కృష్ణా: నాలుగేళ్ల క్రితం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో 559 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నివేశనా స్థలాలను కేటాయించింది. నాగాయలంక, భావదేవరపల్లి గ్రామాలకు చెందిన వారికి సెంటున్నర భూమి ఇచ్చి రాళ్లు వేశారు. ఈ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తే ఒక ఊరుగా మారుతుందని ప్రజలు ఆశించారు. కానీ నేటికీ నిర్మాణాలు జరగకపోవడంతో పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి.
GNTR: గుంటూరు నల్లచెరువులో వీధి కుక్కల దాడికి గురైన బాలుడిని తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ శుక్రవారం అర్ధరాత్రి హుటాహుటిన GGHకు వెళ్లి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించి, మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ASR: హుకుంపేట మండలం సూకూరులో శుక్రవారం SI దుర్గా ప్రసాద్ పర్యటించారు. గ్రామస్థులతో సమావేశమయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలు అధికారులకు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు దూరంగా ఉండాలన్నారు.
PLD: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పల్నాటి తిరుమలలో ‘నేతి వెంకన్న’ ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్వామివారు పైకప్పు లేకుండా ప్రకృతి ఒడిలో భక్తులకు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలోని నాలుగు శనివారాలతో పాటు ఉగాది వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కృష్ణా: గూడూరు మండలం చిట్టి గూడూరులో పేకాట స్థావరంపై ఎస్సై దివ్య ప్రకాశ్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 16,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
W.G: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సుంకర కాశీవిశ్వేశ్వరరావు నియామకమయ్యారు. శుక్రవారం ఆయనకు నియామకపత్రంను జిల్లా నాయకులు అందించారు. బీజేపీ సిద్ధాంతాలు, ఆశయాలను గౌరవిస్తూ తాను చేసిన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడు వెంకట సూర్యనారాయణ రాజు నియామక పత్రాన్ని అందజేశారని కాశీ తెలిపారు.
CTR: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కె. శేఖర్ (43) అనే వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య వివరాల మేరకు.. గిరింపేట అంబేడ్కర్ నగర్కు చెందిన శేఖర్ శివరాత్రి రోజున మద్యం తాగడంతో అతని భార్యతో వాగ్వాదం జరిగింది. దీంతో శరీరంపై శేఖర్ ఆయిల్ పోసుకుని నిప్పంటిచుకున్నాడు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.
BPT: బాపట్ల తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ వినోద్ కుమార్ బృందం శుక్రవారం గోవాలో పర్యటించింది. అక్కడి తీర ప్రాంత నియంత్రణ మండలి (GCZMA) అధికారులతో వ్యర్థాల నిర్వహణపై చర్చించారు. కాండోలిమ్ బీచ్, ఫోర్ట్ అగ్వాడా జైలు మ్యూజియంలను సందర్శించి పర్యాటక సౌకర్యాలను పరిశీలించారు. బాపట్ల తీర ప్రాంతాభివృద్ధే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.
NLR: కావలి మండలం బిట్రగుంట – అల్లూరు రోడ్ RSల మధ్య km no 206/c16 – c17 పోస్టుల మధ్య మూడవ లైన్ మధ్యలో గూడ్స్ రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సదరు వ్యక్తి (50-55) బూడిద రంగు అర చేతుల చొక్క, నల్లని ప్యాంటు ధరించి ఉన్నాడని మృతుని వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
KDP: వల్లూరు సొసైటీ బ్యాంకు వద్ద నేడు ఉదయం 9 గంటలకు యూరియా పంపిణీ చేయనున్నట్లు సొసైటీ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, జిల్లా జేడి చంద్ర నాయక్ ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలిపారు. వరి రైతులకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హులైన రైతులు తప్పనిసరిగా ఆధార్,పాస్ బుక్కు తీసుకురావాలని సూచించారు.
KRNL: యూనిక్ ఐడీ పొందేందుకు రైతులు ఈ నెలాఖరులోగా రైతు రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేసుకోవాలని కోసిగి మండలం ఏవో వరప్రసాద్ ఇవాళ సూచించారు. మండలంలో 11,238 మంది పీఎం కిసాన్ లబ్దిదారులు ఉండగా వారిలో 9,308 మంది లబ్ధిదారులు మాత్రమే నమోదు చేసుకున్నారన్నట్లు తెలిపారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ విజయవాడలో హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్లాత్ వేస్టేజ్ బ్యాగ్స్ తయారీ యూనిట్ను నిన్న సాయంత్రం సందర్శించారు. వ్యర్థ వస్త్రాలతో పర్యావరణ హితమైన బ్యాగుల తయారీ విధానాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమదాలవలసలో ఇలాంటి యూనిట్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
NTR: విజయవాడ భవానీపురంలో మిస్సైన ఇద్దరు చిన్నారుల కేసు సుఖాంతమైంది. ట్యూషన్కు వెళ్లకుండా ఇంట్లోని నగదు తీసుకుని పారిపోయిన మేరారామ్, ఉమారామ్, ఆచూకీ లభ్యమైంది. విజయవాడ నుంచి ముంబైకి వెళ్లిన చిన్నారులు, అక్కడి నుంచి గుజరాత్కు వెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు క్షేమంగా దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
NDL: డోన్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఇవాళ సీపీఐ నాయకుడు రంగం నాయుడు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటూ సమాజంలో కుల వివక్ష లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని సిపిఐ నాయకుడు పేర్కొన్నారు.