»Nara Lokesh Fire On Ys Jagan In Yuvagalam Padayatra
Nara Lokesh జగన్ వచ్చాక ఏపీకి రూ.10 లక్షల కోట్లు నష్టం
కొత్తగా జే ట్యాక్స్ (J Tax) అనే వాటికి భయపడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని వ్యాపారులు తెలిపారు. కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగ యువత హైదరాబాద్ (Hyderabad), బెంగళూరుకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వేధింపులు.. ప్రత్యేక వసూళ్లు.. కొత్తగా జే ట్యాక్స్ (J Tax) అనే వాటికి భయపడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని వ్యాపారులు తెలిపారు. ఒక్క అమరరాజా (Amaraja Company) కంపెనీ వెళ్లిపోవడంతో దాదాపు 20 వేల మంది రాయలసీమ (Rayalaseema) యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని వాపోయారు. ఇక కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగ యువత హైదరాబాద్ (Hyderabad), బెంగళూరుకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదన అంతా యువగళం (Yuvagalam) పాదయాత్రలో ఉన్న టీడీపీ (TDP) యువ నాయకుడు నారా లోకేశ్ (Nara Lokesh)తో పంచుకున్నారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారానికి 15వ రోజుకు చేరుకుంది. పాదయాత్రకు బయలుదేరేముందు చిత్తూరు జిల్లా రేణుకాపురం క్యాంపు సైట్ లో గంగాధర నెల్లూరు వ్యాపారులతో నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను లోకేశ్ కు వివరించారు.
అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకనే వ్యాపారులు బెంగళూరు వెళ్లిపోతున్నారని తెలిపారు. జగన్ పాలనలో జె-ట్యాక్స్ బెదిరింపుల దెబ్బకు భయపడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారని చెప్పారు. ఒక్క అమరరాజా కంపెనీ తెలంగాణ (Telangana)కు వెళ్లడంతో రాయలసీమ ప్రాంత యువతకు దక్కాల్సిన దాదాపు 20 వేల ఉద్యోగ అవకాశాలు కోల్పోయామని లోకేశ్ పేర్కొన్నారు. అనంతపురంలో జాకీ పరిశ్రమను కూడా అక్కడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కమీషన్ల కోసం ఒత్తిడి చేసి తరిమేశారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సుమారు రూ.10 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని వెల్లడించారు.
ఇక జగన్ పాలనపై లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘తన స్వార్థం కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలు, యువత భవిష్యత్తును బలిపెట్టాడు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే రీ బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులకు ఎటువంటి వేధింపులు లేకుండా అన్ని అనుమతులు లభించేలా సింగిల్ విండో విధానం తీసుకువస్తాం. గతంలో తాము రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్ హబ్ గా తయారు చేశాం. విశాఖకు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించాం. అన్ని జిల్లాల్లో మైక్రో క్లస్టర్స్ ఏర్పాటు చేసి, పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది తమ ఎజెండా అని’ లోకేశ్ వెల్లడించారు.
అనంతరం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. గంగాధర నెల్లూరు, ఎగువ కమ్మ కండ్రిగ గ్రామంలో చెరుకు రైతు పొలానికి వెళ్లిన లోకేశ్ అక్కడ అరక దున్నారు. అక్కడే లోకేశ్ ను బెల్లం రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఏడాది ఓపిక పట్టాలని, అప్పుడు జగన్ రెడ్డినే ఇంటికి పంపిద్దామని లోకేశ్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్లం రైతులను ఆదుకుంటామని బెల్లం రైతులకు భరోసా ఇచ్చారు. యువగళం పాదయాత్రపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. అయినా వెనకడుగు వేసేది లేదంటూ లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నాడు.