యర్థులు ఈనెల 24న ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు.

February 20, 2026 / 04:38 PM IST

‘కార్యాలయాలను నాగారం బంగ్లాలోనే నిర్మించాలి’

SRPT: నాగారం మండలానికి మంజూరైన తహశీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ పక్కా భవనాలను నాగారం రహదారి బంగ్లాలో నిర్మించాలని శుక్రవారం గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అన్ని గ్రామాల ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాన రహదారిపై ఉండడం వల్ల పరిపాలన సులభంగా ఉంటుందని అఖిలపక్ష నాయకులు అన్నారు.

February 20, 2026 / 04:36 PM IST

వనపట్లలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

NGKL: నాగర్‌కర్నూల్ సమీపంలోని వనపట్ల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న గన్నోజ్ సురేష్ చారి(40) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి సోమశిలకు వెళ్తున్న కారు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. భార్య రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

February 20, 2026 / 04:36 PM IST

వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి: వడ్ల రాజు

KNR: కేంద్రం అమలు చేస్తున్న వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను యథావిధిగా కొనసాగించాలని కరీంనగర్‌లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి కూలీల వేతనాన్ని రూ.600కు పెంచాలని కోరారు. పనిస్థలాల్లో తాగునీరు, టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని అన్నారు.

February 20, 2026 / 04:34 PM IST

పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెరిసిన ఖేడ్ వాసి

SRD: హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్ బాడ్మింటన్ సింగల్స్ విభాగంలో రేంజ్-1 నుంచి పాల్గొని నారాయణఖేడ్ బాడ్మింటన్ క్రీడాకారుడు అబ్దుల్ సాజిద్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐజీపీ గజరావ్ భూపాల్ బహుమతి ప్రదానం చేశారు. సాజిద్ విజయం పట్ల 4వ బేటాలియన్ కమాండెంట్ D.శివప్రసాద్ రెడ్డి, అధికారులు అభినందించారు.

February 20, 2026 / 04:34 PM IST

ఆహ్వాన పత్రిక అందజేసిన డిప్యూటీ సీఎం

KMM: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న HYDలో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఆశీర్వచనాలు అందజేయాలని కోరారు.

February 20, 2026 / 04:33 PM IST

సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని, గిరిజనుల ఆత్మగౌరవానికి ఆయన జీవితమే ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

February 20, 2026 / 04:31 PM IST

ధరూర్‌లో ఉపాధ్యాయుల సమీక్ష సమావేశం

GDWL: ధరూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల సముదాయ సమావేశం జరిగింది. ఎంఈవో రవీంద్రబాబు మాట్లాడుతూ… ప్రతి పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల కనీస సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని.. మధ్యాహ్న భోజన పథకం వివరాలను ప్రతిరోజూ ఎస్ఎంఎస్ ద్వారా పంపించాలని సూచించారు.

February 20, 2026 / 04:24 PM IST

మైనార్టీ గురుకులంలో మార్కుల పరిశీలన

NRPT: మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల నిర్మాణాత్మక మూల్యాంకన (FA) మార్కుల పరిశీలన కొనసాగింది. ఉపాధ్యాయులు నరసింహారావు, లక్ష్మారెడ్డి, సంధ్య బృందం విద్యార్థుల అంతర్గత మార్కులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులు పక్కాగా సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

February 20, 2026 / 04:20 PM IST

ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

WNP: బీఆర్ఎస్ హయాంలో కేవలం పార్టీ కార్యకర్తలకే ఇళ్ల పట్టాలు ఇచ్చారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కొత్తపల్లిలో లబ్ధిదారురాలు గొల్ల శంకరమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో పాల్గొని ఆయన నూతన వస్త్రాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఇళ్లు కడితే కమిషన్లు రావనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వాటిని పెట్టిందని ఆరోపించారు.

February 20, 2026 / 04:20 PM IST

సావర్గవ్‌లో తాగునీటి సమస్యపై గ్రామసభ

KMR: జుక్కల్ మండలం సావర్గవ్‌ గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు శుక్రవారం సర్పంచ్ రవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బోరుబావుల మరమ్మతులు చేపట్టాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టి నీటి వృథాను అరికట్టాలని నిర్ణయించారు. తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా మోటార్లకు మరమ్మతులు చేయించాలని తీర్మానించారు. అలాగే దళితవాడలో మురుగుకాలువల నిర్మాణానికి నిధులు ఇవ్వాలన్నారు.

February 20, 2026 / 04:20 PM IST

‘ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి’

MHBD: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామంలో ఇవాళ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకుబ్ ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. జీరాంజీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ. 600 పెంచాలని కోరారు.

February 20, 2026 / 04:11 PM IST