VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని మంగళవారం విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
కర్నూలు: జిల్లా ఉపాధి కార్యాలయం నిర్వహించిన మినీ జాబ్ మేళాలో 87 మంది నిరుద్యోగులు ఇవాళ పాల్గొన్నారు. వివిధ సంస్థల ఇంటర్వ్యూలలో 54 మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్లు జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
VZM: జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్ని వినియోగిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం వెల్లడించారు. ముఖ్యంగా ఈవ్ టీజింగ్, కోడిపందేలు, పేకాట, బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
కడప: జిల్లా MLA మాధవిరెడ్డికి రివర్స్లో షాక్ తగిలింది అని వైసీపీ ట్వీట్ చేసింది. దీనికి MLA స్పందిస్తూ.. ప్రజల కోసం చేస్తున్న పనులను వక్రీకరించి, తప్పుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కడపలో స్వచ్ఛత, పాఠశాలల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానన్నారు. విమర్శలు, దుష్ప్రచారాలు తమ సేవలను ఆపలేవని స్పష్టం చేశారు.
BPT: వేమూరు నియోజకవర్గంలో ఈ నెల 9న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. భట్టిప్రోలు-సురేపల్లి వద్ద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రైతుల సభ జరగనుంది. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంగళవారం పరిశీలించారు. వేదిక, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
E.G: రాజమండ్రి నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కాలువల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. మంగళవారం పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి విధిగా రిజిస్టర్ మెయింటెయిన్ చేస్తూ రోజువారీ కార్యకలాపాలను నమోదు చేయాలని సూచించారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలో 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానళ్లను మంత్రి సవిత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా విద్యుత్ ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
TPT: తిరుపతి సందేశ్ 2.0 కార్యక్రమంలో జూమ్ మీటింగ్ సందర్భంగా “YS Jagan Mohan” పేరుతో కనిపించిన లాగిన్ అధికారికం కాదని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ఐజీపీ ఆకే.రవికృష్ణ అధికారిక జూమ్ ఐడీ వేరుగా ఉందని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.
NDL: లోకక్షేమం కోసం శ్రీశైలం భ్రమరాంబ దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పసుపు, కుంకుమ సమర్పణను ‘శాంతి ప్రక్రియగా పిలుస్తారని ఈవో శ్రీనివాసరావు ఇవాళ తెలిపారు. తొలి విడతలో 20 వేల గుమ్మడికాయలు, 5 వేల కొబ్బరికాయలు, లక్షకు పైగా నిమ్మకాయలను సమర్పించినట్లు ఈవో వెల్లడించారు.
ELR: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఇన్ఛార్జ్ వైద్యాధికారి లక్ష్మీనారాయణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలని, పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంమైన వీరబ్రహ్మేంద్ర స్వామిని మంగళవారం జబర్దస్త్ కామెడీ షో యాక్టర్లు సద్దాం, నవ సందీప్, తదితరులు దర్శించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి వెంకటాద్రి స్వామిని దర్శించుకుని సన్మానించారు.
విశాఖ నగరంలోని అల్లిపురం ఏడుగుళ్ళు సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఈ సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు.
AKP: ప్రభుత్వం జీవో 91 సవరించి జీవో 60 విడుదల చేసి పే స్కేల్ తగ్గించడంపై పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం గొలుగొండ ఎంపీడీవో శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. జీవో 91 ప్రకారం ప్లే స్కేల్ రూ.28,280 అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ జీవోను సవరణ చేసి జీవో 60 వల్ల రూ. 25,220 తగ్గించిందన్నారు.
VZM: జేసీ ఎస్. సేధు మాధవన్ మంగళవారం స్వామి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఏజెన్సీ మూతపడటంతో గ్యాస్ సరఫరా నిలిచిపోయి వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా గ్యాస్ సిలిండర్లను నిరంతరం సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
ASR: చింతపల్లి పాత బస్టాండ్ వద్ద ప్రజా మరుగుదొడ్ల సమస్యకు పరిష్కారం లభించింది. నీటి సరఫరా లేక, నిర్వహణ లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని స్థానికులు ఎంపీడీవో సీతామహాలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె ప్రత్యేక చొరవతో మరమ్మతులు చేపట్టించారు. పాడైన మోటార్ స్థానంలో కొత్తదాన్ని అమర్చడంతో పాటు, విద్యుత్ సరఫరా కోసం ప్యానెల్ బోర్డు ఏర్పాటు చేశారు.