TPT: సూళ్లూరుపేట డిపో నుంచి తూర్పు కనుపూరులో జరిగే ముత్యాలమ్మ జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 10 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేసి బస్సులను ప్రారంభించారు. మార్చి 13 వరకు నాలుగు రోజులపాటు ఈ బస్సులు నడుస్తాయని డిపో మేనేజర్ తెలిపారు. మహిళలకు స్త్రీ శక్తి పథకం కూడా వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
SKLM: ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జె.ఆర్.పురం సీఐ ఎం. అవతారం తెలిపారు. గంజాయి నిల్వ, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
KKD: పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మాతృత్వం 100వ వారం సందర్భంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పం భక్తులను, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ‘మన పెద్దాపురం’ ఫేస్బుక్ అడ్మిన్ పెద్దిరెడ్డి నరేశ్ ఆధ్వర్యంలో రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్ దీనిని రూపొందించారు. గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పౌష్టికాహారం అందించాలన్నారు. చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు.
ELR: రేచర్ల గ్రామంలో మంగళవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గ్రామానికి చెందిన దారావతు వెంకటేశ్వరరావు వద్ద నుంచి రెండు లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. ఎవరైనా నాటుసారాయి తయారు చేసినా లేదా విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
BPT: ఇంకొల్లు పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడికి ఒంగోలు కోర్టు పోక్సో కేసు కింద 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధించింది. కేసులో సాక్ష్యాలు సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అభినందించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
W.G: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో యువకుడికి భీమవరం కోర్టు పోక్సో కేసు కింద 10 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు పెనుగొండ ఎస్సై గంగాధరరావు తెలిపారు. 2021లో నడిపూడికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన చిల్లే చరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేసినట్లు కేసు నమోదైంది. శిక్షతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందన్నారు.
KRNL: హోలగుంద మండలం కోగిలతోటలో మంగళవారం నిర్వహించిన దేవర కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పాల్గొన్నారు. గ్రామస్థుల ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరై స్థానికుల ఆతిథ్యాన్ని స్వీకరించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
NLR: నెల్లూరు APSADA కో-వైస్ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు నగరంలోని మత్స్య శాఖ కార్యాలయంలో గల్ఫ్ దేశాల్లో ఏర్పడిన యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆక్వా ఎగుమతుల పరిస్థితి, రొయ్యల ధరల హెచ్చుతగ్గుల అంశాలపై మీడియాకు వెల్లడించనున్నారు.
ప్రకాశం: పొన్నలూరు మండలం ఉప్పలదిన్నెలలో మంగళవారం జాతీయ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రైతులు కృత్రిమ ఎరువులు మానేసి సేంద్రియ ఎరువుల్ని వాడాలని సూచించారు. రసాయన మందులు వాడడం మాని కాషాయాలతో ప్రకృతి వ్యవసాయం చేయవచ్చన్నారు.
కోనసీమ: అమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని కేసును కేవలం ఐదు గంటల్లోనే ఛేదించారు. కళాశాలకు వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, డీఎస్పీ ప్రసాద్ ఆదేశాలతో సీఐ వీరబాబు బృందం సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. సాయంత్రం 6 గంటలకల్లా ఆమె ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు.
KDP: చెన్నూరు మండలం కొండపేట రామాలయంలో మంగళవారం ఇస్కాన్ ఆధ్వర్యంలో పావన గౌర హరి ఆవిర్భావ దినోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నగర సంకీర్తన, అభిషేకాలు, భాగవత ప్రవచనాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాలకు తరలివచ్చిన సుమారు 7,000 మంది భక్తులకు నిర్వాహకులు భారీ అన్నసంతర్పణ చేపట్టారు.
VSP: ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న బొత్సను ఆయన స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మండలిలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స అస్వస్థతకు గురవ్వడం పట్ల వాసుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఇవాళ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని జొన్నవాడ గ్రామంలో పీహెచ్సీ నందు ఉచిత సర్వికల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ను ప్రారంభిస్తారని కార్యాలయ ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు పాల్గొనాలని వారు కోరారు.
అన్నమయ్య: జిల్లాలో చారిత్రాత్మక దేవాలయమైన నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి హుండీ ఆదాయం ద్వారా రూ.1,98,200 సమకూరినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. 20 రోజులకు సంబంధించిన భక్తుల కానుకలను మంగళవారం లెక్కించినట్లు చెప్పారు. వచ్చిన మొత్తాన్ని అలయ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, విజిలెన్స్ అధికారి మల్లికార్జున పాల్గొన్నారు.