మోడర్న్ మీడియా డేస్లో సోషల్ మీడియా అన్నది పెద్ద ఫ్లాట్ఫార్మ్. ఇందులో భావస్వేచ్ఛకి ఎక్కడా అడ్డూఆపూ లేదు. ఎవరైనా ఎలాగైనా కామెంట్ చేసేయొచ్చు. ఎవరిమీదనైనా ఎలాంటి కామెంటైనా పోస్ట్ చేసేయొచ్చు. ఏ వెరపు, భయం అన్నదే లేకుండా ఇష్టానుసారం పిచ్చిరాతలు రాసేయొచ్చు. దీని మీద ఎటువంటి నియంత్రణ ఉండడానికి ఆస్కారమే లేకుండా, సోషల్ మీడియా విచ్చలవిడిగా తయారైపోయింది. వేదికల మీద మాట్లాడే ప్రతీ మాటని, ప్రెస్ మీట్స్లో చెప్పిన ప్రతీ సమాధానాన్ని తమదైన కోణంలో అర్ధం చేసుకుని వాటిని దుయ్యబట్టే రెచ్చిపోతుంటే కూడా ఎక్కడా దానికి పరిష్కారమే కనిపించడం లేదు.
నిన్న కుబేర ఫంక్షన్లో జరిగిన సంఘటనే ఇందుకు బలమైన ఉదాహరణ. నాగార్జున, చిరంజీవి ఇద్దరూ మాట్లాడుతూ మాటలు దాచుకుని, దాచుకుని, ఇద్దరూ వ్యక్తం చేద్దామనుకున్న ఆలోచనలను బాడీ లాంగ్వేజ్ ద్వారా కప్పుకుని మాట్లాడిన సంగతి మీడియా అంతా వాచ్ చేసింది.
రష్మిక గురించి నాగార్జున, చిరంజీవి ఇద్దరూ అప్రిషియేట్ చేస్తూ, ఒకింత సరదాగా మాట్లాడడానికి ట్రై చేసి, మళ్ళీ నాలిక కరుచుకున్నంత పని చేశారు. ముందు మాట్లాడిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రష్మికని నేషనల్ క్రష్ అని మాట్లాడాడు, ఆ మాటకి ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. తర్వాత నాగార్జున, చిరంజీవి ఇద్దరికిద్దరూ కూడా రష్మిక అంటే తమకి కూడా క్రష్ ఉందని ఊరికే ఫంక్షన్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా ప్రారంభించి, మధ్యలో ఎక్కడో గుర్తొచ్చి, చెబుదామనుకున్న మాటలను సవరించుకున్నారు. చిరంజీవిగారు మాట్లాడుతూ ‘’నాకు చెప్పాలని ఉంది. రష్మిక గురించి. నాకూ కూడా మనసులో ఎంతో క్రష్ ఉంది. అని అనను, కానీ మనసులో అనుకుంటాను’’ అని వంకలు తిరిగిపోతూ చెప్పారు. ఇది ఆయన విషయంలో కొంత ఎబ్బెట్టుగా కనిపించింది.
ఆయన రేంజ్కి ఆయన ఓ యంగ్ హీరోయిన్ గురించి ఆహ్లాదకరంగా మాట్లాడగలిగే ఓ గొప్ప స్థాయి ఉన్న స్టార్. కానీ భయం. ఎవరు ఎలాటి మీమ్స్ చేస్తారో, ఎవరు ఎలాటి కామెంట్లు పోస్ట్ చేస్తారో….ఏమో అనే బెదురు. దేవిశ్రీప్రసాద్ మాత్రం కేవలం సంబోధిస్తున్నప్పుడే అన్నాడు. నేషనల్ క్రష్ అని. దాన్ని కంటిన్యూ చేస్తూ మాట్లాడవలసి వచ్చినప్పుడు నాగార్జున, చిరంజీవి మాత్రం కిందనుంచి మీద వరకూ మెలికలు తిరిగిపోయారు అలాగని రష్మిక గురించి మాట్లాడకుండా పక్కన పెట్టలేకపోయారు. అలాగని స్వేచ్ఛగా చెప్పాలనుకున్నది చెప్పలేకపోయారు. ఇదంతా దేని కారణంగా అనుకుంటున్నారు? సోషల్ మీడియా దెబ్బ.