RR: మియాపూర్ మెట్రో పార్కింగ్ వద్ద పరిసరాలు దారుణంగా మారాయి. కల్వరి టెంపుల్ వద్ద చెత్తను క్లియర్ చేసే సిబ్బంది అక్కడే తగలబెట్టడంతో పరిసరాలు అధ్వానంగా కనిపిస్తున్నాయి. వాహనాలు పార్కింగ్ చేసే వారికి, అటువైపుగా వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇంత అస్వచ్ఛంగా ఉన్నా సరే అధికారులు సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
BNR: చిన్నారులకు ఇవ్వాల్సిన బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలడంతో జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంగన్వాడి టీచర్లను సస్పెండ్ చేశారు. వారి వివరాలిలా.. జిల్లాలో ఓ పశువుల పాకలో బాలామృతం లభ్యమవ్వగా అధికారులు విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. గుట్ట కేంద్రంలో -3,మోత్కూర్లోని 7 కేంద్రాల్లోని టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
KMR: ఎల్లారెడ్డి మత్స్యకారులు ప్రభుత్వ సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. లింగంపేట మండలం బాయంపల్లి గ్రామంలో ఐకేపీ ఆర్థిక సహకారంతో చేపల పెంపకం, చేపల దాణా తయారీ, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం యూనిట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మత్స్య శాఖాధికారి శ్రీపతి ఉన్నారు.
KMR: చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండు తరలించినట్లు ఎస్సై సుధాకర్ మంగళవారం తెలిపారు. లింగంపేట్ మండలం నల్లమడుగుకు చెందిన రహీం ఈ నెల18న ఇంటికి తాళంవేసిబయటకు వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటితాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు అపహరించారని ఫిర్యాదు చేశారు. గాంధారికి చెందిన సాయిలును పట్టుకొనివెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
HYD: గత పదేళ్లలో ప్రయాణికుల భద్రత కోసం సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో 133 సీసీ కెమెరాలతో భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేసినట్లుగా తెలిపారు. నిర్భయ నిధితో 34 స్టేషన్లో 1160 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుకు ప్రతిపాదించారు. అంతేకాక రూ.700 కోట్లతో ప్రారంభించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు 36 నెలల్లో పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
KMR: అనారోగ్యంతో బాధపడుతూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేట్ మండలంలో జరిగింది. ఎస్సై సుధాకర్ వివరాల ప్రకారం.. మోతే గ్రామానికి చెందిన కిష్టయ్య(46) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
HYD: అమీర్పేట డివిజన్ శ్రీనివాసకాలనీ నుంచి హాల్ జంక్షన్ వెళ్లే మార్గంలో రోడ్ల పక్కన చెత్త పేరుకుపోయింది. శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతో రోడ్ల పక్కన చెత్త అలాగే ఉండిపోయింది. ప్రతిరోజు వచ్చే స్వచ్ఛ ఆటో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాలనీ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
HYD: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా మహోన్నతమైన ఆయన జీవన ప్రస్థానాన్ని కళ్లకు కట్టేలా ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది కలిసి నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్ర నాయకులు, కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
NRML: ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన ఈరోజు నర్సాపూర్(జి)మండలంలో జరిగింది. ఎస్సై సాయి కిరణ్ వివరాల మేరకు మండలంలోని గొల్లమాడ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహిస్తుండగా తిరుపతి అనే వ్యక్తి సెక్రటరీ పై బూతులు తిడుతూ విధులకు ఆటంకం కలిగించగా, వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
WGL: జిల్లా కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం డిస్ట్రిక్ట్ న్యూట్రిషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోషకాహార లోపాన్ని తరిమికొట్టాలంటే కౌమార దశలో ఉన్నటువంటి బాల బాలికలను, వారిలో ఉన్న అనారోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి అవసరమైన చికిత్సను అందించాలని కోరారు.
WGL: ప్రేమ, సహనం, త్యాగం, దాతృత్వమనే సుగుణాల ఆచరణ ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించిన ఏసుక్రీస్తు జీవనం మనందరికీ ఆదర్శనీయమైనదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఏసుక్రీస్తు జన్మదినోత్సవమైన క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25ను పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
MBNR: మాగనూర్ మండలంలోని పుంజానూర్లో ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నా ఉపాధ్యాయులు లేరని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వం చెప్తున్నా పాఠశాలలో మాత్రం ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.
VKB: తాండూరు మండలంలోని నీలాయపల్లికి కూత వేటు దూరంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మేతకు వెళ్లిన దూడపై పులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన విషయం తెలియడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దూడపై దాడి చేసింది పెద్దపులా.. చిరుత పులా అనేది తెలియాల్సి ఉంది. దూడపై పులి దాడికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ని మంగళవారం కలిసి పలు ఆహ్వాన పత్రికలు, వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అక్రమంగా రవాణ చేస్తున్న మద్యం బాటిళ్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైల్లో రూ.2.50 లక్షల విలువైన 76 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఏపీ, చంఢీగఢ్ రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.