ASR: గూడెంకొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని చీడిగుంట గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న ఏకైక చేతి పంపు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కిలోమీటరు దూరంలో ఉన్న ఊట నుంచి నీరు తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నామని పేర్కొన్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
మన్యం జిల్లా పరిపాలనలో సమర్థవంతమైన సేవలు అందించి ఇటీవల ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బదిలీ అయిన జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ మందిరంలో ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు, రెవెన్యూశాఖ సిబ్బంది పెద్దఎత్తున హాజరై ఆయన సేవలను కొనియాడారు.
VSP: షీలా నగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు కేవీ వెంకటరమణను రాష్ట్ర హోంమంత్రి అనిత పరామర్శించారు. లంకెలపాలెం వద్ద విధి నిర్వహణలో ఉన్న సమయంలో జరిగిన దాడిలో వెంకటరమణ గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
AKP: నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు అనిమిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం బావి శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. బోర్లు ఎండిపోవడంతో నీటి కొరత ఏర్పడటంతో బావిలో పేరుకుపోయిన చెత్త, మురికి, పిచ్చిమొక్కలను తొలగించి వినియోగానికి సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
CTR: పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం 15 కిలోల టమోటా బాక్స్ ధర రూ.400 పలికింది. దిగుబడి పెరగడంతో టమోటా కాయలు మార్కెట్కు ఎక్కువ శాతం వస్తున్నాయి. ఇవాళ 835.50 మెట్రిక్ టన్నులు టమాటాలు వచ్చాయి. మొదటి రకం బాక్స్ రూ. 400, రెండవ రకం బాక్స్ రూ. 300 పలకగా.. మూడో రకం బాక్స్ రూ. 180 వరకు పలికాయి.
CTR: మదనపల్లి కలెక్టరేట్ వద్ద రేపు చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని YCP యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ మోసం చేస్తున్న తీరుపై ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. DSC అక్రమాలపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
VZM: గజపతినగరం మండలంలోని డోలపాలెం గ్రామంలో దుర్గాదేవి ఆలయ నిర్మాణానికి టీటీడీ రూ. 20 లక్షల మంజూరు చేసినట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్ శీర అప్పలనాయుడు ఆదివారం తెలిపారు. గుడి నిర్మాణానికి నిధులు కావాలని ఇటీవల రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు తనతో పాటు బీబీ ఛానల్ వైస్ ఛైర్మన్ బొత్స సూర్యనారాయణ, స్థలదాత అప్పలనాయుడు కూటమి నేతలు కోరామన్నారు.
NLR: వెంకటాచలం మండలంలోని తాటిపర్తిపాళెం గ్రామంలో ఆదివారం గ్రామదేవుడు తాటిపర్తయ్య స్వామివారి తిరునాళ్ల సందర్భంగా, గ్రామస్తులు పొలిమేరలోని పొలాల్లో కనకదుర్గమ్మ అమ్మవారికి పొంగళ్ళు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు పంటల సమృద్ధిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు,మహిళలు యువకులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
SS: కర్ణాటక మాజీ మంత్రి, పావగడ మాజీ శాసనసభ్యుడు వెంకట రమణప్ప పార్థివదేహానికి మంత్రి సవిత ఘన నివాళులు అర్పించారు. పావగడ తాలూకా హనుమంతనహళ్లి గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం వెంకట రమణప్ప కుటుంబ సభ్యులను, ప్రస్తుత శాసనసభ్యుడు వెంకటేష్ను పరామర్శించి తన గాఢ సానుభూతిని తెలియజేశారు.
కోనసీమ: మండపేటకు చెందిన ప్రఖ్యాత సభా వ్యాఖ్యాత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ జీఎస్ భగవాన్ మాస్టర్ కొన్ని నెలల కిందట అస్వస్థతకు గురయ్యారు. రాజమహేంద్రవరంలోని ఆనం వెంకట అప్పారావు రోడ్లోని విద్యుత్ నగర్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు సన్నిహితులైన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామ కృష్ణ రెడ్డి ఆయన్ని పరామర్శించారు.
KKD: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1, సోమవారం తుని మండలం చామవారంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ATP: మెగా డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మహానాడు రికార్డు స్థాయిలో విజయవంతమైందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయకుండా, ఇప్పుడు పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.
NTR: నందిగామ నియోజకవర్గంలో ఆదివారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నందిగామలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, చందర్లపాడు, వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్ర ఎండలు, వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఉక్కపోతతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని స్థానికులు అన్నారు.
W.G: భీమవరం కొమరాడ రోడ్డులోని జగదీశ్ మెరీన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఘమంగా (27) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. టూటౌన్ సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ఆదివారం తెల్లవారుజామున ఫ్యాక్టరీ ఎదురుగా, హాస్టల్ సమీపంలోని ఒక చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
కృష్ణా: ఆధ్యాత్మిక కేంద్రాల్లో సోలార్ ఏర్పాటు ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని మియాఖాన్ పెద్ద మసీదు భవనంపై అంతస్తులో రూ.6 లక్షలతో ఏర్పాటు చేసిన 15 కే.వీ సోలార్ యూనిట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా సోలార్ ఎనర్జీని వినియోగించుకోవడం సంతోషకరమన్నారు.