VZM: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయనగరం పట్టణంలోని అశోక్ బంగ్లాలో ఆదివారం సాయంత్రం గవర్నర్తో మంత్రి శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు అంశాలపై ఇద్దరు చర్చించారు.
ఏలూరు: కలెక్టరేట్ కార్యాలయంలో మరియు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నమన్నారు.
TPT: సత్యవేడు(మం), ఇరుగుళంలో యువత, గ్రామస్తులు ఎంపీ మద్దెల గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్చి 3న నిర్వహించనున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రిక అందించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి సానుకూలంగా స్పందించిన ఎంపీకి గ్రామస్తులు, స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
NDL: జిల్లా కలెక్టరేట్ తో పాటు మండల డివిజన్ కేంద్రాలు మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజలు ఉత్తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చున్నారు.
ATP: తాడిపత్రి మండలం వెలమకూరు పొలాల్లో పేకాటాడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ జగదీష్ ఆదేశాలతో సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. నిందితుల నుంచి రూ.72,980 నగదు, మూడు మోటార్ సైకిళ్లు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
CTR: పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు MLA అమర్నాథ్ రెడ్డి, MP దగ్గు మళ్ల ప్రసాద్ రావు సంయుక్తంగా ప్రకటించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆదివారం 6000 లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను వారు పరిశీలించారు.
KRNL: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మాచాని శివ కేశవ “అత్యంత చిన్న నాటికల్ నాట్ బోర్డ్ తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఆయన గురువు చంద్రశేఖర్తో కలిసి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డిని కలిశారు. ఆదివారం ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. యువతకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
PPM: అర్జీల వివరాలు మీ కోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందన్నారు.
విశాఖ సాగర్నగర్లోని ఇస్కార్ మందిరంలో ఆదివారం “హరే కృష్ణ, హరే రామ” నామస్మరణతో భక్తి వాతావరణం నెలకొంది. వారాంతపు ప్రత్యేక పూజల సందర్భంగా ఇస్కాన్ అధ్యక్షులు సాంబాదాస్ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని భగవద్గీత శ్లోకాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణులు, సుభద్రా దేవి, బలభద్రుడు, జగన్నాథుడు, సీతారాములను అలంకరించారు.
కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో 30 వేల జనసేన సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేయాలని MLA దేవ వరప్రసాద్ సూచించారు. విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో ఆదివారం పార్టీ సభ్యత్వ నమోదుపై సమావేశం నిర్వహించారు. సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
VZM: దేశంలో బీజేపీ మత విద్వేషాలను సృష్టిస్తోందని సీపీఐ రాష్ట్ర నాయకుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆరోపించారు. విజయనగరం అమర్ భవన్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకులు చేస్తున్న అకృత్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు.
ASR: కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం వారపు సంతను ఆదివారం కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ, మంప ఎస్సై శ్రీనివాస్ సందర్శించారు. వారపు సంతకు వచ్చిన మారుమూల గ్రామాల గిరిజనులతో సమావేశం నిర్వహించారు. రహదారి భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. వాహన రికార్డులను సక్రమంగా కలిగి ఉండాలన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని బాపురంలో వెలసిన శ్రీ గంగాదేవి రథోత్సవం ఆదివారం అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగింది. ఉదయం అమ్మవారికి బాపురం క్షేత్ర పీఠాధిపతులు శ్రీ బసలింగమ్మ అవ్వ ఆధ్వర్యంలో ఆకుపూజ, కుంకుమార్చన, బిల్వార్చన, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుంచి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తెచ్చి రథంపై ప్రతిష్టించి రథోత్సవం నిర్వహించారు.
AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. వైద్య శిబిరంలో 240 మంది రోగులు చికిత్సలు చేయించుకోగా వారిలో 26 మందికి ఆపరేషన్ నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులతో పాటు కళ్లద్దాలు అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు.
అన్నమయ్య: తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని ‘బంగారు తంబళ్లపల్లె’గా మార్చడమే లక్ష్యమని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బి. హరిప్రసాద్ అన్నారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను తంబళ్లపల్లెకు రప్పిస్తామని తెలిపారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.