ప్రకాశం: తాళ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివరామపురం గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం స్కూలు బస్సును ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కర్రపాటివారిపాలెంకు చెందిన ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
GNTR: జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం గడువును పొడిగించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ చికిత్స కొనసాగుతుంది. ఈహెచ్ఎస్ ప్రమాణాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అందించనున్నారు.
NDL: బనగానపల్లెలో బాలికపై జరిగిన అత్యాచారయత్నం సభ్య సమాజం తలదించుకునే అనాగరిక చర్య అని మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని, బాలికకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.
CTR: మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతిని చిత్తూరులో ఇవాళ ఘనంగా నిర్వహించారు. పీసీఆర్ సర్కిల్ ఆయన విగ్రహానికి జేసీ ఆదర్శ రాజేంద్రన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆయన బలంగా విశ్వసించారని తెలియజేశారు.
BPT: అద్దంకిలో బెదిరించి నగదు, బంగారం, మొబైల్ అపహరించిన కేసులో ఒంగోలుకు చెందిన సుబ్రహ్మణ్యంను శింగరకొండ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్తో పాటు 14 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు బాలురను జువెనైల్ కోర్డులో హాజరు పరచనున్నారు.
ELR: ఆగిరిపల్లి కొండ కాలనీలో శనివారం ఆపరేషన్ వజ్ర ప్రహర్ పేరిట పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసు సిబ్బంది ఆయా ప్రాంతాలను చుట్టు ముట్టి ప్రతి ఇంటిని, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 47 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు.
ATP: అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్పర్సన్ గిరిజమ్మ, బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, విద్య కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు.
ప్రకాశం: త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రంలో శనివారం క్షుద్ర పూజలు చేస్తున్నారని చిన్నమ్మపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పూజలు చేస్తున్న వారిని విచారించారు. తన ఇంటిలో మనవడికి ఆరోగ్యం బాగుండడం లేదని అలానే తన మరొక కొడుకుకు వివాహం కావాలని పూజలు చేస్తున్నట్లు పోలీసులకు చిన్నమ్మ తెలిపింది.
AKP: మునగపాక పీ.హెచ్.సీని డీఎం అండ్ హెచ్వో డాక్టర్ హైమావతి శుక్రవారం తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఎండలు ఎక్కువగా నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కృష్ణా: ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద మంచి రూ. 74,530 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
GNTR: గుంటూరు కాకుమాను వారి తోటలోని 6.26 ఎకరాల ‘చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం’ ఎట్టకేలకు జీఎంసీకి బదిలీ అయింది. ఏళ్ల తరబడి ఉన్న నిరీక్షణకు తెరపడింది. కార్మిక శాఖ ఈ స్థలాన్ని జీఎంసీకి అప్పగించింది. ఎంపీ పెమ్మసాని, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ మేయర్ రవీంద్ర నాని, స్థానికుల కృషితోనే ఇది సాధ్యమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ATP: జిల్లా పర్యటనకు విచ్చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డికి నగర కాంగ్రెస్ కమిటీ ఘనంగా స్వాగతం పలికింది. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, కేకేసీ రాష్ట్ర అధికార ప్రతినిధి యం.యం.డీ. ఇమామ్ ఆధ్వర్యంలో నాయకులు ఆమెకు సాదరంగా ఆహ్వానం పలికారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ మేరకు షర్మిల పలు సూచనలు చేశారు.
సత్యసాయి: పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీల్లో భాగంగా ఈయనను శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విజయకుమార్ పుట్టపర్తి డీఎస్పీగా 18 నెలల నుంచి విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు.
NDL: మహానంది ఆలయం వెనుక నల్లమల అడవుల్లో మరోసారి అగ్నిమాపక ఘటన చోటుచేసుకుంది. ఇటీవల పలుమార్లు మంటలు వ్యాపించగా అటవీ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. శుక్రవారం రాత్రి మళ్లీ మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. అడవుల్లోకి అక్రమ ప్రవేశాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
PLD: పిడుగురాళ్లలో జరుగుతున్న ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులను తహశీల్దార్ జెట్టి మధుబాబు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ CH. శైలజ సందర్శించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వారు రూపొందించిన స్టడీ మెటీరియల్ను తహశీల్దార్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ సారధి, రవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.