Delhi Govt : ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచింది. ఏకంగా 66 శాతం జీతం పెరగడంతో ఒక్కక్క ఎమ్మెల్యే నెలకు 90 వేల రూపాయలు అందుకోనున్నారు. ఇప్పటి వరకు ఈ జీతం 54 వేల రూపాయలుగా ఉండేది.
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచింది. ఏకంగా 66 శాతం జీతం పెరగడంతో ఒక్కక్క ఎమ్మెల్యే నెలకు 90 వేల రూపాయలు అందుకోనున్నారు. ఇప్పటి వరకు ఈ జీతం 54 వేల రూపాయలుగా ఉండేది. గత ఏడాది జూలై 4వ తేదీన ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రస్తుతం ఆ నిర్ణయానికి రాష్ట్రపతి అనుమతి లభించింది. 12 ఏళ్ల తర్వాత మరోసారి ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న మొత్తం 70 మంది జీతాలు ఫిబ్రవరి 14,2023 నుంచి పెరుగుతున్నట్లుగా ఆప్ నేతలు చెబుతున్నారు.
ఎమ్మెల్యేల జీతాలతో పాటు ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రతిపక్ష నాయకుల జీతాలు కూడా పెరిగాయి. గతంలో 72 వేల రూపాయలుగా ఉన్న వారి జీతాలు ఇక నుంచి లక్షా 70 వేలు కానున్నాయి. ఎమ్మెల్యేల బేసిక్ సాలరీ ఇంతకు ముందు వరకు 12 వేల రూపాయలు ఉండేది. అది ప్రస్తుతం 30 వేలకు చేరింది. డైలీ అలవెన్స్ కూడా 1000 రూపాయల నుంచి 1500 రూపాయలకు పెరిగింది.
మాజీ శాసన సభ్యుల పెన్షన్లు కూడా పెరిగాయి. ఇంతకు ముందు కేవలం నెలకు 7500 రూపాయలు అందుకునే వారంతా ఇక నుంచి నెలకు 15,000 రూపాయలు అందుకోనున్నారు.
జీతాల పెంపు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ విప్ దిలీప్ కుమార్ పాండే స్పందించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల జీతాలు పెరిగినప్పటికీ..ఈ జీతాలు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలతో పోల్చితే తక్కువేనని గుర్తుచేశారు.
2015లో ఓ సారి ఢిల్లీ ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు పెంచడానికి ప్రయత్నించింది. 2.10 లక్షల నెల జీతం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ కొట్టిపారేసింది.