ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) తెలంగాణ పర్యటన సందర్బంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పలు ఆంక్షలు విధించారు. ఏప్రిల్ 8న హైదరాబాద్కు రానున్నారు. ప్రధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) పునురుద్దరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను (Vande Bharat Express) జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు పదో నంబర్ ప్లాట్ ఫారంతో పాటు రైల్వే స్టేషన్ లో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీనిపై రైల్వే సిబ్బంది ప్రయాణికులకు ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నారు. పదో నంబర్ ప్లాట్ ఫారంపైకి వచ్చే రైళ్లను మిగతా ప్లాట్ ఫారాలపైకి మళ్లిస్తున్నారు. పధాని పర్యటన సందర్భంగా సెంట్రల్ పోలీస్, సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్(RPF), ఐబీ ఇంటెలిజెన్స్ పోలీసులతో ప్లాట్ ఫారం 10 పై సెక్యూరిటీ ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ సీసీ కంట్రోల్ రూంలో ఆర్పీఎఫ్ ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. తొలుత వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దేందుకు రూ.715 కోట్లతో చేపట్టబోయే పునరుద్ధరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.
చదవండి : జార్ఖండ్ మంత్రి కన్నుమూత.. సీఎ: దిగ్భ్రాంతి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో(Union Minister Kishan Reddy)పాటు పలువురు బీజేపీ అగ్ర నాయకులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను సందర్శించారు. ఈనెల 8న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం పనులు ప్రారంభించడం కోసం ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు రైల్వేస్టేషన్ను సందర్శించారు. కిషన్రెడ్డితో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి(Marri Shasidhar Reddy) ప్రధాని కార్యక్రమం జరగనున్న 10వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్(Dr. Laxman) మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్గౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి పాల్గొన్నారు.
చదవండి : నాకు శుభాకాంక్షలు’ చెప్పొద్దు అంటూ RGV విజ్ఞప్తి

