TG: ట్రాఫిక్ చలాన్లు చెల్లించడం లేదా? ఇకపై అలాచేస్తే మీ DL, RC ఫ్రీజ్ కావచ్చు. ట్రాఫిక్ జరిమానాలపై వాహనదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం జరిమానాలపై అభ్యంతరాలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని నియమించనుంది. ప్రాథమిక నోటిఫికేషన్ ఒకట్రెండు రోజుల్లో రానున్నట్లు సమాచారం.
ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అనంత నాగ్ సంగీత్ స్వర్గ్ కల్చరల్ అసోసియేషన్, సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీప ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. మైఖేల్ బాబు నిర్వహించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి.
MDCL: ఉప్పల్లో కబ్జాలను తాకకుండా చెరువు అభివృద్ధి చేయడం వల్ల అసలు విస్తీర్ణం తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నల్లచెరువు మొత్తం సుమారు 120 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం కేవలం 55 ఎకరాల పరిధిలోనే రూ. 20 కోట్లతో సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. కబ్జాలను తొలగించి పూర్తి విస్తీర్ణాన్ని పరిరక్షిస్తేనే చెరువు అసలు రూపు ఉంటుందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.
ఐరీష్ సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ T20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. T20 WCలో ఐర్లాండ్ పేవల ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే వన్డే టీమ్ సారథిగా కొనసాగుతానని చెప్పాడు. దీంతో T20 టీమ్ పగ్గాలను త్వరలోనే మరొకరికి అప్పగిస్తామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డ్ తెలిపింది. స్టిర్లింగ్ నేతృత్వంలో 48 T20లు ఆడిన ఐర్లాండ్.. 20 గెలిచింది.
NLR: నెల్లూరులోని పేదలకు నారాయణ నేత్ర జ్యోతి ద్వారా ఉచితంగా కార్పొరేట్ కంటి వైద్యం అందిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. గత 12 రోజుల్లో 12 చోట్ల శిబిరాలు నిర్వహించి 1,316 మందికి పరీక్షలు చేశామన్నారు. గురువారం తొలి విడతలో 230 మందికి మంత్రి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. రాబోయే రెండేళ్లలో 48 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
WNP: ఆత్మకూరులో గురువారం చెరువులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డే రాములు ఉగాది పండుగ సందర్భంగా పరమేశ్వర స్వామి దేవాలయ సమీపం నుంచి చెరువు చివర రోడ్డు వరకు ఈత కొట్టుకుంటూ వచ్చే క్రమంలో ఆయాసంతో బాధపడుతున్న అతనిని గమనించిన వారు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో ఈనెల 16 నుంచి ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉత్సవాలు ముగియనున్నాయి. స్వామివారి యాగశాలలో ఉగాది మహోత్సవాల పూర్ణాహుతి, సాయంత్రం నిజాలంకరణలో శ్రీ భ్రమరాంబికాదేవి దర్శనం కల్పించనున్నారు. అలాగే, ఆది దంపతులు అశ్వవాహనంపై ఆసీనులై పూజలందుకోనున్నారు. నిన్న 77,859 మంది కన్నడ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
AP: పిల్లల ఆరోగ్యం దృష్ట్యా పోలవరం జిల్లా గూడురు గ్రామస్థులు ఐస్క్రీం బండ్లు/ఆటోలు గ్రామంలోకి రాకుండా నిషేధించారు. వస్తే రూ.5 వేల ఫైన్ తప్పదని స్పష్టంచేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఐస్క్రీం తిన్న పిల్లలకు దంత, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తున్నాయని.. వాటిల్లో ఏ రసాయనాలు కలుపుతున్నారో తెలియదని, వారి ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్థులు తెలిపారు.
ELR: నూజివీడు పట్టణంలోని అనేక వార్డులలో మున్సిపల్ కమిషనర్ కె.పీరయ్య శుక్రవారం ఉదయం పరిశుభ్రతపై పరిశీలన చేశారు. రోడ్లపై విచక్షణారహితంగా చెత్తను కుప్పలుగా వేయడాన్ని గమనించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. చెత్తను సేకరించేందుకు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది వస్తున్నారని, వారికి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇవ్వాలని సూచించారు.
TPT: టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలో భక్తుల సౌకర్యాల మెరుగుదలకు శ్రీవారి సేవకులు సూచనలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. శ్రీవారి సేవా సదన్-2ను సందర్శించి, సేవకులతో సమావేశమై అన్నప్రసాదం, పరిశుభ్రత, క్యూలైన్ నిర్వహణపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సేవకుల ఫీడ్బ్యాక్ భక్తుల సేవలను మెరుగుపరచడంలో కీలకమని ఆయన తెలిపారు.
SKLM: కొత్తూరులో టీచర్స్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ నుంచి జరగనుంది. స్థానిక ఉన్నత పాఠశాల మైదానం, ఓండ్రుజోల సమీపంలోని మైదానాల్లో ఈ టోర్నమెంట్ జరుగుతోందని ఎంఈవోలు గోవిందరావు, శ్రీనివాస రావు తెలిపారు. 12 మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని, మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీ అందిస్తామని తెలిపారు.
HYD: అనేక చోట్ల యుద్ధాలు జరుగుతుంటే, భారత్ శాంతి మార్గంలో ముందుకు సాగుతోందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ప్రపంచం ఉద్రిక్తతలతో ఉండగా “ఇది యుద్ధాల యుగం కాదు” అనే సందేశంతో PM మోదీ శాంతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. బలమైన రక్షణ, అభివృద్ధి చర్యలతో దేశం భద్రంగా ఉంది. వికసిత భారత్ లక్ష్యంగా ప్రజలకు సురక్షిత, సమృద్ధి భవిష్యత్ అందిస్తున్నారన్నారు.
SKLM: కవిటి మండలం బి.గొనపపుట్టుగ గ్రామానికి చెందిన పిరియా చలపతిరావు కళా రంగంలో విశేష సేవలందించినందుకు కళా రత్న అవార్డుకు ఎంపికయ్యారు. గురువారం ఉగాది వేడుకల్లో భాగంగా విజయవాడలోని తుమ్మల పల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు ‘కళా రత్న’ అవార్డును ఆయనకు అందించి, సత్కరించారు.
KDP: మైలవరం మండలం వద్దిరాలలో సుంకులాంబ పరంజ్యోతి తిరుణాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 5 వరకు చెన్నయ్య ఆధ్వర్యంలో చెక్కభజన నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు సిరిమానోత్సవం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 8 వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు, 9 నుంచి నెల్లూరు వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
KRNL: ఆత్మకూరు పట్టణానికి చెందిన ముర్తుజావలి (35) సిద్ధాపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, చెరువులో మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి నలుగురు కుమార్తెలు ఉన్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.