NLR: నెల్లూరులో టీటీడీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 48 లక్షలు వసూలు చేసిన కేటుగాడు షేక్ హుస్సేను వేదాయపాలెం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.25.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ దీక్ష వెల్లడించారు. నకిలీ నియామక పత్రాలతో నిరుద్యోగులను నమ్మించి ఈ మోసానికి పాల్పడినట్లు, దళారులను నమ్మి మోసపోవద్దని ఏఎస్పీ తెలిపారు.
SS: జిల్లాలోని హిందూపురం, కదిరి సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. హిందూపురం జడ్జి వెంకటేశ్వర్లు నాయక్, కదిరి జడ్జి జయలక్ష్మి జిల్లా న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు ఈ పదోన్నతులు కల్పించారు.
E.G: భీమోలు గ్రామంలోని పెద్ద చెరువును, గంగోలు చెరువును జలదార విజిటింగ్ బృందం పరిశీలించింది. జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వర్షం నీటి సంరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీటితో వ్యవసాయానికి నీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాల స్థాయిలు మెరుగుపడతాయని చెప్పారు. అదేవిధంగా డ్యాంలు,చెరువు గట్టు పటిష్టానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.
బాపట్ల: అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో అర్ధరాత్రి జరిగిన దాడిలో ఆర్ఎంపీ డాక్టర్ మేడగం కోటిరెడ్డి మృతి చెందారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
KDP: ఒంటిమిట్ట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐగా పనిచేస్తున్న పి.నరసింహరాజును కడప నగరం తాలుకా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ గతేడాది నవంబరు 12న బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా అయిదు నెలలకే స్థాన చలనం కల్పించారు. కడప నేర విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీహరి ఒంటిమిట్టకు రానున్నారు.
ATP: అమరావతి రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడులో పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా ఎమ్మెల్యే పరిటాల సునీత అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
KKD: ప్రభుత్వాల ఆదేశాల మేరకు సామర్లకోటలో పేద ప్రజలు, వలస కూలీలకు చోటా సిలిండర్లను అందిస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు శనివారం తెలిపారు. గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా కార్మికులు పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ప్రధాన గ్యాస్ కంపెనీలు ఐదు కేజీల సిలిండర్లు సరఫరా చేపట్టాయి. ఏదేని ఒక గుర్తింపు ఉంటే ఐదు కేజీల సిలిండర్ను అందిస్తామన్నారు.
W.G: రాష్ట్రంలో త్వరలో నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. పాలకొల్లులోని అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతిలో భాగమైన రంగస్థల కళలను ప్రోత్సహించేందుకు నాటకోత్సవాలను నిర్వహిస్తామన్నారు.
ఎన్టీఆర్: విజయవాడలో ఆదివారం మాంసం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. చికెన్ స్కిన్లెస్ కేజీ రూ.220 పలుకుతుండగా, మటన్ కేజీ రూ.900కు చేరింది. చేపలు రకాన్ని బట్టి కిలో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. 30 కోడి గుడ్ల ధర రూ.135గా ఉంది. సెలవు రోజు కావడంతో మార్కెట్ల వద్ద రద్దీ కనిపిస్తున్నప్పటికీ, పెరిగిన ధరలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
VZM: రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్లుగా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్ జడ్జిలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు చీపురుపల్లికి చెందిన బంకపల్లి నిర్మలకు విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా పదోన్నతి లభించింది. దీనిపై గ్రామస్థులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జడ్జిగా పని చేస్తున్నారు.
SS: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తన శాఖల ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై సీఎంతో చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన ‘జలధార’, ‘స్వచ్ఛాంధ్ర’ వంటి కార్యక్రమాల్లో మంత్రులంతా భాగస్వామ్యం కావాలని సీఎం సూచించారు.
KKD: మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల సూచన మేరకు యనమలకు స్టంట్ వేయించగా, ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఫోన్ ద్వారా యనమల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ATP: అనంతపురం నగరంలో మైనర్ డ్రైవింగ్ అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మైనర్ల తల్లిదండ్రులకు పరేడ్ మైదానంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గత పది రోజుల్లో 215 మంది మైనర్లను గుర్తించి ఈ అవగాహన కల్పించారు. చిన్న వయసులో వాహనాలు ఇవ్వడం వల్ల ప్రాణాపాయం ఉంటుందని డీఎస్పీ హెచ్చరించారు.
PPM: ఈ నెల 17న ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి శనివారం తెలిపారు. ఈ మేరకు కలక్టరేట్లో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని సూచించారు. ప్రతి నెల మూడవ శుక్రవారం ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
KDP: రాజుపాలెం(M) పర్లపాడులో మహేశ్ హత్యకు గురైన నేపథ్యంలో గ్రామంలో ప్రతీకార దాడులు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం SI ప్రణయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి, ప్రజలు మతసామరస్యాన్ని, శాంతిభద్రతలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఉద్రిక్తతలు సృష్టించినా, తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.