HNK: శాయంపేట రైతు వేదికలో పలు గ్రామాల వార్డు మెంబర్లకు 24వ తేదీ నుండి నేటి వరకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు మెంబర్ల పాత్ర, ఇతర అంశాలపై ఐదు రోజులపాటు వార్డ్ మెంబర్లకు అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు మెంబర్లకు నేడు మండల అధికారులు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
ELR: రైలు ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన సీతంపేట రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. దెందులూరు-భీమడోలు మధ్య పట్టాలు దాటుతున్న వృద్ధురాలిని రైలు ఢీకొట్టినట్లు రైల్వే పోలీసులు దృవీకరించారు. మృతురాలు 70 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటుందని తెలిపారు. వివరాలు తెలిసినవారు రైల్వే హెచ్సీ ప్రసాద్ను సంప్రదించాలని కోరారు.
ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మార్చి 31వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయని SP నితిక పంత్ శనివారం ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం అన్నారు. చట్టపరమైన జారీచేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని సూచించారు.
ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ సూచించారు. శనివారం పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మాట్లాడారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన కాంశ్య విగ్రహ పనులను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పరిశీలించారు. విగ్రహ స్థాపన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
NZB: ధర్పల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం ‘అంగన్వాడీ పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 3-6 ఏళ్ల చిన్నారులకు ప్రీ-స్కూల్ శిక్షణ, పోషకాహారం, ఆరోగ్యలక్ష్మి పరీక్షలపై అవగాహన కల్పించారు. గ్రాడ్యుయేషన్ డే, ర్యాలీల ద్వారా పిల్లలను పాఠశాలలకు సిద్ధం చేసే అంశంపై తల్లిదండ్రులకు వివరించారు.
TG: ఏపీలోని వేట్లపాలెంలోని బాణాసంచా కేంద్రంలో పేలుడు సంభవించి 18 మంది మరణించారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనలో క్షతగాత్రులైన వారికి వెంటనే మెరుగైన చికిత్సను అందించాలని ప్రభుత్వానికి సూచించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు. అగ్నిప్రమాద ఘటనకు కారణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
MNCL: తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్లో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను శనివారం ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.
KNR-2 డిపో గోవా టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు డి ఎ. శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో ఉడిపి, ముఖంబికా అమ్మవారి దర్శనం, మృడేశ్వర్, గోకర్ణ టెంపుల్స్ దర్శనం, గోవా బీచ్లో ముఖ్య ప్రదేశాలు ఉన్నాయన్నారు. మార్చి 6న సా.4 గం.కు కరీంనగర్ నుంచి బయలుదేరి తిరిగి మార్చి 10న కరీంనగర్ చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.4,150 నిర్ణయించామన్నారు.
MHBD: మరిపెడ పట్టణ కేంద్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మరిపెడ నుంచి MHBD జిల్లాకు వెళ్తున్న ఓ ట్రాలీ అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన వాహనాదారులు గాయపడిన డ్రైవర్ను ఆంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
BTS స్టార్ జంగ్కుక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన కొత్త ఆల్బమ్ ‘అరిరంగ్’ విడుదల కానున్న నేపథ్యంలో.. మేనేజ్మెంట్ నిబంధనలకు అతీతంగా స్వేచ్ఛగా జీవిస్తానని, ప్రాణహాని ఉన్నా లెక్కచేయనని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. ఆయన భద్రతపై భయపడుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియా వేదికగా జంగ్కుక్కు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.
JN: దేవరుప్పులలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి గౌడ్, RI రాజు హాజరై మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి పౌరుడు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో ప్రతి వ్యక్తి ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ఇద్దరు ఇన్స్పెక్టర్ల పై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సివిల్ తగాదాల్లో తలదూర్చి భారీగా డబ్బులు తీసుకున్నట్టు ఫిర్యాదులు అందడంతో వారిపై విచారణ జరిగినట్లు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ ఇద్దరి అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.
BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రాసేనా రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన వీవీఐపీ అతిథి గృహం నుంచి ప్రధానాలయంలోకి వెళ్లారు. ఆలయ ముఖ మండపం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు.
TG: కామారెడ్డి జిల్లా గాంధారి ఎక్స్రోడ్డు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. BJP ఎమ్మెల్యేల బృందాన్ని బాన్సువాడ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తోంది. కామారెడ్డి అంశాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం. బాన్సువాడకు మళ్లీ వచ్చి తీరుతాం’ అని అన్నారు.