E.G: కడియంలో ఉన్న శ్రీ విజయ బాలా త్రిపుర సుందరి దేవి పీఠంలో శ్రీ విజయ కనకమహాలక్ష్మి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఈనెల 22వ తేదీ నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం పీఠాధిపతులు శ్రీ పెమ్మిరెడ్డి వీర్రాజు ఆధ్వర్యంలో పందిరి రాట ముహూర్తం వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని వెల్లడించారు.
TPT: శక్తి స్వరూపిణి వెంకటగిరి పోలేరమ్మ జాతర మొదలైంది. ఇవాళ పీఠ పూజ చేసి అమ్మవారి ప్రతిమను తయారు చేసేందుకు మట్టిని సేకరిస్తారు. మట్టితో బొమ్మను తయారు చేస్తారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారి ప్రతిమ తయారీ జరుగుతుంది. అనంతరం జినిగలవారి వీధిలోని చాకలివారి మండపానికి అమ్మవారిని తీసుకొచ్చి దిష్టి చుక్క పెడతారు. అక్కడి నుంచి ఆలయానికి తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు.
కోనసీమ: కొత్తపేట మండల పరిధిలోని మందపల్లి గ్రామంలో వెంచేసియున్న ఉమా మందేశ్వర శనేశ్వర స్వామివారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. 8 నెలల 11రోజులకు గాను హుండీ ద్వారా రూ. 8,80,131, ఆలయ క్షేత్ర పాలకుడు వేణుగోపాల స్వామి వారి హుండీ ద్వారా రూ .40,517ఆదాయం వచ్చినట్టు ఈవో దారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
AP: టీటీడీ ఈవోగా ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనతో టీటీడీ ఛైర్మన్ BR నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. రంగనాయకుల మండపంలో ఈవో అనిల్ కుమార్కు వేద పండితులు స్వామివారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. అలాగే, బదిలీపై వెళ్లిన మాజీ ఈవో శ్యామలరావుకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
SRPT: దురాజ్పల్లి గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే పెద్దగట్టు (గొల్లగట్టు) జాతర, రాష్ట్రంలో రెండో పెద్ద జాతరగా పేరుగాంచింది. రాష్ట్రం నుంచే కాక ఛత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. యాదవుల కుల దైవమైన శ్రీ లింగమంతుల స్వామికి భక్తులు కాళ్లకు గజ్జెలు కట్టి, చేతిలో అవసరాలు పట్టుకుని “ఓ లింగా” అంటూ నృత్యం చేస్తూ మొక్కులు చెల్లిస్తారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్ష రుతువు, భాద్రపద మాసం, బహుళపక్షం తదియ: సా. 6-25 తదుపరి చవితి రేవతి: రా. 7-43 తదుపరి అశ్విని వర్జ్యం: ఉ. 8-23 నుంచి 9-54 వరకు అమృత ఘడియలు: సా. 5-27 నుంచి 6-58 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-33 నుంచి 12-22 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.5.50; సూర్యాస్తమయం: సా.6.05 సంకటహర చతుర్థి
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి స్వామివారి ఉత్సవ మూర్తిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి ఆలయంలో ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఇవాళ సాయంత్రం మహానంది ఆలయ పట్టు వస్త్రాలు సమర్పించారు. మహానంది దేవస్థానం ఈవో శ్రీనివాసరెడ్డి, దేవస్థానం అతిథి గృహం నుంచి మేళ తాళాలతో పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రతి ఏడాది భాద్రపద మాసంలో బహుళ తదియ రోజున ఆడవాళ్లందరూ ఉండ్రాళ్ల తద్ది నోము నోచుకుంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేస్తారు. సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి బియ్యం పిండితో ఉండ్రాళ్లు చేసి గౌరీదేవికి నివేదించి పూజిస్తారు. ఈ నోము నోచిన పెళ్లికాని కన్యలు విశేష ఫలితాలను పొందుతారని వేదపండితులు చెప్తున్నారు.
HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ప్రాంగణములో గల శ్రీ గణేశ ఆలయంలో రేపు సా.6 గం.లకు గణపతి హోమం, గణపతికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. సంకటహర చతుర్థి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పార్థసారధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమములో పాల్గొని భక్తులు గణపతి ఆశీస్సులు పొందాలని సూచించారు.
GNTR: బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం భక్త అంబరీష హరికథా గానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆదిభట్ల కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సప్పా భారతి హరికథను ప్రారంభిస్తూ.. శ్రీమన్నారాయణుడి పట్ల అతని అచంచలమైన భక్తి, ఏకాదశీ వ్రత మహత్యం గురించి వివరించారు. ఈ హరికథకు జగన్మోహిని మృదంగం, చావలి శ్రీనివాస్ వయోలిన్ సహకారం అందించారు.
గ్రహణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి. సుప్రభాతసేవతో తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. ఉదయం 9:30 నుంచి ద్వారక తిరుమల ఆలయంలో దర్శనాలు ప్రారంభంకానున్నాయి. 8:30 నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి అనుమతించనున్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి, రామప్ప, కాళేశ్వరం ఆలయాలలో సంప్రోక్షణ తర్వాత ఉ.7గం.ల నుంచి దర్శనాలకు అనుమతించనున్నారు.
సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలోని శ్రీచౌడేశ్వరి దేవి ఆలయంలో మాల పౌర్ణమి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ధర్మకర్త డీ.సీ. ఈశ్వరయ్య ఆధ్వర్యంలో, జ్యోతి సంఘం సభ్యుల సమక్షంలో పూజారులు అమ్మవారిని అలంకరించి విశిష్ట పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.