నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. కుప్పం వరదరాజ స్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా.. నిన్న 8వ రోజు బంగారుపాళ్యం వద్ద 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. వంద కిలోమీటర్ల మైలురాయికి వేదికగా నిలువడంతో అక్కడ శిలాఫలకం ఆవిష్కరించారు. పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సమయంలో పోలీసులు అతిగా స్పందించారు. లోకేశ్ కాన్వాయ్లోని మూడు వాహనాలను సీజ్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చిత్తూరు నుంచి శ్రీకాకుళంలో గల ఇచ్చాపురం వరకు 400 రోజుల పాటు నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టనున్నారు. అన్ని వర్గాలతో మమేకం అవుతున్నారు. యాత్రకు అందరినుంచి, ముఖ్యంగా యువత నుంచి మంచి స్పందన వస్తోంది. బడుగు, బలహీన వర్గాలను జగన్ సర్కార్ మోసం చేసిందని లోకేశ్ అంటున్నారు. తమ ప్రభుత్వం వస్తే వారి సమస్యలను తీరుస్తామని హామీ ఇస్తున్నారు.