HYD: ఇంటి నుంచి పని కోసం బయటికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన జవహర్నగర్ PS పరిధిలో జరిగింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. BJR నగర్లో పార్వతమ్మ కుమార్తె భానుప్రియ(18) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే బుధవారం ఉదయం పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
HYD: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని బాలనగర్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు అన్నారు. శుక్రవారం రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి గిరినగర్ పోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు తమకు సహకరించాలని, ఒక్క సీసీ కెమెరా నిఘా వేయి కళ్లతో సమానమని పేర్కొన్నారు.
WNP: పెబ్బేరు PHC లో 102 సేవలను శుక్రవారం జిల్లా 102 సేవల అధికారి రత్నమయ్య తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అత్యవసర అమ్మఒడి సేవలు రాత్రి కాల సమయంలో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. గర్భిణులను నెలవారి పరీక్షల కోసం ఆసుపత్రులకు తీసుకెళ్లే అమ్మఒడి వాహనాల సేవలను అంతరాయం లేకుండా నిరంతరం 24 గంటలు సేవలు అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
HYD: రైల్వే ట్రాక్ సమీపంలో శిశువును వదిలివెళ్లిన ఘటన ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మారుతీ నగర్లోని భూలక్ష్మమ్మ దేవాలయం సమీపంలోని చెత్తకుప్పలో శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శిశువును పోలీసులు కాపాడి నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
SRPT: జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించే సమావేశానికి పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య కోరారు. శుక్రవారం కోదాడ యూనిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సకాలంలో సంఘం సభ్యులందరూ హాజరు కావాలని కోరారు.
HYD: ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రేవంత్ (25) అమీర్పేట్లో టెక్నికల్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం అవుషాపూర్ సమీపంలో షిర్డీ ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
WNP: చెరుకు పంట సాగు గిట్టుబాటు కాక జిల్లా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొత్తకోట, మదనాపురం, చిన్నచింతకుంట, అమరచింత, ఆత్మకూరు మండలాలలో సుమారు 1000 మందికి పైగా రైతులు చెరకు సాగు చేస్తున్నారు. చెరుకును రామకృష్ణాపూర్ షుగర్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. అమరచింత రైతులు మాట్లాడుతూ.. ఎకరాకు 50 టన్నుల చెరకు దిగుబడి వస్తే లాభమని, 25 నుంచి 30 టన్నులే వస్తుందన్నారు.
MBNR: సిద్దిపేటలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్య సమితి సభ్యురాలుగా సౌమ్య జడ్చర్ల శాఖ నుంచి శుక్రవారం ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్య సమితి సభ్యురాలుగా నియమించినందుకు ఏబీవీపీ తెలంగాణ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తానని తెలిపారు.
MBNR: మహిళలు అంటే అబల కాదు సబల అని నిరూపించాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ హాస్టల్స్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికలు (సి) హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
NLG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో NLG పట్టణంలో నిర్వహించే నేటి కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలన్నింటిని వాయిదా వేయడం జరిగిందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు గమనించాలని కోరారు.
JGL: మల్యాల క్రాస్ రోడ్కి వెళ్లే బ్రిడ్జి వద్ద ఇసుక ప్రమాదకరంగా మారింది. ఇసుకతో పాటుగా, అక్కడ మూలమలుపు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక వల్ల రాత్రి పూట వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు చర్య తీసుకొని ఇసుకను తొలగించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరారు.
KNR: క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ బొమ్మకల్లో ఎల్పిఎల్ లీగ్ పోటీల ముగింపు సమావేశంలో అయన పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోపీలను, నగదును ఆయన అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు.
WNP: జిల్లాలోని నిరుద్యోగులకు 5 ప్రైవేటు కంపెనీలలో పని చేయడానికి ఈనెల 30న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. మొత్తం 460 ఖాళీలు ఉన్నాయని, 18-35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. ఆధార్ కార్డు, అర్హత సర్టిఫికెట్లతో PMKK సెంటర్, రామాలయం, సాయి నగర్ కాలనీలో సోమవారం హాజరు కావాలని పేర్కొన్నారు.
KNR: చొప్పదండి మండలం రాగంపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో, 7వ తరగతి చదువుతున్న ఉడుత రిత్విక అనే విద్యార్థిని, సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఈ నెల 29 వరకు సరూర్ నగర్లో జరిగే ఆట్య పాట్య ఛాంపియన్ షిప్లో ఆమె పాల్గొంటున్నారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు.
KNR: సీఎం కప్ పోటీలలో భాగంగా కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జూడో రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించే ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పిస్తూ సంతాపం ప్రకటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పోటీలను ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి జనార్దన్ రెడ్డి, జిల్లా క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్ ప్రారంభించారు.