BDK: భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్ జన్మదినం సందర్భంగా ఇవాళ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లక్ష్మీపురం ప్రాంతంలో ఆర్గానిక్ పంటలను సాగుచేస్తూ ఆదర్శ రైతుగా నిలిచిన లక్ష్మీ రెడ్డి పంట యొక్క ప్రాముఖ్యతను ఆయనకు వివరించగా త్వరలోనే పంటలను వీక్షిస్తానని హామీ ఇచ్చారు.
అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గిరిజన సమస్యలను ప్రస్తావించారు. అటవీ ఉత్పత్తులను జీసీసీ ద్వారానే కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో 544 ఖాళీల భర్తీ, జీవో నెం.3 పునరుద్ధరణ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
TG: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన-2027ను చేపట్టేందుకు మంత్రివర్గం చర్చించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే గణన.. రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు సహా మొత్తం 89వేల మంది ఉద్యోగులు జనగణన ప్రక్రియలో పాల్గొంటారు.
SRPT పట్టణంలోని టౌన్ హాల్లో ఈనెల 25న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించనున్నారు. సీఐ చరమందరాజు తెలిపారు. సర్కిల్ పరిధిలోని లారీ, ఆటో, స్కూల్ బస్, క్యాబ్ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ కే. నరసింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారు.
KMM: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి, మొత్తం 39 పతకాలు సాధించడం అభినందనీయమని సీపీ సునీల్ దత్ పేర్కొన్నారు. ఇందులో 15 బంగారు, 8 వెండి, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. క్రీడల పట్ల ఆసక్తిని కనబరుస్తూ కమిషనరేట్ పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన క్రీడాకారులను ఆయన అభినందించారు.
భీమునిపట్నం (భీమిలి) జీవీఎంసీ జోన్-1 కమిషనర్గా మేకల విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి, పారిశుధ్య నిర్వహణకు, పౌర సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది, స్థానిక నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
VZM: ప్రైవేటు విద్యను వ్యతిరేకిద్దాం, ప్రభుత్వ విద్యను కాపాడుకుందామని RSU జాతీయ అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లాలో గాంధీ సర్కిల్ నుంచి ఏపీ ఎన్జీవో హోం వరకు విద్యార్థులు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న అధ్యాపక, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
NRPT: పాలమూరు స్టేడియంలో జరిగిన రెండో రాష్ట్రస్థాయి సీఎం కప్ నెట్బాల్ పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలుర జట్టు రన్నరప్గా నిలిచి రజత పతకం సాధించింది. క్రీడాకారుల ప్రతిభను డీవైఎస్వో వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు రమేశ్ శెట్టి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
W.G: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులకు కేటాయించిన రూ.100,000 విలువైన కూపను పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి తిరస్కరించారు. ఆ కూపన్ను మండలి జాయింట్ సెక్రటరీ విజయరాజుకు తిరిగి అందజేశారు. సభలో ప్రజా సమస్యలు, బడ్జెట్ పై అర్థవంతమైన చర్చ జరగడం లేదని.. కేవలం రాజకీయ అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘AA22’. ‘పుష్ప 2’ విజయం తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో, దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఓ అదిరిపోయే అప్డేట్ SMలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
NLG: అఖిల భారత బంజారా సేవా సంఘం మిర్యాలగూడ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో MLGలో సోమవారం గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుండి బంజారా భవన్ వరకు సాగిన ర్యాలీలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఛైర్ పర్సన్ చిలుకూరి సుధ, గిరిజన నేతలు పాల్గొన్నారు.
ASR: అంగన్వాడీల వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం CITU ఆధ్వర్యంలో అరకులోయ ఐసీడీఎస్ ఆఫీసు వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంగన్వాడీ వ్యవస్థను పటిష్ట పరచడానికి సీఎం చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇచ్ఛిన హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు.
తూ.గో: రాజమండ్రిలో కల్తీ పాల వల్ల నలుగురు మృతి చెందడంపై సోమవారం పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల సరఫరా వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీయాలని కోరారు. ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.
NDL: దివ్యాంగుల కోసం పెండింగ్లో ఉన్న బ్యాక్ లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైసీపీ పులివెందుల దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పులివెందుల ఆర్డీవో చిన్నయ్యకు వినతి పత్రం ఇచ్చారు. అర్హులైన దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు, ఉచిత లైసెన్స్ మేళా, అలాగే సీఎం ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.
KRNL: కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 122 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విక్రంత్ పాటిల్ తెలిపారు. ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటనలు ప్రధానంగా నమోదయ్యాయి. ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.