ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ జనవరి 1వ తేదీన పీఎస్ఎల్వీ-సీ58తో పాటు గగనతలంలోకి పంపిన ఫ్యుయల్ సెల్ను విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరును విశ్లేషించడంతో పాటు డేటాను సేకరించింది. భారత అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్తు మిషన్ల కోసం దీనిని అభివృద్ధి చేశారు. పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యుయల్ సెల్గా దీనిని వ్యవహరిస్తున్నారు. ఇది రసాయన చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేసి కేవలం నీటిని మాత్రమే వదులుతుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల నుంచి రసాయన చర్య జరిపి 180 వాట్ల శక్తిని విడుదల చేసింది.
పీఎస్ఎల్వీ-సీ58 వాహననౌకతో ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని కూడా పంపారు. ఇదే వాహకనౌక చివరి దశలో మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో ఫ్యుయల్ సెల్ పవర్ సిస్టమ్ కూడా ఒకటి. ఎక్స్పోశాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోశాట్ లక్ష్యమని వివరించారు. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ తర్వాత ఇలాంటి ప్రయోగం చేయడం మనమేనని వెల్లడించారు.