ఏపీ టెన్త్ ఫలితాలు ఏప్రిల్ 25న విడుదల కానున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ తేదీనే ఫలితాలు వెల్లడికానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP SSC Results 2024 : పదో తరగతి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి పెద్ద అప్డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. మార్చి18 నుంచి మార్చి 30 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల ఎప్పుడనేది తెలిసింది. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 25(ఏప్రిల్)నే ప్రకటించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పరీక్ష ఫలితాల విడుదలకు కూడా ఈసీ(EC) అనుమతి తప్పనిసరి. అధికారులైతే ఏప్రిల్ 25 ఫలితాల విడుదల టార్గెట్గా పెట్టుకున్నారు. అంతా ఓకే అయితే 25 ఫలితాలు విడుదల చేస్తారు. ఒకవేళ ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావడం ఆలస్యమైతే నెలాఖరుకు గ్యారెంటీగా విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్రంలో మార్చి18 నుంచి మార్చి 30 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 6,30,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3473 పరీక్షా కేంద్రాల్లో విద్యార్ధిని, విద్యార్ధులు పరీక్షలు రాశారు. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 8తేదీతోనే ముగించారు. జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియను కూడా ఇప్పుటికే దాదాపు పూర్తి చేశారు. ఇప్పుడు పేపర్ వర్క్ పూర్తి చేస్తున్నారు. ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.